Ranveer Singh | బాలీవుడ్ స్టార్ హీరో రణవీర్ సింగ్పై విధించిన నిషేధాన్ని సినీ కార్మికుల సమాఖ్య (ఎఫ్డబ్ల్యూఐసీఈ) ఎత్తివేసింది. గత కొన్ని రోజులుగా బాలీవుడ్లో చర్చనీయాంశంగా మారిన ఈ వివాదానికి తాజా పరిణామాలతో కొంతమేర ముగింపు లభించినట్లు కనిపిస్తోంది. రణవీర్కు వ్యతిరేకంగా జారీ చేసిన నాన్-కోఆపరేషన్ ఆదేశాలను ఉపసంహరించుకుంటున్నట్లు ఎఫ్డబ్ల్యూఐసీఈ అధికారికంగా ప్రకటించింది. ‘డాన్ 3’ చిత్రం నుంచి రణవీర్ సింగ్ తప్పుకోవడంతో ఈ వివాదం మొదలైంది. దర్శకుడు ఫర్హాన్ అక్తర్కు చెందిన ఎక్సెల్ ఎంటర్టైన్మెంట్ సంస్థ, సినిమా ప్రీ-ప్రొడక్షన్ పనుల కోసం ఇప్పటికే భారీగా ఖర్చు చేశామని, రణవీర్ వైదొలగడం వల్ల సుమారు రూ.45 కోట్ల మేర నష్టం వాటిల్లిందని ఆరోపించింది. ఈ అంశంపై చర్చించేందుకు రణవీర్ సహకరించడం లేదని పేర్కొంటూ, సమస్య పరిష్కారం అయ్యే వరకు ఆయనతో కలిసి పనిచేయవద్దని ఎఫ్డబ్ల్యూఐసీఈ సభ్యులకు సూచించింది.
అయితే తనపై విధించిన ఈ ఆదేశాలను రణవీర్ సింగ్ తీవ్రంగా వ్యతిరేకించారు. దీనిపై ఆయన న్యాయపరమైన నోటీసులు పంపించారు. ఈ నేపథ్యంలో బుధవారం జరిగిన సమావేశంలో ఎఫ్డబ్ల్యూఐసీఈ తన నిర్ణయాన్ని వెనక్కి తీసుకుంటున్నట్లు ప్రకటించింది. ఈ విషయాన్ని సమాఖ్య అధ్యక్షుడు బీఎన్ తివారీ వెల్లడించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, రణవీర్ సింగ్ మరియు ఎక్సెల్ ఎంటర్టైన్మెంట్ మధ్య ఉన్న వివాదాన్ని పరస్పర చర్చల ద్వారా సామరస్యంగా పరిష్కరించుకోవాలని సూచించినట్లు తెలిపారు. ఇరు వర్గాలు ఒకే వేదికపై చర్చించి సమస్యకు శాశ్వత పరిష్కారం కనుగొనాలని కోరారు.
మరోవైపు సమాఖ్య ప్రధాన సలహాదారు అశోక్ పండిట్ కూడా స్పందించారు. నిషేధాన్ని ఉపసంహరించుకోవాలని రణవీర్ సింగ్ కోరినట్లు వెల్లడించారు. నిర్మాతలతో చర్చలు జరిపి వివాదాన్ని ముగించుకోవాలని తాము సూచించినట్లు తెలిపారు. పరిశ్రమలో ఎవరిపైనా నిషేధం విధించే అధికారాలు తమకు లేవని స్పష్టం చేశారు. తాజా నిర్ణయంతో రణవీర్ సింగ్కు పెద్ద ఊరట లభించింది. ఇప్పుడు నిర్మాతల సంస్థతో ఆయన జరిపే చర్చలు ఎలా సాగుతాయన్నదే ఆసక్తికరంగా మారింది. ఈ వివాదం పూర్తిగా ముగిస్తే బాలీవుడ్లో నెలకొన్న ఉద్రిక్తతలకు కూడా తెరపడే అవకాశం ఉందని సినీ వర్గాలు భావిస్తున్నాయి.