జరిగిన కథ : తీర్థయాత్రల నుంచి కాకతి తిరిగి వచ్చినట్టు జాయప చెవిన వేశాడు అంకమరట్ట. ఆమె అనుమకొండలోనే ఉండి, పద్మాక్షి దేవాలయంలో రంగపూజనం నిర్వహిస్తున్నట్లు కూడా చెప్పాడు. దాంతో.. ప్రత్యూషవేళ పద్మాక్షి దేవాలయానికి వెళ్లాడు జాయపుడు. పూజాదికాలు ముగించుకుని గుడి బయటికి వచ్చిన రేణుకకు, కాకతికి ఎదురుగా కనిపించాడు. సాక్షాత్తూ మన్మథుడే ఎదుట నిలిచినట్టు ఉన్న జాయపుణ్ని చూసి.. రెప్పవేయడం మర్చిపోయింది రేణుక. కాకతి ఆమెను కదిపింది.
మా నాట్యబృందంలో నటిస్తాడని చెప్పానే.. జాయపుడు. ఇతగాడే!” చాలా చిన్నస్వరంతో, ఏదో సాధారణ నటుడు అన్నట్లు రేణుకతో చెప్పింది కాకతి. రేణుక జాయపుణ్ని అలా చూస్తూనే.. అతని దగ్గరికి వెళ్లింది. గౌరవంగా గుర్రం దిగాడు. “ఈ పిల్ల ఎప్పుడూ మీ నామధేయమే కలవరిస్తూ ఉంటుంది. ఈ వెనుకవీధిలోనే మా ఇల్లు. రండి!”.
కాకతికి చిర్రెత్తుకొచ్చింది.
జాయపునితో మాట్లాడింది గాక.. ‘మీ నామధేయమే కలవరిస్తుంది’ అని చెబుతుందా!? ఛ ఛ.. పరువు తీసేసింది.
కానీ, తను చేయగలిగింది ఏమీ లేదు. జాయపుణ్ని చూస్తే ఏ ఆడదైనా అంతే! ఇద్దరూ గృహోన్ముఖులవగా.. వెనుక గుర్రంపై జాయపుడు. మరి కాసేపటికి రేణుక ఇంటికి చేరారు. భైరి నాయకుడు, రేణుక గొప్ప అతిథి మర్యాదలు చేశారు.
అయ్యన్నవోలుకు చెందిన సైనికుడు భైరినాయకుడు. అనుమకొండలో నివాసం. ఆయన భార్య రేణుక. కేశవస్వామి దేవాలయంలో గుడిసాని. ఆమె తండ్రి గుడి అంగరంగభోగానికి ఇచ్చిన దానం గుడిలో సక్రమంగా జరిగేలా చూస్తూ.. పూజారితో కలిసి నిత్యమూ గుడి అంగరంగ భోగాలన్నీ నిర్వహిస్తుంటుంది. అందుకు ఆమె గుడిసానిగా గుర్తింపు పొందింది. వెన్నియకు ఆమె దూరపుబంధువు కావడంతో వారి నివాసంలో ఉంటూ గురుకులంలో నాట్యాభ్యాసం చేస్తున్నది కాకతి.
నాట్యగురుకులంలో మాత్రమేకాదు.. ఏ గురుకులంలో అయినా ఉచిత నివాస, భోజన వసతులు ఉంటాయి. అయితే దేవునికి అంగరంగసేవలు కాకతికి నిర్వహించడం ఎంతో ఇష్టం. అందుకే భైరినాయకుని ఇంట్లో ఉంటూ.. నాట్యం అభ్యసిస్తున్నది.
కాకతి, జాయపుని మధ్య ఒక్కమాట కూడా లేదు. కేవలం కన్నుల బాసలే. అందులో ఎన్నో గ్రంథాలు.. ఎన్నెన్నో ప్రబంధాలు.. ఇంకెన్నో విరహగీతాలు.. మరెన్నో మధురిమల లేలేత గాయాల వేదనలు!
జాయపునికి సగౌరవ వీడ్కోలు ఇచ్చారు. అశ్వాన్ని అధిరోహించాడు.. కానీ, విక్రమ ఇష్టం లేనట్లు మెల్లగా పోతున్నది. కాస్తదూరం వెళ్లి.. డొంక మలుపువద్ద వెనక్కి తిరిగి చూశాడు.
అతని చూపుల కోసమే నిరీక్షిస్తున్నట్లు.. అతను చూడగానే చేతులతో నమస్కార నాట్యభంగిమపెట్టి, లోపలికి మాయమైంది కాకతి. అప్పుడందుకున్నాడు వేగం విక్రమ.. యజమాని మనసులో ఉరకలు వేస్తున్న ఉత్సాహం లాంటిదేదో గుర్తించినట్లున్నాడు.
గుండయామాత్యుని గురుకులం.. మరునాడు కాకతి కోసం ఎదురుచూస్తున్నాడు జాయపుడు.
అయ్యన్నవోలు నుంచి వీడ్కోలు తీసుకుంటున్న సన్నివేశం గుర్తొచ్చింది.
ఆవేళ కాకతి చాలా ఉద్విగ్నురాలయ్యింది. ఇంట్లో ఏడ్చిఏడ్చి వచ్చినట్లు.. జాయపుని ముందు ఏడవకూడదని నిశ్చయించుకున్నట్లు స్థిరంగా ఉంది.
అయినా చెరువులో తడిసిన తామరమొగ్గల్లాంటి ఆమె కనుద్వయంలో ఊరుతున్న చెమ్మ.. అతని గుండెల్లో ఆర్తిని సృష్టించకపోలేదు. నాసికాగ్రం పైనున్న ముక్కెర మరింత ఎగసెగసి పడుతున్నది ఎర్రెర్రగా.
నిబ్బరం.. నిబ్బరం!
“కాలాముఖ శైవసంఘాలు కొన్ని దక్షిణావర్తం శైవ దేవాలయాల పర్యటనకు వెళ్తున్నాయి. వాటితోపాటు ఒక నాట్యబృందాన్ని కూడా తీసుకువెళ్లాలని.. వారు కొండయను సంప్రదించారు. ‘కుటుంబాల సమేతంగా వెళ్దామా!?’ అని మేమంతా ఆలోచిస్తున్నాం నటరాజా..” అన్నాడు భైరవ.. వీడ్కోలు చెబుతూ.
రుక్కమ అయితే అప్పటికే కళ్లు ఒత్తుకుంటున్నది. బహుశా ఏడాది దాకా కనిపించకపోవచ్చు.
గ్రామ మహాజనులంతా గోలగోలగా ఏదేదో చెబుతున్నారు. నవ్వు ముఖం పెట్టి వింటున్నా.. అతని చూపంతా కాకతి మీదే ఉంది.
దక్షుని కుమార్తె దాక్షాయణిలా.. కాలి బొటనవేలు నేలకు రాస్తూ, కొంగుఅంచు నోట పట్టి ఉద్వేగాన్ని ఆపుకొంటున్నది.
అశ్వం అధిరోహించబోతున్నాడు జాయపుడు.
మాట్లాడుతున్న వాళ్లనుంచి తొలగుతూ దగ్గరికి వెళ్లింది కాకతి.
“ఎవుసం పనులన్నీ అయిపోనియ్యి!” అని వెనుదిరిగింది.
ఆగలేదు. ఇంటివైపు వడివడిగా వెళ్తున్నది. ఆమెనే చూశాడు.. ఆమె కనుమరుగయ్యేవరకు!
కదిలాడు. అందరి వీడ్కోలు తీసుకుంటూ.. అందరినీ తోసుకుంటూ.
విక్రమ బాట మార్చింది.. రౌతు మనసు తెలిసిన విక్రమ వేగం పెంచింది. అనుమకొండ వచ్చేశాడు.
దక్షిణావర్తం వెళ్లిన బృందం అనుకున్నట్లే ఏడాది తర్వాత తిరిగి వచ్చింది. రావడం రావడమే.. కాకతి అనుమకొండ వచ్చేసింది.. ఎవరి కోసం?? దైవం కోసమా.. జాయపుని కోసమా!?
వీధిద్వారం వద్ద నిలబడి పలువిధాలుగా ఆలోచిస్తున్న జాయపుని వద్దకు అశోకుడు వచ్చాడు.
“కాకతి ఈరోజు గురుకులానికి వస్తున్నది గురువర్యా!” చెప్పాడు జాయపుడు.
“అలాగా.. సంతోషం! అలాంటి శిష్యులుంటే నాబోటి గురువులు ఎన్నోతరాలు బతికి ఉంటారు జాయపా!”.
“యాయ్.. ఆమెకు ఎంతటి అభినందన. నాకు ఒక్కసారైనా అలాంటి అభినందనలు చెప్పారా?”.
“నువ్వు గురువులకే గురువ్వి కదా జాయపా.. క్షమించు జాయప సేనానీ”.
ఇద్దరూ పగలబడి నవ్వారు.
జాయపుడు ద్వీపం వెళ్లడం.. కాకతి గురుకులానికి వచ్చి నాట్యం అభ్యసించడం.. ఆ సంగతులన్నీ గతంలో కలిసినప్పుడు కాకతి చెప్పింది.
సౌజ్ఞలతో చెప్పినట్లుగానే కాకతి నాట్యగురుకులానికి వచ్చింది. అప్పటికే జాయపుని కళ్లు ఎన్నో మణుగులకొద్దీ కాయలు కాచాయి.. అవి పండి పళ్లు కాబోయే తరుణంలో ఆమె దర్శనమయ్యింది.
“గతంలో నువ్వు ద్వీపం వెళ్లినప్పుడు నాట్యం కోసం శరీరాన్ని బాగా శుష్కింపజేసుకున్నావు కాకతీ! మళ్లా ఇప్పుడు కొంచెం ఒళ్లు చేశావు” అన్నాడు అశోకుడు పలకరింపుగా.
“నిన్న నన్ను చూసినప్పటి నుంచీ ఇవ్వాల్టికే ఒళ్లు చేసేసింది గురుదేవా!”.
ముగ్గురూ సంయుక్తంగా నవ్వారు.
“ఆమె శరీరంలో లాస్యం సరాగాలు పోతున్నది జాయపా. శ్రమిస్తే మరింత మంచి లాస్య భంగిమలు ఆమె నుంచి మనం సృష్టించవచ్చు. ఏమంటావు కాకతీ..” అన్నాడు అశోకుడు.
“అయ్యో నాదేముంది గురుదేవా.. తమరి
అనుగ్రహం. తమరు ఎలా చెబితే అలా..” అన్నది నవ్వుతూ.
“ఇప్పుడు జాయపుని సమక్షంలో నీకు అష్టవిధనాయికల నృత్యాలు శిక్షణ ఇస్తాం. సరేనా.. లేదా నీకేమైనా ప్రత్యేక ఆలోచన ఉన్నదా జాయపా?” అన్నాడాయన.
“తమకంటే తెలిసిన వాడినా గురుదేవా..” అన్నాడు జాయపుడు.
ముగ్గురూ నవ్వారు.
‘నీకోసమే వచ్చాను జాయపా’ అనలేదామె.
‘నిజంగా నాకోసమే వచ్చావా కాకతీ..’ అని పరిహాసమాడలేదు జాయపుడు.
అవి వారి శరీరాలు ప్రకటించాయి. ఆమె అతనికి దగ్గరగా జరిగింది. అతను ఆమెవైపు మరికొంత జరిగాడు. ఇద్దరూ ఈ ఏడాది ఎడబాటును తట్టుకుని ఇప్పుడు గురుకులంలో ఏర్పడిన సామీప్యంతో సేదదీరారు. గతంలో తండ్రి వివాహ ప్రసక్తి తెచ్చినప్పుడల్లా ఆమె మనసులో దేవుడు ముందుకొస్తాడు.
జాయపుని పరిచయం తర్వాత ఆమెలో వయసు ఉధృతివల్ల శృంగారభావనలు చుట్టుముడుతున్నాయి. ఇటీవల జాయపుడు మాసం రోజులు అయ్యనవోలులో ఉండటంతో అవి ఆమెను మరింత పెనవేసుకున్నాయి. జాయపునితో నాట్యమే కాదు.. అతని సామీప్యమే దైవదత్తమైన వరంగా కాకతి భావించే స్థాయికి ఆమెను ప్రభావితం చేశాడు జాయపుడు.
కాకతి వెళ్లిపోయిన తర్వాత గురువులు జాయపునితో..“ప్రత్యేక శ్రద్ధ ఎవరిపై..? రాజనగరి గానకోకిల ఇంద్రాణి పైనా.. గ్రామీణ నాట్యమయూరి కాకతిపైనా??” అని కన్నుగీటి హాస్యమాడారు.
నవ్వులాంటి భావప్రకటన తప్ప ఏమీ చెప్పలేకపోయాడు జాయపుడు.
జాయపుడు, కాకతి అయ్యనవోలులో విహరించినట్లే అనుమకొండలో కూడా స్వేచ్ఛగా విహరించసాగారు.
కాకతిని రాతిబండ ముచ్చట్ల స్థావరం వద్దకు తీసుకువెళ్లాడు. మిత్ర బృందానికి పరిచయం చేశాడు. మిత్రులు ఆమెను చూసి ఆనందపడ్డారు. కాకతిని చూస్తేనే ఆత్మీయంగా అనిపిస్తుంది. అమాయకంగా చూస్తుంది. గల్లుగల్లున మాట్లాడుతుంది. కబుర్ల పోగు. కొత్త పాతా లేదు. దగ్గరలో తండ్రి లేకపోవడం.. జాయపుడు పక్కన ఉండటంతో మరింత స్వేచ్ఛా వాతావరణంలో మసలుతున్న కాకతి వారందరినీ ఆకట్టుకుంది.
శిల్ప కర్మశాలకు కూడా కాకతిని తీసుకువెళ్లాడు జాయపుడు.
దాదాపు నూరుగురు శిల్పులు పది విశాలమందిరాలలో ఉలి, సుత్తి, శానం లాంటి పనిముట్లతో నిరంతరంగా తదేకదీక్షతో శిల్పసృష్టి చేస్తున్నారక్కడ. ఎటుచూసినా నందీశ్వరులు, నాట్యగత్తెలు, అశ్వాలు, మత్తేభాలు, పువ్వులు, తీగెలు, చెట్లు, ఆభరణాలు, శిరోజాలంకరణ.. ఇలా అద్భుత శిల్పరూపాల సృష్టి జరుగుతున్న మరో ప్రపంచమది.
కళ్లముందే శిలలను శిల్పాలుగా మార్చుతున్న వద్దంకులను చూసి ముచ్చట పడిపోయింది కాకతి.
“ఈయన స్థపతి రామప. ఈయన సూత్రధారి కృష్ణమ. ఈయన శిల్పకమ్మాంతికుడు!”.
“ఆగాగు.. ఇక్కడ సూత్రధారి ఏమిటి. సూత్రధారి మన నాటకాలలో ఉంటాడు. ఇక్కడేంది?”.
“అదే కళలమధ్య ఉన్న అద్భుత అల్లిక. మనిషి మానసికానందం కోసం పుట్టిన కళలన్నిటి మధ్య ఏకసూత్రం ఉంటుంది.. పువ్వుల్లో దారంలా. ఆ సూత్రాన్ని నిర్వహించేవాడు సూత్రధారి. అది శిల్పం అయినా నాట్యం అయినా చిత్రలేఖనం అయినా..” వివరించాడు జాయపుడు.
ఏకీభవిస్తున్నట్లు తల ఊపాడు రామప.
ఆమె ఎంతో దిగ్భ్రమగా ఆ కర్మశాలలో తిరుగాడింది. నందీశ్వరులను ముద్దాడి ముద్దాడి ఆనందించింది. ఎన్నో నాట్య శిల్పాలను పరిశీలించింది. శిల్పాల అలంకరణలను చూసి పరవశించింది.
“ఇన్ని ఆభరణాలు ఉన్నాయని నాకు కలలో కూడా తెలియదు. ఇన్నిరకాల దుస్తులు.. వీటిని కుట్టే కుట్రపు వాళ్లు ఎక్కడ ఉన్నారు?! ఈ శిరోజాలంకరణలు చూడు. కేశాలు మూడుపాయలగా తీసి వీళ్లే జడగా చెక్కేస్తున్నారు. అబ్బ.. జడకుప్పెలు.. రత్నాలు పొదిగిన బంగారు పట్టుకుచ్చులతో అలంకరించారు. తలపై మాణిక్య నాగాభరణం, వజ్ర నక్షత్రాభరణం, ముత్యాల పాపిటబొట్టు, గోమేధిక చేమంతి పూవు చెక్కారు.. భలే! కడియాలు, కంకణ, కేయూరహారాలు, మేఖల, నూపుర ఆభరణాలు.. హమ్మో.. అద్భుతం!”.
చూస్తూ.. చెబుతూ.. మురిసిపోతూ.. వాటిలో లీనమైపోతున్నది కాకతి. శిల్పపు వేరువేరు భాగాలు వేరువేరుగా శిల్పీకరించి సన్నని ఇనుపతీగెలతో అన్నిభాగాలను అతుకుతారు. అప్పుడే అందరూ చూసే పూర్తి శిల్పరూపం తయారవుతుంది.
అక్కడో మిథునశిల్పాన్ని చూస్తూ ఎగిరి గంతేసింది.
“జాయపా జాయపా! ఇది చూడు. అచ్చం నీలాగే ఉన్నాడీ మొగుడు. ఈ జంటశిల్పం భలే చెక్కారు. జీవం ఉట్టిపడుతున్నది!” అన్నది మెరిసే కళ్లతో.
అప్పుడన్నాడు జాయపుడు ఉత్సాహంగా.
“ఈమె నర్తకి రేచమ. గురుకులంలో నాతోటి నాట్యకారిణి. మేమిద్దరం ఈ భంగిమలో ప్రతీకలుగా నిలబడితే చిత్రకారులు చిత్రీకరించారు”.
ఈ అంశం చెబుతున్నప్పుడు ఎందుకో లిప్తకాలం సందేహించాడు. అతని సందేహం నిజమయ్యింది.
కాకతి.. ముందు అర్థంకానట్లు చూసింది. తర్వాత కొంచెం కొంచెం అర్థం అవుతున్నట్లు.. ఆమె ముఖకవళికలు మారిపోయాయి. కొన్నిలిప్తల సమయంలోనే ఆమె ముక్కుపుటాలు కోపంతో, చిరాకుతో ఎగిరెగిరి పడ్డాయి.
“ప్రతీకలేమిటి? ఇలా కాళ్లు మెలికవేసి, దాని రొమ్ములపై చెయ్యివేసి.. ఛ ఛ!”.
విసురుగా బయటికి పరుగు తీసింది. వేగంగా పల్లకి ఎక్కేసింది. పరుగులు పెట్టమని బోయలను కసిరింది. పల్లకి వెంట అశ్వంపై వెళ్తూ.. ఆమెను అనునయించడానికి ప్రయత్నించాడు జాయపుడు. ఆమె ఏమాత్రం కనికరించలేదు. ఆ రోజునుంచి భైరినాయుడి ఇంటి బయటికి రావడంలేదు. గురుకులంలో శిక్షణకు హాజరుకావడం లేదు.
జాయపుడు హడలిపోయాడు.. ఏం చెయ్యాలో తోచక బిక్కచచ్చిపోయాడు.
(సశేషం)
-మత్తి భానుమూర్తి
99893 71284