యువ ఓపెనర్ యశస్వి జైస్వాల్ ఒంటరి పోరాటం చేయడంతో ఇంగ్లండ్తో రెండో టెస్టులో టీమ్ఇండియా మెరుగైన స్థితిలో నిలిచింది. మిగిలిన వాళ్లంతా మంచి ఆరంభాలను భారీ ఇన్నింగ్స్లుగా మలచడంలో విఫలమైన చోట.. జైస్వాల్ మాత్రం క్లాసిక్ ఇన్నింగ్స్తో కదంతొక్కాడు!
తొలి టెస్టులో ఓడి సిరీస్లో వెనుకబడ్డ రోహిత్సేనకు టాస్ కలిసిరాగా.. దాన్ని వినియోగించుకోవడంలో మనవాళ్లు విఫలమయ్యారు. రోహిత్, గిల్,శ్రేయస్, రజత్, అక్షర్, భరత్ ఇలా ప్రతి ఒక్కరికీ మంచి స్టార్ట్ లభించినా.. దాన్ని వినియోగించుకోలేకపోగా.. బషీర్, రెహాన్ చెరో రెండు వికెట్లు తీశారు.
ఉప్పల్ టెస్టులో శతక్కొట్టే చాన్స్ మిస్ చేసుకున్న యశస్వి.. ఈసారి దుమ్మురేపాడు. ఓ వైపు వికెట్లు పడుతున్నా అదరక బెదరక ఎదురు నిలిచి ధాటిగా పరుగులు రాబట్టాడు. బౌండ్రీతో అర్ధశతకం నమోదు చేసుకున్న జైస్వాల్.. భారీ సిక్సర్తో కెరీర్లో రెండో సెంచరీ తన పేరిట రాసుకున్నాడు. బౌండ్రీతోనే 150 పరుగుల మార్క్ అందుకున్న జైస్వాల్పైనే ఇప్పుడు జట్టు భారం ఉంది. లోయర్ ఆర్డర్తో కలిసి అతడు మరెన్ని పరుగులు జోడిస్తాడో చూడాలి!
సెషన్ల వారిగా ముందుకు సాగా. సుదీర్ఘ లక్ష్యాలు పెట్టుకోలేదు. బౌలింగ్ కట్టుదిట్టంగా సాగినప్పుడు సంయమనం పాటించా. చెత్త బంతి దొరికినప్పుడు ప్రతాపం చూపా. చివరి వరకు ఆడాలనే ఏకైక లక్ష్యం పెట్టుకున్నా.
-యశస్వి జైస్వాల్
Yashasvi Jaiswal | విశాఖపట్నం: యంగ్ ఓపెనర్ యశస్వి జైస్వాల్ (257 బంతుల్లో 179 బ్యాటింగ్; 17 ఫోర్లు, 5 సిక్సర్లు) సూపర్ సెంచరీతో వీరవిహారం చేయడంతో ఇంగ్లండ్తో రెండో టెస్టులో టీమ్ఇండియా భారీ స్కోరు దిశగా సాగుతున్నది. ఐదు మ్యాచ్ల సిరీస్లో భాగంగా తొలి టెస్టులో పరాజయం పాలై 0-1తో వెనుకంజలో ఉన్న రోహిత్ సేన.. వైజాగ్ పోరులో టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది. మ్యాచ్ సాగుతున్నా కొద్ది ఈ పిచ్పై బ్యాటింగ్ చేయడం కష్టమయ్యే అవకాశం ఉండటంతో నాలుగో ఇన్నింగ్స్లో లక్ష్యఛేదన కష్టమని భావించి ఈ నిర్ణయం తీసుకుంది. యశస్వి దూకుడుతో తొలి రోజు ఆట ముగిసే సమయానికి భారత్ 93 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 336 పరుగులు చేసింది.
ఈ మ్యాచ్లో ఇంగ్లండ్ జట్టు నలుగురు స్పిన్నర్లతో దాడి కొనసాగించగా.. చాన్నాళ్ల తర్వాత టెస్టు మ్యాచ్ ఆడిన వెటరన్ పేసర్ జేమ్స్ అండర్సన్ కూడా ప్రభావం చూపాడు. ఓ ఎండ్లో యశస్వి దంచికొడుతుంటే.. మరో ఎండ్ నుంచి అతడికి సరైన సహకారం లభించలేదు. అరంగేట్ర బౌలర్ బషీర్కు కెప్టెన్ రోహిత్ శర్మ (14) వికెట్ సమర్పించుకోగా.. శుభ్మన్ గిల్ (34), శ్రేయస్ అయ్యర్ (27) ఎక్కువసేపు నిలువలేకపోయారు. గత కొంతకాలంగా టెస్టుల్లో స్థాయికి తగ్గ ప్రదర్శన చేయలేకపోతున్న ఈ ఇద్దరు మరో అవకాశాన్ని చేజార్చుకున్నట్లే కనిపిస్తున్నది. సర్ఫరాజ్ ఖాన్ను కాదని.. తుది జట్టులో చోటు కల్పించిన రజత్ పాటిదార్ (32) పర్వాలేదనిపించగా.. అక్షర్ పటేల్ (27), శ్రీకర్ భరత్ (17) చివరి సెషన్లో స్పిన్నర్లకు తలవంచారు. ఇంగ్లండ్ బౌలర్లలో రేహాన్ అహ్మద్, షోయబ్ బషీర్ చెరో రెండు వికెట్లు పడగొట్టారు. ప్రస్తుతం యశస్వితో పాటు రవిచంద్రన్ అశ్విన్ (5) క్రీజులో ఉన్నాడు. శనివారం తొలి సెషన్లో ఇంగ్లిష్ బౌలర్లను జైస్వాల్ ఎలా ఎదుర్కుంటాడనేది ఆసక్తికరం.
స్టార్ పేసర్ మహమ్మద్ సిరాజ్కు ఈ మ్యాచ్ నుంచి విశ్రాంతి కల్పించినట్లు టీమ్ మేనేజ్మెంట్ వెల్లడించింది. పనిభారాన్ని తగ్గించేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు బీసీసీఐ ఒక ప్రకటనలో తెలిపింది. ‘గత కొంతకాలంగా సిరాజ్ విరామం లేని క్రికెట్ ఆడుతున్నాడు. అందుకే ఇంగ్లండ్తో రెండో టెస్టు నుంచి అతడికి విశ్రాంతినిచ్చాం. మూడో మ్యాచ్కు అతడు అందుబాటులో ఉంటాడు. ఈ నడుమ కుటుంబంతో గడిపేందుకు సిరాజ్కు కొంత సమయం చిక్కుతుంది. అతడి స్థానంలో అవేశ్ ఖాన్ను జట్టులో చేర్చాం’ అని అందులో పేర్కొంది. అయితే పరిస్థితి మాత్రం దీనికి విరుద్ధంగా కనిపిస్తున్నది.
హైదరాబాద్ వేదికగా జరిగిన తొలి టెస్టులో సిరాజ్ నైపుణ్యాలను పూర్తి స్థాయిలో వాడుకోలేదనేది వాస్తవం. రెండో ఇన్నింగ్స్లో ప్రమాదకర బంతులు వేసే సిరాజ్కు పట్టుమని పది ఓవర్లు కూడా బౌలింగ్ ఇవ్వకపోవడం కెప్టెన్ రోహిత్ పొరపాటే అని విశ్లేషకులు ఆరోపిస్తున్నారు. ఇప్పుడు విశ్రాంతి పేరుతో సిరాజ్ను తప్పించి ముఖేశ్కుమార్కు తుది జట్టులో చోటు కల్పించడం కూడా విమర్శలకు తావిచ్చింది. మరోవైపు చాన్నాళ్లుగా జట్టులో చోటు కోసం ఎదురుచూస్తున్న మిడిలార్డర్ బ్యాటర్ సర్ఫరాజ్ ఖాన్కు తుది జట్టులో చోటు దక్కలేదు. రాహుల్ స్థానాన్ని రజత్ పాటిదార్తో భర్తీ చేశారు. దీంతో సర్ఫరాజ్ను ఎంపిక చేయకపోవడంపై సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున విమర్శలు వచ్చాయి.
భారత్ తొలి ఇన్నింగ్స్: 336/6 (యశస్వి 179 బ్యాటింగ్, గిల్ 34; రెహాన్ 2/61, బషీర్ 2/100),