Bharathiraja | కోలీవుడ్ చిత్ర పరిశ్రమలో విషాదం నెలకొంది. దిగ్గజ తమిళ చలనచిత్ర దర్శకుడు, పద్మశ్రీ అవార్డు గ్రహీత భారతీరాజా (84) కన్నుమూశారు. గత కొంతకాలంగా వయోవృద్ధాప్య సమస్యలు, శ్వాసకోశ సంబంధిత అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన, చెన్నైలోని తన నివాసంలో తుదిశ్వాస విడిచారు. ఆయన మృతి పట్ల సినీ, రాజకీయ ప్రముఖులు తీవ్ర సంతాపం వ్యక్తం చేస్తున్నారు.
ఇక భారతీరాజా మరణవార్త తెలుసుకున్న తమిళనాడు ముఖ్యమంత్రి సి. జోసెఫ్ విజయ్ ఆయనకు ఘన నివాళులర్పించారు. చెన్నైలోని దర్శకుడి నివాసానికి చేరుకున్న సీఎం విజయ్, ఆయన పార్థివ దేహానికి పూలమాల వేసి అంజలి ఘటించారు. అనంతరం వారి కుటుంబ సభ్యులను పరామర్శించి, తన గాఢ సానుభూతిని తెలియజేశారు. సీఎం విజయ్ అక్కడికి చేరుకున్న విజువల్స్ ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతున్నాయి.
సినిమా రంగాన్ని ఒక మలుపు తిప్పిన ‘దర్శక శిఖరం’ (ఇయక్కునర్ ఇమయం)గా భారతీరాజా గుర్తింపు తెచ్చుకున్నారు. 1977లో వచ్చిన ’16 వయతినిలే’ (తెలుగులో ‘పదహారేళ్ల వయసు’) సినిమాతో ఆయన దర్శకుడిగా పరిచయమయ్యారు. అప్పట్లో నాలుగు గోడల స్టూడియోలకే పరిమితమైన చలనచిత్రాలను అవుట్డోర్ లోని పల్లెటూరి స్వచ్ఛమైన వాతావరణానికి తీసుకెళ్లి సరికొత్త ట్రెండ్ను సృష్టించిన ఘనత ఆయనది. తెలుగు చిత్రసీమతోనూ ఆయనకు విడదీయరాని అనుబంధం ఉంది. ఆయన దర్శకత్వం వహించిన క్లాసిక్ ప్రేమకథా చిత్రం ‘సీతాకోకచిలుక’ తెలుగులో ఉత్తమ చిత్రంగా జాతీయ అవార్డుతో పాటు నంది అవార్డును కూడా గెలుచుకుంది. భారత చలనచిత్ర రంగానికి చేసిన అద్భుత సేవలకుగానూ కేంద్ర ప్రభుత్వం ఈయన్ను 2004లో ‘పద్మశ్రీ’ పురస్కారంతో సత్కరించింది. తన కెరీర్లో ఆయన మొత్తం 6 జాతీయ చలనచిత్ర అవార్డులను అందుకున్నారు. ఆయన మరణం యావత్ సినీ లోకానికి తీరని లోటు.