Jaya Senapathi Episode 37 | జరిగిన కథ : ఒకరోజు నాట్యగురుకులంలో మహాస్థపతి రామపను కలుసుకున్నాడు జాయప. ఆయనతో కలిసి అనుమకొండలోని రుద్రేశ్వరాలయానికి వెళ్లాడు. అక్కడ ఆలయ నిర్మాణంలోని శాస్త్ర అంశాల గురించి తెలుసుకున్నాడు. రాళ్లలో దేవుణ్ని చెక్కి.. దైవత్వం సృష్టించి.. వేదోక్తంగా ప్రతిష్ఠించి.. ప్రజల్లో ఇంతటి భక్తి ప్రపత్తులను కలిగిస్తున్న దేవాలయాల నిర్మాణంలో ఇన్ని అంశాలు ఉండటం జాయపకు మొదటిసారి కొత్తలోకాన్ని ఆవిష్కరించింది. ఒకనాడు మిత్రులతో కబుర్లలో ఉండగా.. అహోబలపతి చిరునామా దొరకడం లేదంటూ వచ్చాడు త్రిపుర మిత్రుడు చలమయ.
చలమయలో హంగూ ఆర్భాటమూ తగ్గి చాలా దీనంగా ఉన్నాడు. ఓ మిత్రుడికోసం నెలలుగా వెదకడం మిత్రులందరిలో ఆసక్తి కలిగించింది. “ఔనౌను.. అనుమకొండ – ఓరుగల్లు దినదినమూ ప్రవర్ధమానమై ఎదిగిపోతున్నాయి. చిరునామాలు మాకు కూడా దొరకడంలేదు. పాపం చాలా కష్టపడుతున్నట్లున్నావు”..దగ్గరికి పిలిచి పక్కన కూర్చోబెట్టుకున్నాడు త్రిపుర. “ఆ చిరునామాలో నేను కూడా వెదికాను. అక్కడ లేడు. ఓరుగల్లులో ఖరీదైన ప్రాంతంలో స్థలంకొని మేడ కడుతున్నాడట.. ఇంటికి పద! నీకు ఆ కొత్త చిరునామా ఇస్తాను..” అన్నాడు అనునయంగా.అందరూ లేచారు. “నేను స్థపతిగా నిర్మాణమవుతున్న రుద్రేశ్వరాలయం చూస్తావా.. వెళదామా?..” అన్నాడు రామప. జాయప కూడా ఉత్సాహంగా కదిలాడు. ఇద్దరూ అశ్వాలు అధిరోహించారు.ఆతుకూరిపురం గ్రామంలో నిర్మాణంలో ఉన్న రుద్రేశ్వర దేవాలయాన్ని చూసి అచ్చెరువొందాడు జాయప.
నక్షత్రాకారపు వేదికపై నిర్మిస్తున్న దేవాలయం. వేదిక ఎక్కారు. కనుచూపుమేరా కన్నులకు ఇంపైన పచ్చపచ్చని చీరె కట్టిన నేలతల్లి.. పక్కనే చెరువు తవ్వుతూ కూనిరాగాలు ఆలపిస్తున్న రైతులు.
ఎక్కడో చిన్నగా ఉరిమి ఇక్కడ చిరుజల్లులు కురిశాయి. ఇద్దరూ దేవాలయంలోకి అడుగుపెట్టారు. తాంబూల సేవనం చేస్తూ మండపమంతటా వివిధ దశల్లో ఉన్న శిల్పాలను తదేకంగా చెక్కుతున్న వద్దంకులు. వారిని చూస్తుంటే గురుకులంలో వాద్యాలను శ్రుతిపక్వం చేసుకుంటున్న కళాకారుల బృందంలా తోచారు జాయపకు. జాయపలో ఏదో స్పందన.. ఎక్కడినుంచో వినవస్తున్న సవ్వడి! అదే.. ఏ గుడిలోకి వెళ్లినా తనకు వినిపించే సవ్వడి.. గజ్జెలసవ్వడి. ఇక్కడ కూడా.. కాళ్లు తెలియకుండానే చిన్నగా కంపిస్తాయి. నాట్యమాడమంటాయి. చేతులు అప్రయత్నంగా ముద్రలు తీసుకుంటాయి. అతని నోటినుంచి అప్రయత్నంగా వచ్చేపదం.
‘శివా!’.. అరమూతలైన కన్నులు. ఎదుటివారికి ఈ పులకరం.. స్పందన.. తెలియవు.. కనిపించవు. ఆ గుడిలో తొలిసారి జాయపకు ఈ స్పందనలకు కారణమైన రూపం కళ్లకు పొడకట్టింది. అది నాట్యమాడుతున్న శివుడు.. నటరాజు! తాండవ శివుడు!! చీకట్లు కమ్మిన గుడి అంతరాళంలో శిల్పుల ఉలి శబ్దాలే ఘల్లు ఘల్లుమంటున్న గజ్జెల సవ్వడులుగా జాయప శరీరాన్ని రాసుకుంటూ.. రుద్రమూర్తి శివుడు చిన్నగా చిందేస్తున్నాడు.. ఆ ముఖంలో అర్థంకాని చిద్విలాసపు అభివ్యక్తి.. తాండవ కేళికి ఆహ్వానిస్తున్నట్లు!! చిరుకంపనతో ఊగిపోతున్నాడు జాయప. ఓ ఝాము సేపు.. అన్ని గుడుల్లోనూ ఇదే స్పందన. మరోఝాముకు శరీరమంతా స్వాధీనంలోకి వచ్చింది. రామప చెబుతున్నది వినిపిస్తున్నది. “ఈ దేవాలయాన్ని నిర్మిస్తున్నది ఈ ప్రాంత మండలేశ్వరుడు రేచర్ల రుద్రయ. ఆయనే ఈ చెరువు తవ్వించి వేల ఎకరాల భూమికి నీటివసతి కల్పిస్తున్నాడు. తన మండలంలో దేవాలయాన్ని నిర్మించాలన్న రుద్రుని కోరికపై ఇక్కడ స్థలనిర్ణయం చేశారు నాన్నగారు. నాన్నగారిని కలుద్దాం. పద..” అంటూ లేవదీశాడు రామప.
రుద్రేశ్వరాలయం పక్కన మరోరెండు చిన్నదేవళాలు కూడా నిర్మితమవుతున్నాయి. అవి రేచర్ల రుద్రయ తల్లిదండ్రులపేర నిర్మిస్తున్నారని రామప చెప్పాడు.
దేవాలయం వెనుక ఉన్నది త్రిలోచన శిల్పాయతనం
(శిక్షణా కేంద్రం). విశాలంగా ఐదు ఎకరాల ప్రదేశంలో నిర్మించినది. రామప తండ్రి రుద్రోజు అయితే.. తాతగారు త్రిలోచనాచార్యుడు. గొప్ప శిల్పగురువు. ఆయన ఆలోచనల నుంచి పుట్టిన ఈ శిల్పాయతనం.. కాకతీయరాజ్యంలోనే కాదు భరతవర్షంలోనూ ప్రసిద్ధి పొందింది. ఆగమశాస్త్రం, వాస్తుశాస్త్రం, శిల్పశాస్త్రం, భారతీయతత్వం, దేవాలయ నిర్మాణంలో విభిన్న శైలులు, మూర్తిరూప నిర్మాణం లాంటి ప్రాథమిక శిక్షణేకాక.. శాస్త్ర సంబంధిత చర్చలు, శిల్పచాతుర్యంలో ఆధునికత, చిత్రకళ, నాట్యకళ, వాద్యకళలాంటి శాస్ర్తాలను, న్యాయ, ప్రబంధ, పురాణ, చారిత్రక, శృంగార, సామాజిక అంశాలను దేవాలయ శిల్పాలలో ఎలా మిళితం చెయ్యాలి?.. ప్రతి గుడికి కొన్ని ప్రత్యేకతలు ఎలా నిర్దేశించాలి?.. ఇలాంటి అంశాలపై ఇక్కడ నిరంతరమూ మేధోమథనం జరుగుతుంటుంది. దేశ విదేశీ స్థపతులు, వాస్తు శాస్త్రవేత్తలు అటు ఆర్యావర్తం.. ఇటు దక్షిణావర్తం నుంచి వస్తూ పోతూ ఇక్కడ ఆగుతారు. దేశవ్యాప్తంగా ఎక్కడెక్కడ దేవాలయాల నిర్మాణం జరుగుతున్నది?.. అక్కడ
స్థపతులు సృష్టిస్తున్న కొత్త కొత్త అంశాలేమిటి?.. అనేవి ఇక్కడ చర్చిస్తుంటారు. ఆసక్తి ఉన్న రాజప్రముఖులు, మండలాధ్యక్షులు, ఇతర అధికారముఖ్యులు కూడా పాల్గొని దేశవ్యాప్తంగా దేవాలయ నిర్మాణంలో వస్తున్న ధోరణులను తెలుసుకుంటూ ఉంటారు.
విశ్వకర్మను అధిదేవతగా కొలిచే పంచాణం వారికి సమకాలీన ప్రపంచంలో అత్యుత్తమ మేధావివర్గంగా గుర్తింపు ఉంది. కారణం రాజనగరి తర్వాత అంతటి స్థాయున్న ప్రదేశం దేవాలయం. మహా మేధావుల ఆవాసాలైన అగ్రహారాల స్థానాన్ని గుడి ఆక్రమించింది. దేవాలయంలోనే విద్యామండపాలు నిర్మించడంవల్ల అగ్రహారాల ఆధిపత్యం తగ్గింది. పంచాణంవారు తాము కూడా ద్విజులవర్గంగా చెప్పుకొంటూ యజ్ఞోపవీత ధారణ, సంధ్యావందనం.. లాంటి కర్మకాండ నిర్వహిస్తున్నారు. బ్రాహ్మణవర్గాలు కూడా పంచాణం వారి అద్భుత ప్రతిభను ఒప్పుకొంటున్నారు.
ఆశ్రమంలో త్రిలోచనాచార్యుల విగ్రహానికి నమస్కరించాడు జాయప. జర రుజాగ్రస్తుడై విశ్రాంతిగా మంచంపై ఉన్న రుద్రోజు.. అంతేవాసులకు (శిల్పవిద్యార్థులు) శిల్ప పాఠాలు చెబుతున్నాడు.
ఆయనకు జాయప ప్రణమిల్లాడు. “గణపతిదేవులు గుర్తించిన మంచి నాట్యకారుడు నాన్నగారు!” అంటూ పరిచయం చేశాడు రామప.
జాయప సిగ్గుగా..
“నాట్యం రాదని గుర్తించి.. నేర్చుకొమ్మని గుండయామాత్యునికి అప్పగించారు నన్ను. నాట్యవిద్యార్థిని మాత్రమే..” అన్నాడు.“వినయశీలివి. కళాభిజ్ఞత ఉట్టిపడుతున్నది నీలో! తప్పక మంచి కళాకారుడివి అవుతావు. మా రామపకు తోడువై కాకతీయ శిల్పానికి ప్రతీక కావాలి నాయనా..” ఆశీర్వదించాడు రుద్రోజు స్థపతి.ఆ ఆశీర్వాదబలం ఏమో రామప, జాయప జంట.. అనుమకొండ, ఓరుగల్లు నగరాలలో ఉన్న సిద్ధేశ్వరాలయం, భోగీశ్వరాలయం, సర్వతోభద్ర దేవాలయం, రామలింగేశ్వరాలయం, గోపాలస్వామిగుడి, శ్రీ రంగనాథాలయం, కాశీ విశ్వేశ్వరాలయం, భైరవుని గుడి, ఆంజనేయ గుడి, గరుడాలయం, పద్మాక్షి దేవాలయం, భద్రకాళి దేవాలయం.. కొన్ని పూర్తయినవి, కొన్ని నిర్మాణంలో ఉన్నవి.. చుట్టుపక్కల మండలాలలో నిర్మాణమవుతున్న దేవాలయాలు కూడా అన్నీ చూస్తున్నారు. అలాగే జైన బసదులు, బౌద్ధ చైత్యాలు, ఆరామాలు.. శిథిలాలయాలు కూడా పరిశీలిస్తూ చర్చిస్తున్నారు జంటగా.. బృందంగా.
ఒకరోజు గురుకులంలో నాట్యకారుల భంగిమలు చిత్రిస్తున్నాడు సంజయ. అప్పుడే జాయపకు ఓ అద్భుత ఆలోచన తట్టింది. శిల్పాలకు ముందుగా చిత్రరూపం ఇస్తున్నారు సరే! అసలు సజీవ వ్యక్తులే శిల్పుల ముందు ప్రతీకలుగా నిలబడితే!? వారిని చూస్తూ శిల్పాలు చెక్కితే!? అతని శరీరం జలదరించింది. రామపతో తన ఆలోచన పంచుకున్నాడు. ఆయన దిగ్భ్రమతో పులకించిపోయాడు.“సంజయతో సన్నివేశ చిత్రీకరణే గొప్ప సృజనాత్మకం. ఇప్పుడు నువ్వు చెప్పిన సజీవప్రతీక అంశం దేశంలోనే ప్రకంపనలు సృష్టిస్తుంది జాయపా! నిజంగా అద్భుతం నీ ఆలోచన. ఈ దేవాలయం ప్రపంచచరిత్రలో చిరస్మరణీయంగా నిలిచిపోతుంది”..తనతోపాటు ప్రతీకగా నిలబడటానికి ఓ యువతి కావాలని భావించి.. ‘అందుకు తగిన అమ్మాయి ఎవరా!?’ అని జాయప గురుకులంలో వెదికాడు. రేచమ అనే అమ్మాయి సరిపోతుందేమో అనుకుంటూ ఆమెను పలకరించాడు.“ఆ.. రేచమ! మీరు.. నేను.. మీతో..??”..అంతే.. బ్రహ్మాండం బద్దలయినట్లు అందరూతుళ్లిపడ్డారు. జాయపను చుట్టుముట్టారు.
“ఊ.. చెప్పు జాయపా! రేచమతోనే మాటలా.. నేను మాట్లాడటానికి సరిపోనా?”.. మరొక యువతి.
“కాస్త నాతో మాట్లాడితే నీ నోటిముత్యాలు రాలునా జాయపా?!!”.. అన్నదో లలామ.
“మాట్లాడితే నాలాంటి అందగత్తెతో మాట్లాడాలి. హవ్వ.. పోయిపోయి రేచమతోనా!” అన్నదో ముదిత.జాయప గందరగోళపడిపోయాడు. అతని బాధను చూసి వాళ్లంతా కిలకిలా నవ్వారు. అప్పుడే అక్కడికి వచ్చిన అశోకుడు.. జాయపకు బాసటగా నిలిచాడు.“అయ్యయ్యో.. జాయపను ఆట పట్టిస్తున్నారా!? ఆగండాగండి. ఏం జాయపా.. ఎవరితో ఏం చెప్పాలనుకున్నావు?” అన్నాడు. “అదే.. దేవాలయాలలో శిల్పాల రూపకల్పన కోసం నాట్యకారులు సజీవ ప్రతీకలుగా అంటే జంటగా, ఒక్కరుగా నాట్యభంగిమల్లో శిల్పుల కళ్లెదుట నిలబడితే.. మనలను చూసి చెక్కిన శిల్పం మరింత సజీవంగా ఉండొచ్చని నా అభిప్రాయం. అందుకు కొంచెం సహకరించమని రేచమను కోరుదామని”.. అశోకుడు చెప్పకుండానే అమ్మాయిలంతా బిలబిలమని జాయపను చుట్టుముట్టారు.“నేను సిద్ధం.. నేను సిద్ధం.. నేను సిద్ధం!” అంటూ మీదమీద పడిపోతున్నారు. మళ్లీ అశోకుడే వాళ్లను పక్కకు లాగాడు. “మీరు ఆగండి. నేనున్నాను కదా! నేను జాయపతో మిమ్మల్ని జతచేసి వేర్వేరు భంగిమలు రూపొందిస్తాను. సరేనా.. సరేనా జాయపా?”..అందరూ అంగీకరించారు. తెప్పరిల్లాడు జాయప. అశోకుడి నిర్వహణలో, రామప పర్యవేక్షణలో జాయప.. యువతులతో సన్నిహితంగా ఏకవ్యక్తి భంగిమలు, జంట భంగిమలు, హస్త, పాదముద్రలు.. తదితర నాట్యదృశ్యాల రూపకల్పన మొదలయ్యింది.
ఇదే విధానం వేశ్యావాటికలోనూ ప్రారంభించాడు జాయప. “నువ్వు, నాట్యకత్తెలు సజీవంగా శిల్పుల కట్టెదుట నిలబడటం ఎంతో కొత్త భావన. ఆ శిల్పాలలో మరింత కచ్చితత్వం వచ్చి, మీరంతా ఎన్నోతరాలు నిలబడిపోతారు. నిజంగా గొప్ప ఆలోచన జాయపా!” నీలాంబ కూడా ఎంతో అబ్బురపడింది. జాయప, నాట్యకత్తెలు.. అశోకుడి సహాయంతో కొన్ని భంగిమలు రూపకల్పనచేసి శిల్పకర్మశాలకు వెళ్లారు. జాయప, నాట్యకత్తెలు నిలబడ్డ భంగిమలు చూసి శిల్పకారులు అచ్చెరువొందారు. జంటశిల్పాలు, ఏకవ్యక్తి శిల్పాలు.. వాటి సందర్భం, నిలబడాల్సిన భంగిమ, ముఖ కవళికలు, రసభావనలు.. ఆహార్యం.. అలంకారం.. కేశాలంకరణం ఇత్యాది అంశాలన్నీ అశోకుడితో చర్చించేవాడు రామప. ఆ తర్వాత సూత్రధారి, శిల్పకమ్మాంతికులు, శిలారూప కమ్మికులు కూడా కూలంకషంగా ఆలోచించి నిర్ణయించాక.. ఆయా భంగిమల్లో జాయప, నాట్యకత్తె నిలబడేవారు. సజీవప్రతీకలుగా ఇద్దరు నాట్యకారులు తమ కళ్లముందు నిలబడటం శిల్పులకూ వినూత్నంగా ఉంది. వారు మరింత ఉత్తేజంగా శిల్పీకరిస్తున్నారు. భంగిమనుబట్టి కొన్ని రోజులు.. కొన్ని శిల్పాలు వారాలు, పక్షాలు కూడా పడుతున్నాయి. జాయప, నాట్యకత్తెలు ప్రతీకలుగా ఎన్నో అద్భుతమైన శిల్పాలు రూపొందుతున్నాయి. అదొక చారిత్రాత్మక రససృష్టి ప్రవాహం.. రోజులు.. పక్షాలు.. మాసాలు!
* * *
“ఈ వార్త విన్నావా త్రిపురా!?” అడిగాడొక మిత్రుడు.
“ఏ వార్త?” అన్నాడు త్రిపుర.“మన పట్టపురాణి గారు మళ్లీ గర్భవతి అయ్యారట. ఉదయం రాజనగరువద్ద వార్తసంబంధి ప్రకటించాడట”.. చెప్పాడు శుక్ర.“అయితే??”.. మరో మిత్రుడి సందేహం.
“చక్రవర్తులవారి మొదటిసంతానం ఆడపిల్ల కదా! ఈ పర్యాయం కూడా ఆడపిల్ల పుడితే!. అప్పుడు చక్రవర్తికి ఇద్దరూ ఆడపిల్లలే అవుతారు. ఆడపిల్లకు సింహాసనార్హత లేదు కదా.. మరి రాజ్యానికి వారసుడెవరు??.“ఇద్దరూ ఆడపిల్లలైతే కాకతీయ వంశం గణపతిదేవునితో సమాప్తమవుతుందా..?”.“ఇప్పుడు గణపతిదేవుడు ఏం చెయ్యగలడు.. కిం కర్తవ్యం??”.సమస్య కొంచెం స్పష్టమయ్యాక.. అందరూ చురుగ్గా చూశారు శుక్ర వంక. మంగళ వృత్తికారుడైన శుక్ర.. రాజ్యాంశాలలో నిష్ణాతుడు.“నిజమే.. మిత్రమా! ఇది రాజనగరు సమస్య, రాజధాని సమస్య మాత్రమే కాదు. మొత్తం కాకతీయ సామ్రాజ్య సమస్య!”..
(సశేషం)
-మత్తి భానుమూర్తి
99893 71284