Jaya Senapati katha | జరిగిన కథ : కంటకతో కలిసి యోగాసనాలు, యుద్ధశిక్షణ తీవ్రతరం చేశాడు జాయప. యుద్ధవీరుడుగా నిరూపించుకునే క్షణం కోసం ఎదురుచూస్తున్నాడు. అప్పుడే రాజవార్త సంబంధి ఓ కొత్త వార్తను తీసుకొచ్చాడు. కాకతీయ రాజ్యంపై దండెత్తడానికి సిద్ధుడైన పృథ్వీశ్వరునిపై.. చక్రవర్తి యుద్ధం ప్రకటించినట్లు చెప్పాడు.
‘పృథ్వీశ్వరునిపై అంతిమయుద్ధం’ అనేసరికి యుద్ధ శిక్షణశాలలో వాతావరణం వేడెక్కింది. యుద్ధవీరులు, సైనికులు, దళపతులు, సేనానులు, సేనాపతులు.. ప్రకటన వెలువడిన మరునాటి నుంచే అక్కడికి రావడం ఎక్కువయ్యింది. యుద్ధ అనుభవజ్ఞులు వీళ్లు. గత యుద్ధ అనుభవాలను, రాబోయే యుద్ధతంత్రాలతో బేరీజు వేసుకోవడం చాలా ఉద్వేగంగా చర్చిస్తున్నారు.
“యుద్ధం ఏమోగానీ మళ్లీ మనమీద కొత్త పన్నులు విధిస్తారు.. ప్చ్!” అన్నాడు వల్లయశెట్టి యుద్ధశాలలో.
“యుద్ధం ఎప్పుడూ ఆహ్వానించదగ్గది కాదు జాయపా! అన్నిరంగాలలో అలజడులు పెరిగిపోతాయి. మళ్లీ జన దైనందినం ప్రశాంతంగా సాగడానికి ఎన్నో ఏళ్లు పడుతుంది. వెలనాడు యుద్ధం జరిగాక ఐదేళ్లకు ఇప్పుడిప్పుడే రాజ్యం ప్రశాంతంగా పురోగమిస్తున్నది. ఇప్పుడిప్పుడే చదువులపై పిల్లలు పెద్దలు దృష్టి పెడుతున్నారు. మళ్లీ యుద్ధమంటే.. పిల్లల చదువు నాశనం!” అన్నాడు శివభట్టు. సుబుద్ధిలాంటి సైనికులు యుద్ధ ఉత్సాహంలో ఉన్నారు.
“వెలనాడు పృథ్వీశ్వరుడు కయ్యానికి కాలు దువ్వుతున్నాడట. వాడు శత్రుశేషం! అప్పుడే యుద్ధంలో దొరికి ఉంటే తాడోపేడో తేలిపోయేది. అప్పుడు పారిపోయి.. ఇప్పుడు తొడ చరచడం ఏమిటి? అందుకే యుద్ధంలో శత్రుశేషం ఉండకూడదు అంటారు. వాణ్ని చంపేవరకూ మనకు ప్రశాంతత ఉండదు జాయపా! మీ తండ్రిగారిని కూడా వాడు మానసికంగా హింసిస్తున్నాడని వార్త!”..
తండ్రి ప్రసక్తి రాగానే గతంలో మల్యాల చౌండ చెప్పింది గుర్తొచ్చింది జాయపకు. పృథ్వీశ్వరుడు యుద్ధ సన్నద్ధుడు అవుతున్నాడని. అంటే.. అప్పటినుంచే ఓరుగల్లులో కూడా యుద్ధ ప్రయత్నాలు జరుగుతున్నాయన్న మాట. అనుమకొండ రోజురోజుకూ యుద్ధ సన్నద్ధతకు సమాయత్తమవుతున్న వేళ.. రాజవార్తసంబంధి ఎప్పటికప్పుడు యుద్ధ విశేషాలు ప్రకటిస్తూ యుద్ధోత్సాహం ఎగదోస్తున్నాడు. గుళ్లలో పూజలు.. వీధుల్లో కత్తులు కటార్లతో వీరంగాలు.. నిప్పులపై నడవడాలు.. శత్రువులపై పాటలు!
యుద్ధోద్వేగం జాయప మిత్రబృందాన్ని కూడా తాకింది. అంగళ్లవద్ద చర్చలవేళ మిత్రులందరూ యుద్ధభూమికి కూడా ‘సై!’ అన్నారు.
ఆవేళ త్రిపురతోపాటు చలమయశెట్టి కూడా వచ్చాడు. గతం కంటే మరింత గందరగోళ స్థితిలో ఉన్నాడు.
“చలమయా! మీరుకూడా యుద్ధ సంసిద్ధులు కండి..” అన్నాడు జాయప నవ్వుతూ.
అయోమయంగా చూశాడు చలమయ.
“సంతోషం యువవీరా! మీ ప్రావీణ్యం తెలిసింది. కానీ, నా సమస్య నెరవేరడంలేదు. ఆ ఆహోబలపతి ఇంకా దొరకలేదు. అప్పటివరకూ అతణ్ని వెతికే యుద్ధమే నాకు ప్రాప్తించింది.. ప్చ్!” అన్నాడు నిర్వేదంగా.
“అదేంటి మిత్రమా! నీకు నేను ఆర్థిక సహాయం చేశాను కదా! ఇకపై అతణ్ని మర్చిపో!”.. త్రిపుర అన్నాడు.
“సమయానికి సహాయం చేశావు. కానీ, అసలు ఆ ఆహోబలపతి ఎవ్వడో వాణ్ని దొరకబుచ్చుకోవాలి”..
“అలాగలాగే.. ఆ కార్యం మీదే ఉండండి” అన్నాడు జాయప.వెళ్లిపోయాడు చలమయ.
కాకతీయ రాజ్యంలో అన్ని కులస్థులనూ యుద్ధానికి అర్హులను చేశాడు గణపతిదేవుడు.
‘వీళ్లే కత్తి పట్టాలి.. వీళ్లే యుద్ధాలు చెయ్యాలి!’ అనే నిబంధనలు కూడా అసంబద్ధం అన్నాడు.
“అమాత్యులు, ప్రధానులు, కాలాముఖ గురువులు.. కత్తి పట్టగల ఎవరైనా యుద్ధరంగంలో పాల్గొనడానికి ఇదే నా ఆహ్వానగీతం!” అన్నాడు.
జాయప కూడా తన మిత్రబృందాన్ని ఉత్సాహపరిచాడు. యుద్ధరంగంలో.. లేకుంటే అంచె బృందాల్లో పాల్గొనాలని ప్రోత్సహించాడు. నాగంభట్టు, త్రిపుర, భైరవ రోజూ యుద్ధ శిక్షణకు వస్తున్నారు. కంటక నేతృత్వంలో వ్యాయామాలు, జాయప నేతృత్వంలో యుద్ధతంత్రాలు అభ్యాసం చేస్తున్నారు.
ఈ మిత్రబృందాన్ని యుద్ధ శిక్షణశాలకు వచ్చే సైనికులు, యుద్ధవిద్య గురువులు కూడా ప్రత్యేకంగా చూస్తారు. యుద్ధ శిక్షణశాలలో ఆ ఐదుగురి బృందం నేత్రానందంగా ఉంటుంది. అంతా యువకులే!
బ్రాహ్మణ కట్టూబొట్టూ, తలపై గోష్పాదమంత శిఖ.. పసుపురంగు పట్టుపంచె కట్టి, ఉత్తరీయం నడుముకు చుట్టిన నాగంభట్టు..
కాస్త మిశ్రమవర్ణంలో వైశ్య తలపాగాతో కోరమీసం దువ్వి, మోకాలివరకు కట్టిన పంచెపై కంచుకం ధరించిన త్రిపుర..
కాసెపోసి కట్టిన కాషాయ పంచె, ఒడలంతా విభూతిధారణతో కప్పిన శరీరం.. కాలాముఖ శైవ ఆహార్యంతో రౌద్ర దృక్కులతో భైరవ.. ఏడు అడుగుల భారీకాయం, రంగురంగుల ఈకల తలపాగా, ఒంటిపై పూసల హారాలు.. జబ్బల చుట్టూ తోలుపట్టికతో మేరుపర్వతంలా గిరిజన
కంటక దొర..
నిండైన శరీరాకృతితో పొడవుగా ఎదిగిన చందనవృక్షంలా, దృఢమైన నాజూకైన యువయోధుడు జాయప.
అందరూ తలతిప్పి చూడాల్సిందే!
ఉదయం నుంచి ఏ సమయంలో ఎవరిని కదిపినా యుద్ధ సంభాషణలే. యుక్త వయస్కులైన సుబుద్ధి కొడుకులు కూడా యుద్ధ సరదాలలో ఉన్నారు. సామాజిక కార్యకలాపాలూ యుద్ధం చుట్టూనే పరిభ్రమిస్తున్నాయి.
“పెళ్లి అని విన్నాను. ముహూర్తం ఎప్పుడ్రా రామిశెట్టి??”..
“వచ్చే మాఘంలో అనుకున్నాం మామా! ఇదిగో ఈ యుద్ధం అయ్యాక గానీ చేసుకోనని నాన్నగారితో చెప్పేశా!”..
“మీ నాన్న అభిప్రాయం కూడా అదేలే. కాకపొతే నీతో చెప్పించాడు!”..
ఓ మేనమామ, అల్లుళ్ల సంభాషణ.
“కొత్తబట్టల కోసం బందరు వర్తకులు వస్తారని చెప్పావ్.. కొన్నావా వదినీ!?”..
“రావడమూ అయ్యింది.. ‘వద్దు, యుద్ధం తర్వాత చూద్దాం!’ అని తిప్పి పంపడమూ అయ్యింది వదినీ!”..
ఇద్దరు గృహిణుల చర్చ. ఇలాంటి యుద్ధ వాతావరణం రోజురోజుకూ పురవాసులలో మరింత ఉత్సాహం, ఉద్వేగం పెంచుతున్నాయి.
రాచరిక యుగంలో ప్రజల బాగోగుల కంటే పెద్ద బలమైన సైన్యం కలిగి ఉండటంపైనే రాజులు ఎక్కువ దృష్టి పెడతారు. ఎంత పెద్ద సైన్యం ఉంటే అంత గొప్ప. సైన్యం గురించి చాలా అతిశయోక్తులు ప్రచారం చేస్తారు.
‘ఇంత పెద్దకాల్బలం ఉందట. అంతమంది విలుకాండ్రు ఉన్నారట. అబ్బో ఏనుగులే వేలల్లో ఉన్నాయట!’.. ఇలా కావాలని ప్రచారం చెయ్యడం కూడా యుద్ధనీతిలో భాగమే. ఈ ప్రచారానికి జగజ్జేత అలెగ్జాండర్ కూడా అల్లకల్లోలమై పోయాడు. ప్రపంచమంతా గెలుపు సాధించిన ఆ మహాయోధుని యుద్ధతంత్రాలు ఇక్కడ సరిహద్దుల్లోనే వ్యర్థమై, ఛిద్రమై.. చివరికి స్వదేశం చేరకుండానే దారిలో అనాథలా చచ్చాడు.
సైనికశక్తి అంటే ఆరు ప్రధాన విభాగాలు. అవి మౌల, భృత్య, శ్రేణి, మిత్ర, అమిత్ర, ఆటవిక బలగాలు.
ఈ సైనిక వర్గాలన్నీ కాకతీయ సైనిక పటాలాల్లో ఉన్నాయి. యుద్ధతంత్రాన్ని విభిన్న వ్యూహాలతో రూపొందిస్తూ, సమయానుకూలంగా మార్చుకుంటూ.. మహామేధావులైన యుద్ధ మంత్రాంగవేత్తలతో, మహావీరులైన సైన్యాధ్యక్షులతో అప్రతిహత విజయాలతో పురోగమిస్తున్న కాకతీయ సామ్రాజ్యం.. మరో చారిత్రాత్మక యుద్ధానికి సిద్ధం అవుతున్నది.
ఆయుధాలకు పదును పెట్టడాలు, కొత్త ఆయుధాల కొనుగోళ్లు.. రథాల మరమ్మతులు, అశ్వాలు, ఏనుగుల ఆరోగ్యం, ఆహారం తదితర అంశాలు.. పల్లకీలు, ఎడ్లబళ్లు.. వైద్య బృందాలు, నాట్యకారులు, భోగపుసానులు.. పురోహితులు.. అన్నీ, అంతా యుద్ధ సంసిద్ధతే.
ఇక కళాకారులకైతే పట్టపగ్గాలు లేవు. ఏ ప్రాంతంలో చూసినా, ఏ పురవీధిలో చూసినా, ఏ గుడిలో చూసినా.. అన్నీ యుద్ధ సంబంధిత కళాప్రదర్శనలే!
ఒకచోట గొండ్లి.. ఒక కళాకారిణి యుద్ధం చేస్తున్నట్లు నృత్యం చేయడమనే కార్యకలాపం జరుగుతున్నది. జనం విరగబడి చూస్తున్నారు. ఇంకోచోట ప్రేంకణం.. చతుర సంభాషణలతో కలహించుకుంటూ ఆడుతున్న నృత్యం. మరోచోట భోగపు యువతుల బృందనృత్తం జరుగుతున్నది. చక్కగా వర్తులాకారంగా కదలుతూ, యుద్ధవీరుడైన రాజును ఆరాధించడం.. అది నాట్యరాసకం.. ఒకచోట చిందు, ఒకచోట కందుకం, ఒకచోట భాండకం..
కొత్తకొత్త హాస్య సంభాషణలతో భాండులు నవ్విస్తూ, ప్రేక్షకులను యుద్ధ సంసిద్ధులను చేస్తున్నారు.
ఉరుము వాద్యాన్ని మెడలో వేసుకుని గుండెలు ఉప్పొంగేలా వాయిస్తూ.. రహదారుల్లో తిరుగుతున్న మాదిగ కళాకారులు, ఎనుబోతు కొమ్ముల తలపాగాతో గిరిజన నృత్యం ఆడుతూ గిరిజనులైన చెంచులు!
సాధారణ ప్రజానీకం ఇలా ఉంటే.. రాజాస్థానంలో కళాప్రదర్శనల సంగతి మరోలా ఉంది.
గతంలో నీలాంబతోనూ, గుండయామాత్యునితోనూ కొత్త నృత్త ప్రక్రియను ఆలోచించాడు జాయప.
ఏదో గ్రామంలో ఓ రుద్రోత్సవంలో ఎప్పుడో చూసిన చిందు.. చూపరులు తీవ్రంగా ఉత్తేజితులవ్వడం జాయప మనసులో నిలిచి ఉంది.
జాయప భావనలో అదిప్పుడు ముందుకొచ్చి నర్తిస్తున్నది.. కొత్త నాట్యరూపాలను రేకెత్తిస్తున్నది.
నాట్యం, నృత్యం, నృత్తం.. అనే మూడు ప్రధానాంగాలలో జాయపకు నృత్తం అంటే ఎక్కువ ఇష్టం.
భాష, కథాంశాలకు అతీతంగా కేవలం శబ్దానికి అనుగుణంగా శారీరక విన్యాసాల ప్రదర్శనే నృత్తం.
నాట్యానికి ఆదిదేవుడైన శివుడు.. నటరాజుగా చేసేది నృత్తమేనని నాట్యశాస్రం చెబుతున్నది.
‘ఆ ఉత్తేజిత చిందు శైవ ప్రధానంగా యుద్ధంపట్ల ప్రజలలో సానుకూల వాతావరణం కలిగించే ఒక నృత్తాంశంగా పునర్నిర్మిస్తే’.. అనే ఆలోచన జాయపలో దినదిన ప్రవర్ధితమవుతున్నది.
నాట్య గురుకుల బృందంతో చర్చించి తనే నర్తించి చూపినప్పుడు గుండయామాత్యుడు సహా నాట్య గురువులంతా అభినందించారు. ఈ నృత్త ప్రక్రియపై జాయప ప్రధాన పాత్రధారిగా గురుకులంలోని నాట్య విద్యార్థులతో అభ్యాసం చేయిస్తూ, దానిని మరింత పరిపుష్టం చేశారు. నీలాంబ దానికి మరింత మెరుగులు దిద్దింది. భైరవ కూడా ఇందులో ఓ నర్తకుడు.
ఈ దేశీనాట్య రూపకం.. కాకతీయ నాట్యశాస్త్ర కోవిదుల అద్భుత మేధావిత్వంతో పూర్తిస్థాయి మార్గీ నృత్తాంశంగా పరిపూర్ణ రూపం తీసుకుంది. యుద్ధమంత్రాంగ చర్చల్లో తలమునకలై ఉన్న చక్రవర్తుల దృష్టికి దీనిని తీసుకెళ్లిన గుండాయామాత్యుడు.. ఆయన అనుజ్ఞతో రాచనగరులో ప్రదర్శన ఏర్పాటుచేశాడు.
అదే ఈ కొత్త నాట్యం తొలి ప్రదర్శన. చక్రవర్తి గణపతిదేవుడు పట్టమహిషితోకాక మంత్రులు, సైన్యాధ్యక్షులు, మండలేశ్వరులతో కలిసి తిలకించాడు. తొలి ప్రదర్శన చూసి అందరూ ముక్తకంఠంతో అన్నది..
“అద్భుతం” అని. చక్రవర్తి గణపతిదేవుడైతే మరింత మురిసిపోయాడు.
“ఇది మన కాకతీయ కళాకారుల సరికొత్త సృష్టి అని తెలిసి ఎంతో గర్విస్తున్నాను” అన్నాడు.
“గుండయామాత్యా, నీలాంబా.. దీనికి మరింత మెరుగుపెట్టి ప్రతి గ్రామంలో, పురాలలో, సంతలలో, చతుష్పథాల వద్ద విరివిగా ప్రదర్శించండి. ఇది ఎంతో ఉత్తేజం, ప్రేరణ కలిగిస్తున్నది. కాబట్టి దీనికి ‘ప్రేరణనాట్యం’ అని పేరుపెడితే ఎలా ఉంటుందో ఆలోచించండి” అన్నాడు.
మందిరమంతా కరతాళధ్వనులతో మార్మోగిపోయింది. కానీ, చక్రవర్తి సంతోషించలేదు.
“ఆగండి. ఇది ప్రజలు మెచ్చాల్సిన నాట్యరీతి. ముందు ప్రజల్లోకి తీసుకెళ్లండి. పురవాసులు, గ్రామవాసులు ఏకకాలంలో మెచ్చుకుంటే.. మీరూ, మేమూ ధన్యులమైనట్లే!”..
రాజాజ్ఞతో పది దేశీ నాట్యబృందాలకు ప్రేరణనాట్యంపై శిక్షణ ఇచ్చారు జాయప తదితర గురువులు. అందులో భైరవ నటించే కొండయబృందం కూడా ఒకటి. దాదాపు ఒక్క మాసపు రోజుల్లోనే ఈ పదిబృందాలు ప్రేరణ నాట్యాన్ని రాజ్యపు వాడవాడలా ప్రదర్శించారు.
ఊహాతీతంగా ఈ కొత్తనాట్యం ప్రజలపై తీవ్ర ప్రభావం చూపింది. ఇప్పుడు ఎక్కడ.. ఏ నలుగురు మాట్లాడుకున్నా.. ప్రేరణ నాట్యం గురించే! దాంతో యుద్ధోత్తేజం మరింత పెరిగింది. ఆ ఉద్వేగవేళ జాయపకో సందేహం.. ‘ఈ యుద్ధంలో నా పాత్ర ఏమిటి?’ అని..
(సశేషం)
– మత్తి భానుమూర్తి 99893 71284