జరిగిన కథ : నారాంబ, పేరాంబ.. ఓ మాసం అటూ ఇటుగా మగబిడ్డలనే ప్రసవించారు. కానీ, ధనుర్వాతం కమ్మడంతో పేరాంబ శివసాయుజ్యం పొందింది. అప్పుడే మరో విషాదవార్త. కూతురి మరణవార్త విని.. తల్లి దాయాంబ కూడా గుండె ఆగి మరణించింది. కుప్పకూలిపోయాడు జాయపుడు. ఇక ద్వీపంలో ఉండలేకపోయాడు గణపతిదేవుడు. అనుమకొండకు తిరిగి పయనమయ్యాడు. జాయపుడు కూడా.. కొంతకాలం అనుమకొండలో ఉండి వస్తానని చక్రవర్తి వెంట పల్లకి అధిరోహించాడు.
రాజనగరిలో గణపతిదేవుని బంధువులు, జ్ఞాతులు.. పది తరాల బంధువులు, వంశీయులు ఎందరో ఉన్నారు. వారందరూ నారాంబను, జాయపుణ్ని చూడటానికి, కలవడానికి ఎంతో ఉత్సుకత చూపుతున్నారు. దినమూ ఎందరెందరో వస్తున్నారు. నారాంబను చూసి మాట్లాడాక.. అందరూ ఎంతో సంతోషిస్తున్నారు. కారణం.. ఆమె చాలా ఆత్మీయంగా, అమాయకంగా, నిజాయతీగా మాట్లాడుతుంది. ఆమెకు కల్లా కపటం తెలియదు. అదే రాజప్రాసాదంలో ఏడేళ్లు ఉన్నా.. ఆమెకు భవంతిలోని ఇతరులతో కనీస పరిచయం కూడా లేదు. ఎన్నడూ అంతఃపురంలోకి ప్రవేశించింది కూడా లేదు. అందువల్ల బందీగా ఉన్నకాలంలో నారాంబకు మహారాజ్ఞి సోమలదేవితో కూడా కనీస పరిచయం, సాన్నిహిత్యం రెండూ లేవు. సాధారణంగా బందీలు ఎక్కడ ఉన్నా బందీలే! వారికి అందరితో సమానస్థాయి,పరిచయ భాగ్యాలు కూడా ఉండవు. జాయపుని నాట్య ప్రదర్శనకు నారాంబ, పేరాంబ హాజరైన రోజున ఎక్కువమంది చూశారు. అంతేకాదు గుర్తుపెట్టుకున్నారు కూడా! కారణం.. వారి అసాధారణ అందచందాలు.. వినయవిధేయతలు!
‘ఎవరూ!? ఎవరూ!?’ అని అందరూ ఆ రోజునే గుసగుసగా తెలుసుకున్నారు.
ఆమె రాజప్రాసాదంలోకి, అంతఃపురంలోకి ప్రవేశించినప్పుడు రాజనగరి బంధువర్గం ఆమెను ఆదరించడానికి, సన్నిహితంగా మెలగడానికి కారణం ఇప్పుడామె గణపతిదేవుని భార్య. మరో మహారాణి. ఆ హోదా రాచరికంలో అత్యంత ఉన్నతమైనది. తిరుగులేనిది. అందుకే అందరూ ఆమెతో పరిచయాలు చేసుకుని అన్యోన్యంగా సాగుతున్నారు. ఒక్క పట్టపురాణి సోమలదేవి తప్పించి.. అయితే నారాంబ తనకు దక్కిన ఈ అద్భుతస్థాయి హోదాను అపురూపంగా భావిస్తూ అందరితో గలగలా మాట్లాడుతూ వారి పేర్లు, బంధువరసలు గుర్తు పెట్టుకుంటూ మురిసిపోతున్నది. సోమలదేవి సవతి కాబట్టి ఆమె ప్రవర్తన అలాగే ఉంటుందిలే అని సరిపెట్టుకుంది. తను అక్కడ ఏడేళ్లు బందీగా ఉన్నానని ఆమెకు స్పష్టంగా తెలుసు. తనస్థాయి ఏమిటో కూడా తెలుసు. కారణం ఆమె అధమస్థాయి మహిళ కాదు. ఆమె అయ్యవంశపు క్షత్రియస్త్రీ. ఆ సంగతి కూడా ఆమెకు తెలుసు. రాజప్రాసాద కులీన మహిళలకు నారాంబ గురించి ఈ వివాహం వల్లనే తెలుసు. అయితే ఇప్పుడు రాజప్రాసాద కుటుంబాల వారి దృష్టి నారాంబను దాటి జాయపుని పైన ఉండటం విశేషం.
ఈ రాజబంధువులు అనే కులీనవర్గం చాలా శక్తి మంతమైనది. కారణం వీరంతా సాధారణంగా మేము కూడా సింహాసనానికి అర్హులమే.. సమస్థాయి గలవారమే అనే భావనతో ఉంటారు. మగవాళ్లు ఎలా ఉన్నా వారివారి భార్యలు మాత్రం మహారాణి గారి హోదా.. అధికార దర్పం చూస్తూ లోలోన ఉడికి పోతుంటారు. సదరు భర్తలపై తమ నిస్పృహ వెళ్లగక్కుతుంటారు. చరిత్రలో అనేకానేక రాజ్యాలలో జరిగిన దారుణమైన కుట్రలు కుతంత్రాలు ఇలాంటి వర్గాలే చేసిన దాఖలాలు కోకొల్లలు. కారణం.. మహారాజు అంతేవాసులమని వాళ్లు, వాళ్ల భార్యలు భావించడమే.
‘ఈ మాత్రం యుద్ధం మేమూ చెయ్యగలం..’ అనే భావాలు వారికి ఉంటాయి.
సాధారణంగా మహారాజు సోదరులు, తండ్రి, తాత సోదరులైన జ్ఞాతులు, వారి పుత్రులు, పుత్రికలు, వాళ్ల బంధువులు ఈ రాజబంధువుల వర్గంలో ఉంటారు. వీళ్లలో చాలామంది మంచి పదవుల్లో ఉంటారు. మహారాజుకు ఆంతరంగికులుగా, నమ్మకస్తులుగా మెలుగుతూ వేరువేరు మండలాల్లో ప్రధాని, అమాత్యులు, సైన్యాధ్యక్షులు లాంటి పదవుల్లో ఉంటారు. వీళ్లలో పండితులు, కళాకారులు, పాలనా ధురంధరులు ఉండటం కూడా కద్దు. నిజానికి చాలామంది తిని తిరగడమే చేస్తుంటారు.
మహారాజు కూడా అలాంటి తిని తిరిగేతత్వాన్నే వాళ్ల నుంచి ఆశిస్తాడు. కారణం వాడు గట్టిపిండం అయితే అది ఆయనకే తలనొప్పి. రాజ్యకోశంలో రాజప్రాసాద వాటా లేదా రాజుగారి భాగం ఉంటుంది. అదంతా వీళ్ల అలంకారాల కోసం, నగలు, బట్టల కోసం, పల్లకీలు, వాహనాలు, జంతువుల కోసం, తిండి కోసం.. పరిచారికలు తదితర సిబ్బంది కోసం ఖర్చయిపోతూ ఉంటుంది. రాజభవనపు నియోగాలలో కొట్టరువు నియోగం అనేది ఓ ముఖ్యనియోగం. ఈ కొట్టరువే రాజప్రాసాదానికి, రాజనగరికి వలసిన సమస్త వస్తువాహనాలను సమకూరుస్తాడు. మహారాజు నుంచి ఈ కులీన బంధువర్గం అంతా తమకు కావాల్సిన వస్తువులను ఆయనకు చెప్పాల్సిందే. కొట్టరువు సమకూర్చాల్సిందే.
నారాంబ జాయపుని పిలిచింది ఓ రోజు.. ఎన్నెన్నో దుస్తులు.. నగలు.. అనేకానేక అలంకార వస్తువులు.. తమ్ముడి కోసం తెప్పించింది. వచ్చి వాటిని చూసి ఆశ్చర్యపోయాడు జాయపుడు.
“ఇవన్నీ ఇప్పుడు.. ఎందుకు అక్కా..” అన్నాడు వాటిని చూస్తూనే.. అతని గొంతులో తిరస్కారం లేదు. ఆశ్చర్యంతో కూడిన ఆనందమే ఉంది.
“మీ బావగారి పురమాయింపు. కొట్టరువు శాంతలయకు వారే స్వయంగా పురమాయించి నాకు చెప్పారు. మీ తమ్ముని వాలకం.. అదే బట్టలు.. అబ్బ.. నాకే చిరాగ్గా ఉన్నాయి. కాస్త మంచివి తెప్పించమని కొట్టరువుకు పురమాయించాను. ఎంపిక తమరి బాధ్యత.. అన్నారు..” అన్నది నారాంబ.
“ఇవన్నీ ధరించడం ఇప్పుడు అవసరమా!?” అన్నాడు జాయపుడు.. వాటిని పట్టుకుని చూస్తూ!
“అవసరమే! నువ్విప్పుడు కాకతీయ చక్రవర్తి గణ పతిదేవులవారి ముద్దుల బావమరిదివి. అత్యంత ఆంతరంగికుడివి..” అన్నది. గతంలో జాయపకు మైలాంబ ఎప్పటికప్పుడు దుస్తులు ఏర్పాటుచేసేది. సుబుద్ధి కూడా పండుగకు తన పిల్లలతోపాటు జాయపకు కూడా కొత్తవి కొనేవాడు. అయితే వాటిని మైలాంబ తీసివేసి ఆమె ఎంపిక చేసినవి తొడిగించేది. ఆ వయసులో వాటి ప్రాముఖ్యం, వారి ఆప్యాయత ఏమీ తెలియదు. ఇప్పుడు గుర్తించి మనసంతా వారిపట్ల ప్రఫుల్లమయ్యింది.
గణపతిదేవుడే పురమాయించాడంటే లోలోన సంతోషించాడు జాయపుడు. అతనికి గణపతిదేవుడు ఏమి చేసినా ఇష్టమే. ఆయన తన గురించి ఆలోచిస్తున్నాడంటే మధురమే. జాయపుడు ఓ పట్టుపంచె, కంచుకం ఎంపిక చేసుకుని తొడుక్కుని అక్కకు చూపాడు. ఆమె కళ్లు ఇంతింత చేసుకుని చూస్తూ..
అన్నిచోట్లా అందరూ.. మెరిసే కళ్లతో జాయపకు గొప్ప ఆతిథ్యం ఇస్తున్నారు. ఆ గౌరవాలు మర్యాదలు.. అద్భుతమైన జ్ఞాపికలుగా జాయపుని మైమరపిస్తున్నాయి. అవన్నీ దినమూ అక్కకు చెప్తాడు. అక్క ఆనందం ఇంతింత కాదు. ఆమె బావకు చెబుతుంది. ఆయన ఆనందం కూడా తక్కువేమీ కాదు.
“నీకు వెంటనే దిష్టి తియ్యాలిరా జాయా! ఎంత బావున్నావో తెలుసా!?” అన్నది సంబురంగా.
నవ్వుకున్నాడు జాయప. అక్క ఎంత సంతోషంగా ఉంటే అతనికి అంత ఆనందం.
“ఉండు.. బావగారికి చూపించి వస్తా..” అంటూ వడివడిగా సభామందిరానికి వెళ్లి ఆయన ముందు అటూ ఇటూ తిరగడం చెయ్యసాగాడు.
సభ చాలా హడావుడిగా ఉండటంతో ఆయన ముందు పట్టించుకోలేదు. తర్వాత గుర్తించి మెరిసే కళ్లతో ఆమోదంగా చూశాడు. అప్పుడే మహారాజు పక్కనున్న మహాప్రధాని గంగాధర మంత్రి చూశాడు. ఆప్యాయంగా దగ్గరకు పిలిచాడు. వెళ్లి వినయంగా ఆయన వద్ద ఒదిగి నిలబడ్డాడు. ఆయన బుగ్గలు పుణికి..
“ఊ.. ఇప్పుడు చక్రవర్తికి బావమరిదిలా ఉన్నావ్..” అన్నాడు ఆప్యాయంగా.
సంతోషంగా చూస్తున్నాడు గణపతిదేవుడు.
“అక్కా బావలను కాసేపు విడిచి మావంటి వారి గృహాలను కూడా పావనం చెయ్యవచ్చు కదా కుర్రోడా..” అన్నారాయన ముద్దుగా. జాయపుడు జవాబివ్వకముందే ఏవో తాళపత్రాలు చూస్తున్న మహారాజు..
“అవునవును.. పెద్దలను వారి నివాసాలకు వెళ్లి కలవాలి.. ఆశీర్వాదాలు తీసుకోవాలి. ఆ..” అన్నాడు.
ఇద్దరికి అభివాదంచేసి మళ్లీ అక్క వద్దకు వచ్చాడు. ఆమె ఆసక్తిగా చూడగా జరిగింది చెప్పాడు.
ఆమె పకపకా నవ్వి..
“ఈరోజే వెళ్లు. ఆయన బావగారికి తండ్రి సమానులు.” అటూ ఇటూ చూసి..
“సోమలదేవి అక్కకు కూడా వారు మహాఇష్టులు..” అన్నది. ఇద్దరూ పకపకా నవ్వుకున్నారు.
ఆరోజు సంధ్యవేళకు గంగాధరమంత్రి ఇంటికి వెళ్లాడు. ఆయన ఇంటిల్లిపాది ద్వారం వద్దనే జాయపునికి ఘనస్వాగతం పలికారు. ఆశ్చర్యపోయాడు జాయపుడు. ఇలాంటివి అతను ఎన్నడూ ఎరుగడు. ఊహామాత్రంగా కూడా తెలియదు. యవ్వనుడై పూర్ణ చంద్రుడిలా శరత్కాలపు వెన్నెల్లా వెలిగిపోతున్న జాయపుడు ఇప్పుడిప్పుడే తనస్థాయిని గుర్తిస్తున్నాడు. గంగాధరుని భార్య, కొడుకులు, కోడళ్లు, కూతుళ్లు, అల్లుళ్లు.. వారివారి పిల్లలు అతణ్ని రెప్పవెయ్యకుండా చూస్తూ ఎంతో ఆత్మీయంగా మాట్లాడారు.. కబుర్లు చెప్పారు. ఏవేవో ముందుపెట్టి తినమని బలవంత పెట్టారు. తిరిగి అశ్వం వరకూ అందరూ వచ్చి ఘనమైన వీడ్కోలు పలికారు. మళ్లీ మళ్లీ వస్తూండాలని కోరారు. వారి ఆతిథ్యం అతణ్ని ఆనందింపచేయడమే కాక ఆశ్చర్యపరచింది.
‘ఏమిటి నాకీ గౌరవం!’ అనుకున్నాడు.
‘ఈ పదేళ్లలో ఇవన్నీ కోల్పోయాను..’ అనుకున్నాడిప్పుడు. అవి కోల్పోయినట్లు అప్పుడు తెలియదు. తెలియనితనం.. తెలియని వయసు. గంగాధరుల ఇంట లభించిన అద్భుత ఆత్మీయగౌరవం అక్కకు చెప్పాడు.
“ఇకపై నీకు లభించే గౌరవాలన్నీ అలాగే ఉంటాయి తమ్ముడూ!”.. ఆమె నవ్వుతూ అన్నది.
ఆమెకు ఇద్దరే ముఖ్యం.. ఆ ఇద్దరే ఆమె ప్రపంచం.. వారు భర్త.. తమ్ముడు!!
మరునాడు మల్యాల చౌండయ నివాసానికి వెళ్లాడు జాయపుడు. అ తర్వాత ప్రధాని రాజేంద్రయ నివాసానికి.. ఆ తర్వాత గోపరాజు రామప్రధాని నివాసానికి.. అలా దాదాపు పాతికమంది ప్రధానుల నివాసాలకు.. ఓ వందమంది మహాసేనానుల ప్రాసాదాలకు.. అన్నిచోట్లా అందరూ మెరిసే కళ్లతో కుటుంబం మొత్తం.. అతనికి గొప్ప ఆతిథ్యం ఇస్తున్నారు. అంతేకాదు జాయపుడు ఈరోజు మా ఇంటికి వస్తున్నాడు అంటూ బంధుమిత్రులందరినీ పిలుచుకుంటున్నారు. బంధుమిత్ర సపరివార సమేతంగా ఆతిథ్యం ఇస్తున్నారు. ఆ గౌరవాలు మర్యాదలు.. అవన్నీ అద్భుతమైన జ్ఞాపికలుగా జాయపుని మైమరపిస్తున్నాయి. అవన్నీ దినమూ అక్కకు చెప్తాడు. అక్క ఆనందం ఇంతింత కాదు. ఆమె బావకు చెబుతుంది. ఆయన ఆనందం కూడా తక్కువేమీ కాదు.
ఓ అమాత్యుని నివాసానికి వెళుతున్న వేళ నారాంబ తమ్మునికి ఏ దుస్తులు ధరించాలో.. ఏ ఆభరణాలు మెడను దాల్చాలో.. నడికట్టుకు ఏ వర్ణవస్త్రం చుట్టుకోవాలో.. తలకు ఏ ఉష్నీషం.. ఎలా పెట్టుకోవాలో అందుమీద ఏ ఆభరణం దాల్చాలో.. ఆమె నిర్ణయించి అలంకరించి పంపుతుంది. ఉన్నట్టుండి నారాంబ ఆనందసాగరంలో ఓ అంశం పెద్ద తుఫానును సృష్టించింది.
(సశేషం)
– మత్తి భానుమూర్తి 99893 71284