‘నమస్తే తెలంగాణ, ముల్కనూరు ప్రజాగ్రంథాలయం’ సంయుక్తంగా నిర్వహించిన ‘కథల పోటీ-2021’లో రూ.వెయ్యి బహుమతి పొందిన కథ.
“ఒకసారి ఆలోచించు కీర్తి! ఇంకో పది రోజుల్లో శ్రీజకు ఐదేళ్లు నిండుతాయి. ఇంకా ఆలస్యం చెయ్యకు. దానికి తోడుగా చెల్లెలో, తమ్ముడో ఉంటే ఆడుకుంటుంది కదా! పెద్దయ్యాక కష్టసుఖాల్లో తోడబుట్టిన వాళ్లు తోడుగా ఉంటారు”.. ఇంకా ఏదో చెప్పబోతున్న తల్లి సుశీల మాటల్ని మధ్యలోనే అడ్డుకుంది కీర్తి. “అమ్మా! ఎప్పుడూ ఈ టాపిక్ తప్ప ఇంకోటి మాట్లాడవా? నీకు చాలాసార్లు చెప్పాను. శ్రీజకు మేం ఏ విషయంలోనూ తక్కువ చెయ్యడం లేదు. మంచి స్కూల్లో చదివిస్తున్నాం. చాలా మంచి బొమ్మలు కొనిస్తున్నాం. మంచి యాక్టివిటీ ఉన్న క్లాసులు చెప్పిస్తున్నాం. అంతకంటే ఏం కావాలి? తను ఎంతో హాయిగా, సంతోషంగా ఉంది. ఇంకొకళ్లుంటే తలనొప్పే! నర్సరీ క్లాసులో చేర్పించాలంటేనే ఒకటిన్నర
లక్ష తీసుకుంటున్నారు. అదీ కాస్త డీసెంట్గా ఉండే స్కూల్లో చేర్పిస్తే. ఉన్న ఒక్కరిని సక్రమంగా పెంచితే చాలు. తోబుట్టువులు సాయం చేస్తారనే ఆశలు పెట్టుకోకు. మీలాగా ఇప్పటివాళ్లు లేరు. కొట్టుకు చస్తున్నారు” చిరాగ్గా అన్నది కీర్తి.
“ఈ బీదరుపులు ఎందుకే? ఇద్దరూ సాఫ్ట్వేర్ ఇంజినీర్లుగా ఉన్నారు. ఇంకో బిడ్డను ఆమాత్రం పెంచలేరా? మరీ విచిత్రం. తోడుగా ఇంకో బిడ్డ ఉంటే పిల్లలు సంతోషంగా ఉంటారు. ఎంత కొట్టుకున్నా ఒకరి మీద మరొకరికి ప్రేమ ఉంటుంది. ఆ విషయం మర్చిపోకు. రెండో బిడ్డ విలువ వాళ్లు పుట్టాక తెలుస్తుంది. నీకు అనవసరమైన ఆలోచనలు ఎక్కువయ్యాయి. ఇంకా ఆలస్యం చేయకండి”.. కాస్త కోపంగా అన్నది సుశీల.
“అమ్మా ! ఈ విషయం గురించి ఇంక మాట్లాడకు. నాకు చిరాకేస్తున్నది. నీ కన్నా మా అత్తగారు ఎంతో నయం. ఒకసారి చెప్పారు. మా ఇద్దరి అభిప్రాయాలూ చెప్పేశాం. ఆ తర్వాత ఆవిడ, మామగారు ఈ విషయం గురించి మళ్లీ మాట్లాడలేదు. నువ్వే సుత్తి కొడుతున్నావు”.. చిరాగ్గా అంటూ..
“శ్రీజ బర్త్డేకి రెండ్రోజుల ముందే రండి! నాకు కాల్ టైమ్ అయ్యింది.. వస్తా!” అన్నది కీర్తి.
“సరే! అలాగే వస్తాం”.. అన్నది సుశీల.
“ఇప్పుడు తృప్తిగా ఉందా?” అంటున్న భర్త మాటలకు, తలెత్తి అతని వైపు చూసింది.
“ఏమంటున్నారు? అర్థమయ్యేట్లు చెప్పండి”.. అన్నది.
“మీ తల్లీకూతుళ్ల సంభాషణ వినిపిస్తూనే ఉంది. అన్నిసార్లు నీ కూతురికి చెప్పి.. ‘సుత్తి కొట్టొద్దు:’ అనిపించుకోవడం బాగుందా? ఇప్పుడు వాళ్లు పెద్ద వాళ్లయ్యారు. వాళ్ల విషయంలో దూరి మాట్లాడితే బాగుండదు. మనకెందుకు ఈ విషయాలు. హాయిగా, ప్రశాంతంగా ఉండాల్సిన వయసు మనది”.. అన్నాడు మాధవరావు.
“మీరలా అనుకుంటారు గానీ.. నేను అనుకోను. మన పిల్లలకు మంచి, చెడు చెప్పాల్సిన వాళ్లం మనమే. వేరే వాళ్లు చెప్పలేరు. సాధ్యమైనంత వరకు మనం నచ్చజెప్పే ప్రయత్నం చెయ్యాలి. అది మన బాధ్యత”.. అన్నది సుశీల.
“అయితే చెప్పి వాళ్లచేత తిట్టించుకో! నేను మాత్రం చెప్పను”.. అన్నాడు మాధవరావు.
“అలాగే! పిల్లలకు మనం చెబితే బాగుండదని పరాయివాళ్లలా నేను ఉండలేను. సాధ్యమైనంత వరకు ప్రయత్నిస్తాను. ‘పెదవికి మించిన పన్ను’ అని తెలిసిన తర్వాత ఊరుకుంటాను. తల్లిగా నేను కొన్ని విషయాలు చెప్పక తప్పదు”.. అంటూ అక్కడినుంచి వెళ్లిపోయింది సుశీల.
‘తల్లులకు తాపత్రయం ఎక్కువ’.. అనుకుంటూ టీవీలో మొదలైన క్రికెట్ మ్యాచ్ చూడసాగాడు మాధవరావు.
కరోనా ఉధృతి తగ్గడం వల్ల, ఒకే ఊరు కావడం వల్ల చాలా నెలల తర్వాత కూతురి ఇంటికి వెళ్లారు సుశీల, మాధవరావు. తనను చూడగానే సంబురంగా ఎదురొచ్చి, సంతోషంగా కౌగిలించుకున్న కూతురిని చూడగానే.. సుశీలకు కంటనీరు తిరిగింది. “ఎన్నాళ్లయింది సుశీలా నిన్ను చూసి”.. అంటూ కౌగిలించుకున్న తన స్నేహితురాలు, వియ్యపురాలు అయిన ఇందిరను చూసి సుశీల మనసు సంతోషంతో ఉప్పొంగింది. కరోనా వల్ల ఆత్మీయులకు దూరంగా ఉండాల్సి వచ్చినందుకు నొచ్చుకుంటూ.. అందరూ ఆ విషయాల గురించే మాట్లాడుకున్నారు. ఎన్నో రోజుల తర్వాత అమ్మమ్మను, తాతయ్యను చూసిన శ్రీజ.. వాళ్ల దగ్గరే కూర్చుని ఆడుకోసాగింది. మర్నాడు జరగబోయే తన బర్త్డే గురించి అందరికీ చెబుతూ సంబురంగా తిరిగింది.
“శ్రీజ కోసం ఆన్లైన్లో బొమ్మ తెప్పిస్తానని అన్నావు. తెప్పించావా?” ఆత్రుతగా అడిగింది సుశీల.
“తెప్పించానమ్మా! అదే సెలెక్ట్ చేసుకుంది. వీడియోలో చూసి ఆ బొమ్మ కావాలంది. అందుకే దాన్ని ప్రత్యేకంగా తెప్పించాను. ‘మీ గిఫ్ట్!’ అని చెప్పాను. రేపు రాత్రి వరకు శ్రీజకు చూపించను. సర్ప్రైజ్. అమెజాన్లో వచ్చింది”.. అన్నది కీర్తి.
“పోనీలే దానికి నచ్చింది. సంతోషం. మాకు ఇవన్నీ తెలియవు. అందుకే నీకు చెప్పాను.. తెప్పించమని” అన్నది సుశీల.
“బయటి ప్రపంచంతో సంబంధం లేకపోయే సరికి ఆన్లైన్ వాళ్ల పంట పండింది” అన్నది ఇందిర.
“నిజమే ఇందూ! బైటికి వెళ్లాలంటే భయపడే పరిస్థితి కాబట్టే.. ఒకే ఊర్లో ఉన్నా ఆరు నెలల తర్వాత మీ ఇంటికొచ్చాను. ఎంత భయంకరమైన పరిస్థితో చూడు” అన్నది సుశీల.
“మా మాధురి వాళ్లు పక్క బిల్డింగ్లో ఉండే ఫ్లాట్లో చేరడం వల్ల నాకు అంత ఇబ్బంది కలగలేదు. లేకపోతే నీలాగే బాధపడే దాన్నేమో” అన్నది ఇందిర.
“నిజం! మాధురి కూతురు పూజి, శ్రీజ ఒకే వయసు కాబట్టి ఇద్దరూ కలిసి ఆడుకుంటున్నారు. లేకపోతే శ్రీజ సతాయించేది” అన్నది కీర్తి. చాలారోజుల తర్వాత కలిసిన సుశీల, ఇందిర కాలేజీ రోజుల నుంచి.. మనవరాళ్ల పుట్టుక వరకు ఎన్నో సందర్భాల్లో తాము కలిసి ఆనందించిన మధురమైన ఘట్టాలను జ్ఞప్తికి తెచ్చుకుంటూ కబుర్లు చెప్పుకొన్నారు.
కొవిడ్ ప్రభావం తగ్గినా, ఐదారు మంది పిల్లలను మాత్రమే శ్రీజ పుట్టినరోజు వేడుకకు పిలిచింది కీర్తి. పిల్లల కేరింతల మధ్య, ఆటల మధ్య ఆనాటి సాయంత్రం సందడిగా గడిచింది. శ్రీజ తమకు ఇచ్చిన రిటర్న్ గిఫ్ట్లను తీసుకుని వెళ్లిపోయారు పిల్లలు.
తమ పేర్లతో ఉన్న బహుమతులను శ్రీజకు అందించారు ఇందిర, సుశీల దంపతులు. తల్లి సహాయంతో ఆ గిఫ్ట్ బాక్స్లను తీసి.. బొమ్మలను చూసిన శ్రీజ కళ్లు సంతోషంతో మెరిశాయి. అధునాతనమైన వంటింటి సామాను, ముద్దుగా ఉన్న ఆడపిల్ల బొమ్మ తెగ నచ్చేసి.. వాటితో ఆడటం మొదలు పెట్టింది శ్రీజ.
“అమ్మమ్మా! ఈ బొమ్మ పేరు ‘లైవ్ డాల్’. ఇది నీళ్లు తాగుతుంది తెలుసా?” ముద్దుముద్దుగా అన్నది శ్రీజ.అందరూ ఆసక్తిగా ఆ బొమ్మ వైపు చూశారు. ముద్దుగా ఉన్న ఆ విదేశీ బొమ్మ నోరు కాస్త తెరిచినట్లుగా ఉంది. చిన్న చెంచాతో గ్లాస్లోంచి నీళ్లు తీసుకొచ్చి.. ఆ బొమ్మ నోట్లో పోసింది. ఆ నీళ్లు బొమ్మ గొంతులోకి వెళ్లిపోయాయి. శ్రీజ సంబురంగా అమ్మమ్మ వైపు చూసింది.
“చూశావా? బొమ్మ నీళ్లు తాగేసింది”.. అన్నది. అందరికీ చూసేందుకు సరదాగా అనిపించింది. ఆసక్తిగా చూడసాగారు. శ్రీజ బొమ్మ ఫ్రాక్ను పైకి జరిపి.. తడిసిన డైపర్ను, బొమ్మను చూపించింది.
“చూశావా! బామ్మా! బొమ్మ నీళ్లు తాగింది కదా! ఇప్పుడు ‘సు సు’ పోయింది”.. అంటూ బొమ్మకు డైపర్ మార్చింది. అందరూ పెద్దగా నవ్వారు.
“ఈ బొమ్మ నీళ్లు తాగుతుంది. సు సు పోతుంది. అందుకే దీన్ని ‘లైవ్ డాల్’ అంటారు”.. అంటూ తనకు చేతనైన భాషలో చెప్పింది శ్రీజ. సుశీల, ఇందిర ఒకరినొకరు చూసి నవ్వుకున్నారు.
“నీళ్లు తాగడం, సు సు పోవడం తప్ప ఈ బొమ్మ ఇంకే పనిచెయ్యదా? ఇదేనా లైవ్ డాల్ ?”.. గొంతు తగ్గించి మెల్లగా ఇందిరతో అన్నది సుశీల. ఇద్దరికీ నవ్వాగ లేదు.
“అయినా ఇదెక్కడి ఖర్మే! చిన్నపిల్లలు హాయిగా ఆడుకోకుండా నీళ్లు తాగించడం, పొత్తి గుడ్డలు మార్చడం.. ఇదేం ఆట? పెద్దయ్యాక ఎలాగూ తప్పదు. ఇంత చిన్నవయసులో కూడా ఇదే ఆటా?”.. నవ్వుతూనే చిరాకు పడింది సుశీల. ఇద్దరూ గొంతు తగ్గించి మాట్లాడుకున్నారు. కీర్తికి అర్థమై నవ్వుకుంది.
“ఏం చెయ్యనమ్మా? ఈ బొమ్మే కావాలని గోల. అందుకనే తెప్పించాను” అన్నది.
“ఈ బొమ్మ ధర ఎంత?” అడిగింది సుశీల.
“మూడు వేల ఐదొందలు”.. చెప్పింది కీర్తి.
“మూడు వేల ఐదొందలా?” ఆశ్చర్యంతో నోరెళ్లబెట్టింది సుశీల.
“అవునమ్మా!” అన్నది కీర్తి. సుశీలకు ఆ విషయం మింగుడు పడలేదు. డైపర్లు మారుస్తున్న మనవరాలిని చూస్తుంటే ఏమనాలో అర్థం కాలేదు.
“ఆ డైపర్లు కూడా టిష్యూ పేపర్లతో చేసినట్లు ఉన్నాయి. పడెయ్యక తప్పదు. అలాంటివి ఆరో ఏడో ఇచ్చారు. గంటలోనే ఖాళీ అయిపోతాయి. ఫారెన్ బొమ్మలు.. అబ్బో అనుకుంటాం. ఎంత దోపిడీ! ఆ బొమ్మ కూడా చూసేందుకు అంత గొప్పగా లేదు. బొమ్మలో పైనుంచి కింది వరకూ గొట్టం పెట్టి ఎంత దోపిడీ చేశారు! ఎంత దండగ! రెండ్రోజులు ఆడాక పిల్లలు ఒక పక్కన పడేస్తారు”.. సుశీల మాటలు విని ఇందిర నవ్వాపుకోలేక అవస్థ పడింది. కాసేపటికి ఇద్దరూ కుదుటపడ్డారు.
‘పోనీలే! పిల్ల ఇష్టపడి ఆడుకుంటుంది’.. అని సర్దుకున్నారు. ఆ బొమ్మతో ఆడుకునేందుకు తనవెంట తిరుగుతున్న పూజికి బొమ్మను ఇవ్వకుండా శ్రీజ కోప్పడటం సుశీల దృష్టిలో పడింది.
“అలా చెయ్యకూడదు శ్రీజా! పూజితో కలిసి ఆడుకోవాలి!” అంటూ నచ్చజెప్పింది. మాధురి ఆహ్వానం మేరకు ఓ రోజు సుశీల, ఇందిర.. వాళ్ల ఇంటికి వెళ్లారు. భోజనాలయ్యాక కబుర్లలో పడ్డారు.
“పూజి! అన్నం తిన్నదా?” అంటున్న ఇందిరతో.. “లేదమ్మా! అది రెండు రోజులుగా సరిగా తినడం లేదు. పేచీ పెడుతున్నది. శ్రీజకు కొనిచ్చిన ‘లైవ్ డాల్’ తనకూ కావాలని గొడవ. శ్రీజ కూడా చిన్నపిల్ల కదా! దాని బొమ్మ.. దీనికి ఇవ్వదు. ఇది కూడా అలాగే చేస్తుంది. కొనిస్తానంటే వినదు. అర్జెంట్గా కావాలంటూ మారాం చేస్తున్నది. ఆ బొమ్మ కొనడం వేస్ట్ అని అందరూ అంటుంటే.. నిజమే అనిపిస్తున్నది. కానీ ఇవన్నీ పిల్లలకు అర్థం కావు. ఆ బొమ్మ కావాలని ఒకటే ఏడుపు. పిల్లలు అడగ్గానే కొనిస్తూ ఉంటే.. అదే అలవాటైపోతుందని భయంగా ఉంది. అందుకే నేను ఆ బొమ్మ కోసం ఆర్డర్ చేయలేదు” విషయం చెప్పింది మాధురి. ఇంతలో నెలల పాపాయిగా ఉన్న చిన్న కూతురు కావ్య ఏడవడంతో.. పాపను సముదాయించ సాగింది. ఇందిర, సుశీల.. పూజిని మాట్లాడించే ప్రయత్నం చేశారు. పూజి పెద్దగా ఏడుస్తూ..
“అమ్మమ్మా!” అంటూ ఇందిర ఒళ్లో వాలింది.వెక్కిళ్ల మధ్య ‘లైవ్ డాల్’ కావాలని చెప్పింది. ఇందిరకు ఎలా సముదాయించాలో అర్థం కాలేదు.
“చూడు పూజీ! బొమ్మకోసం ఇలా ఏడుస్తారా? నీ దగ్గర ఎన్నో బొమ్మలున్నాయి. ఇవే బాగున్నాయి. అమ్మ, నాన్న నీకు ఎన్నో మంచి బొమ్మలు కొనిచ్చారు కదా!? ఆ లైవ్ డాల్ బొమ్మ బాగాలేదు”.. అన్నది.
“లేదు అమ్మమ్మా! చాలా బాగుంది. నేను కొనుక్కుంటా”.. అన్నది ఏడుస్తూ. సుశీల వైపు చూసింది ఇందిర.
“వినే స్థితిలో లేదు”.. మెల్లగా సుశీలకు మాత్రమే వినిపించేలా అన్నది. పూజి చెయ్యి పట్టుకుని ముద్దు పెట్టుకుంది సుశీల.
“పూజీ! శ్రీజ లైవ్ డాల్ నిజంగా బాగా లేదు. ఆ బొమ్మ నీళ్లు తాగుతుందని అనుకుంటున్నావా? అది నిజంగా తాగదు. దాని గొంతులో ట్యూబ్ లాగా పెట్టారు. మనం నీళ్లు పోస్తే.. అవి ట్యూబ్లోకి వెళ్తాయి. మళ్లీ కిందికి వస్తాయి. అది సు సు అనుకుని డైపర్ మారుస్తున్నది శ్రీజ”.. అంటూ చెప్పింది. సుశీల వైపు చూసింది పూజి.
“నిజమా?”.. అన్నది.
“అవును పూజీ! అది నిజం. ఆ బొమ్మ నవ్వుతుందా?..” అంటూ సుశీల అడిగిన ప్రశ్నకు..
“నవ్వదు!” అంటూ సమాధానం ఇచ్చింది పూజి.
“పోనీ నువ్వు పిలిస్తే నీ వైపు చూస్తుందా?”.
“చూడదు!”.
“నువ్వు ఆడిస్తే ఆడుకుంటుందా?”.
“ఆడుకోదు!”.
“అలాంటప్పుడు అది లైవ్ డాల్ ఎలా అవుతుంది? లైవ్ డాల్ అంటే కదులుతూ ఆడాలి కదా?”.. సుశీల మాటలకు ఆలోచనలో పడింది పూజి. కేరింతలు కొడుతూ, పాకుతూ, చిరునవ్వులు చిందిస్తున్న చిన్న మనవరాలు కావ్యను ఎత్తుకొని పూజి పక్కన కూర్చుంది ఇందిర. కావ్య కేరింతలకు పూజి నవ్వసాగింది. మళ్లీ బొమ్మ గుర్తుకు వచ్చి పేచీ పెట్టింది.
“చూశావా పూజీ! పాపాయి నిన్ను చూసి నవ్వుతుంది. ఆడుకుంటుంది. పాలు తాగుతుంది. నువ్వు కూడా పాపతో ఆడుకోవచ్చు. ఇంకొంచెం పెద్దదైతే ఈ బుజ్జి పండు మాట్లాడుతుంది కూడా. కానీ, లైవ్ డాల్ ఇవన్నీ చేయలేదు కదా!? ఇప్పుడు చెప్పు.. నీ చెల్లి బాగుందా? ఆ బొమ్మ బాగుందా?” అడిగింది సుశీల.
“చెల్లే బాగుంది. ఆ బొమ్మ పిచ్చిది”.. అంటూ చెల్లెల్ని ముద్దు పెట్టుకుంది పూజి.
“రక్షించావు సుశీలా!” అంటూ పూజికి అన్నం తినిపించింది ఇందిర. మూడు రోజులు గడిచాయి.
“ఈ పిచ్చిబొమ్మ నాకొద్దు. ఇది నీళ్లు తాగుతుంది. సు సు పోతుంది. అంతే! చెల్లెలు, తమ్ముడు ఉంటే నవ్వుతారు. నాతో ఆడుకుంటారు. నాకు బుజ్జిపండు లాగా చెల్లెలు కావాలి”.. అంటూ ఏడుస్తున్న శ్రీజను చూసి, ఇంట్లో అందరూ ఆశ్చర్యపోయారు.ఎవరెంత సముదాయించినా శ్రీజ కుదుటపడలేదు.
“పూజీయే చెప్పింది! ఇది పిచ్చిబొమ్మని. చెల్లెలు బాగుంటుందని” ఎక్కెక్కి ఏడుస్తూ అన్నది శ్రీజ.
“పొరపాటు చేశాను ఇందూ! పూజిని సమాధాన పరిచేందుకు అన్న మాటలు.. ఇలా ఇంకో సమస్యను తెచ్చిపెడతాయని అనుకోలేదు”.. దిగులుగా అంటున్న సుశీలను ఓదార్చింది ఇందిర.
“చిన్నపిల్లల మాటలు పట్టించుకోకు. ఈరోజు ఇలా అన్నా.. మళ్లీ మర్చిపోతారు” అన్నది ఇందిర. మరో రెండ్రోజుల తర్వాత తమ ఇంటికి వెళ్లారు సుశీల, మాధవరావు.మూడు నెలలైనా.. చెల్లెలు కావాలంటూ శ్రీజ అడుగుతూనే ఉందని ఇందిర ద్వారా తెలిసినప్పుడు, సుశీల తనను తాను మరోసారి తిట్టుకుంది.
ఏడాది తర్వాత రెండో మనవరాలి బారసాల చూస్తున్న సుశీల కళ్లు ఆనందాశ్రువులతో నిండిపోయాయి. చెల్లెల్ని ప్రేమగా చూస్తూ సంబుర పడుతున్న శ్రీజను, పాపాయిని ముద్దు పెట్టుకుంటున్న తన కూతురు కీర్తిని చూస్తుంటే.. మనసులోని దిగులు మాయమైంది. తెలియని ఉత్సాహం, సంతోషం మనసులో నిండాయి. తడిబట్టతో శ్రీజ బొమ్మల మీద ఉన్న మట్టిని తుడుస్తున్న సుశీలకు ‘లైవ్ డాల్’ కనిపించింది. దాన్ని కూడా శుభ్రం చేసింది. ‘ఒక ప్రాణం లేని బొమ్మ.. ఒక జీవి పుట్టేందుకు ఎంత దోహదం చేసింది?!’.. అనుకుంటూ నవ్వుకుంది.
హైమవతి కలివె.. హైమా భార్గవ్ కలం పేరుతో రచనలు చేస్తున్నారు. చెన్నైలో పుట్టి పెరిగారు. ఇంటర్మీడియెట్ రోజుల్లో రాసిన మినీ కథ.. ‘ఐస్క్రీమ్’ ఆంధ్రజ్యోతి దీపావళి సంచికలో ప్రచురితమైంది. ఆంధ్రజ్యోతి దినపత్రికలో అనేక వ్యాసాలు, పేరడీలు రాశారు. 90వ దశకంలో ‘రచన’ మాసపత్రికలో ‘భామా ప్రలాపం’ శీర్షికన హాస్య, వ్యంగ్య రచనలు చేశారు. ఇప్పటివరకు 11 నవలలు రాశారు. 1997లో స్వాతి వీక్లీ నిర్వహించిన పది వారాల సీరియల్ పోటీలో ‘రాగాలు మారాయి’ నవలకు బహుమతి వచ్చింది. ‘మనసున మనసై’ నవల స్వాతి మాస పత్రికలో ప్రచురితమైంది. నీలాంబరి, అమృత వర్షిణి, బృందావనం, సౌందర్య లహరి, మనోభిరామం, మధుమతి, ఒక పూల బాణం, నల దమయంతి నవలలు ప్రముఖ దిన, వార పత్రికల్లో ప్రచురితమయ్యాయి. ‘శ్రీకృష్ణ దేవరాయలు’ నవలకు ‘సిరికోన సాహితీ వాక్స్థలి’లో నిర్వహించిన పోటీలో ప్రత్యేక బహుమతి వచ్చింది. ఆకాశవాణిలో కొన్ని కథలు, ఓ రేడియో నాటకం ప్రసారమయ్యాయి.
-హైమా భార్గవ్
83339 83542