హైదరాబాద్, జూన్ 1(నమస్తే తెలంగాణ): బీఆర్ఎస్ హయాంలో పేదలకు సూపర్ స్పెషాలిటీ వైద్యసేవలు అందించాలనే సదాశయంతో తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ హైదరాబాద్ నగరంలో తెలంగాణ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్(టిమ్స్) దవాఖానలకు అంకురార్పణ చేశారు. ‘ఆరోగ్య తెలంగాణ’ లక్ష్యంగా నాడు సనత్నగర్, అల్వాల్, ఎల్బీనగర్ టిమ్స్ దవాఖానల నిర్మాణాన్ని ప్రారంభించారు. ఇక బీఆర్ఎస్ హయాంలోనే సనత్నగర్ టిమ్స్ పనులు 60 శాతానికిపైగా పూర్తయ్యాయి. కాంగ్రెస్ అధికారం చేపట్టి రెండున్నరేండ్లు పూర్తయినా.. దవాఖాన ప్రారంభోత్సవానికి నోచుకోకపోవడం పేదల ఆరోగ్యంపై ఆ పార్టీ చిత్తశుద్ధిని తెలియజేస్తున్నది. మరోవైపు సనత్నగర్ టిమ్స్ ప్రారంభోత్సవం విషయంలో కాంగ్రెస్ సర్కార్ గడువులకే పరిమితం అవుతున్నదనే విమర్శలు వె ల్లువెత్తుతున్నాయి.
1,000 పడకల సామర్థ్యంతో నిర్మిస్తున్న ఈ దవాఖాన ప్రారంభోత్సవాన్ని కాంగ్రెస్ ప్రభు త్వం పలుమార్లు వాయిదా వేసింది. గతేడాది డిసెంబర్ 9న సోనియాగాంధీ పుట్టినరోజు సందర్భంగా దవాఖానను ప్రారంభిస్తామని ఆరోగ్యశాఖ మంత్రి, ప్రభుత్వ ప్రత్యేక కార్యదర్శి ప్రకటించినా.. ఆచరణలో అమలు కాలేదు. దీంతో సంక్రాంతికి ప్రారంభించాలని ప్రభుత్వం భావించింది. పనులు పూర్తికాకపోవడంతో ఆ గడువును ఉగాదికి మార్చింది. ఈ దవాఖాన ప్రారంభం అయితే గాంధీ, ఉస్మానియా, నిమ్స్, ఇతర ప్రభుత్వ దవాఖానలపై ఒత్తిడి తగ్గ్గుతుందని వైద్య నిపుణులు అభిప్రాయపడుతుండగా.. కాంగ్రెస్ సర్కార్ నిర్లక్ష్యంతో ప్రారంభోత్సవం మూడు గడువులు, ఆరు వాయిదాలు అన్న చందంగా మారింది. తాజాగా టిమ్స్ సనత్నగర్ ప్రారంభోత్సవానికి సంబంధించి వైద్యవర్గాలు మరో తేదీని చెబుతున్నాయి. మంగళవారం సీఎం రేవంత్రెడ్డికి ముందే నిర్ణయించిన కార్యక్రమాలు చాలా ఉన్నాయని అంటున్నారు. ఈ నెల 11న సనత్నగర్ టిమ్స్ను ప్రారంభించనున్నట్టు అధికారవర్గాలు తెలిపాయి.