AP News | మగబిడ్డ పుడితే.. ఆడబిడ్డ పుట్టిందని సమాచారం ఇచ్చారని గుంతకల్లులోని ఓ ఆస్పత్రి నిర్వాకంపై బాధిత కుటుంబసభ్యులు ఆందోళన చేపట్టారు. అనారోగ్య సమస్యలు ఉన్నాయని నెల రోజులపాటు శిశువును చూపించకుండా ఉన్నారని.. చివరకు కర్నూలు ఆస్పత్రిలో పరీక్షలు నిర్వహించే సమయంలో మగబిడ్డ అని తేలిందని ఆరోపించారు. ఈ మేరకు ఆస్పత్రి ఎదుట ధర్నా చేపట్టారు.
బాధితులు తెలిపిన వివరాల ప్రకారం.. అనంతపురం జిల్లా గుంతకల్లు మండలం నక్కనదొడ్డి గ్రామానికి చెందిన రవిశంకర్, భార్గవి భార్యభర్తలు. ఎనిమిది గర్భిణీ కావడంతో మే 3వ తేదీన ఓ నర్సింగ్ హోమ్కు పరీక్షల నిమిత్తం వెళ్లారు. అయితే అక్కడ భార్గవిని పరీక్షించిన వైద్యులు.. ఆమెకు రక్తపోటు ఎక్కువగా ఉందని, ఇది చాలా ప్రమాదమని చెప్పారు. వెంటనే ఆపరేషన్ చేసి బిడ్డను బయటకు తీశారు. అనంతరం వారికి ఆడబిడ్డ జన్మించిందని భార్గవి తల్లిదండ్రులకు వైద్యులు సమాచారం అందించారు.
పుట్టిన వెంటనే బిడ్డకు అనారోగ్య సమస్య ఉందని, స్థానిక ప్రైవేటు చిల్డ్రన్స్ ఆస్పత్రికి తరలించారు. అక్కడే ఐసీలో పెట్టారు. కొన్ని రోజుల తర్వాత శిశువుకు వాపు ఉందని, కర్నూలు ఆస్పత్రికి తీసుకెళ్లాలని వైద్యులు కుటుంబసభ్యులకు సూచించారు. అప్పటివరకు బిడ్డను తల్లిదండ్రులకు చూపించలేదు. కాగా, కర్నూలు ఆస్పత్రికి తీసుకెళ్లి వివిధ స్కానింగ్లు చేసిన తర్వాత ఆ శిశువు మగబిడ్డ అని తేలింది. దీంతో డెలివరీ అయిన నర్సింగ్ హోం వద్ద బాధిత కుటుంబసభ్యులు ఆందోళన చేపట్టారు. మగ బిడ్డ పుడితే ఆడబిడ్డ అని ఎందుకు తప్పుడు సమాచారమిచ్చారని నిలదీశారు.
అయితే ఈ ఆందోళనపై గుంతకల్లులోని నర్సింగ్ హోం వైద్యుడు రమణ స్పందించారు. ఇందులో తమ నిర్లక్ష్యమేమీ లేదని తెలిపారు. కన్జెనిటల్ అడ్రినల్ హైపర్ప్లాసియా కారణంగా పుట్టుకతోనే లక్షల్లో ఒకరికి మాత్రమే జననాంగం వృద్ధి చెందకపోవడం వంటి సమస్య వస్తుందని పేర్కొన్నారు. సదరు శిశువుకు సైతం ఇలాంటి సమస్యతోనే జననాంగం వృద్ధి చెందలేదని చెప్పారు. మేనరిక వివాహం కారణంగానే ఇలాంటి సమస్య వచ్చిందని వివరించారు. అయితే ఈ విషయాన్ని ముందే చెప్పకుండా, ఎందుకు తప్పుడు సమాచరాం ఇచ్చారని వైద్యులను శివువు కుటుంబసభ్యులు నిలదీశారు. అయితే ఆందోళన గురించి సమాచారం అందుకున్న రెండో పట్టణ సీఐ వంశీకృష్ణ బాధితులకు సర్దిచెప్పి పంపించారు.