బెంగళూరు: దేశవాళీ టోర్నీ రంజీ ట్రోఫీ ఫైనల్లో మధ్యప్రదేశ్ అదరగొడుతున్నది. ముంబైతో జరుగుతున్న పోరులో యశ్ దూబే (336 బంతుల్లో 133; 14 ఫోర్లు), శుభమ్ శర్మ (215 బంతుల్లో 116; 15 ఫోర్లు, 1 సిక్సర్) శతకాలతో కదం తొక్కడంతో శుక్రవారం ఆట ముగిసే సమయానికి మధ్యప్రదేశ్ 3 వికెట్ల నష్టానికి 368 పరుగులు చేసింది. తొలి ఇన్నింగ్స్లో ముంబై 374 పరుగులు చేయగా.. ప్రస్తుతం చేతిలో 7 వికెట్లు ఉన్న మధ్యప్రదేశ్.. ప్రత్యర్థి స్కోరుకు 6 పరుగులు వెనుకబడి ఉంది. ఐపీఎల్లో బెంగళూరు తరఫున సత్తాచాటిన రజత్ పాటిదార్ (67 బ్యాటింగ్; 13 ఫోర్లు), కెప్టెన్ ఆదిత్య శ్రీవాస్తవ (11 బ్యాటింగ్) క్రీజులో ఉన్నారు. ముంబై బౌలర్లలో తుషార్, షమ్స్, మోహిత్ తలా ఒక వికెట్ పడగొట్టారు. చివరిసారిగా 1998-99 సీజన్లో రంజీ ఫైనల్ చేరిన మధ్యప్రదేశ్.. కర్ణాటక చేతిలో ఓటమి పాలై రన్నరప్తో సరిపెట్టుకుంది. ఈ పోరులో తొలి ఇన్నింగ్స్ ఆధిక్యం సాధించే దిశగా సాగుతున్న మధ్యప్రదేశ్ తొలి రంజీ ట్రోఫీ చేజిక్కించుకోవాలని తహతహలాడుతున్నది.
ఓవర్నైట్ స్కోరు 123/1తో మూడో రోజు తొలి ఇన్నింగ్స్ కొనసాగించిన మధ్యప్రదేశ్.. ఆరంభం నుంచి ఆచితూచి ఆడింది. ముంబై బౌలర్లపై ఎదురుదాడికి దిగకుండా.. క్రీజులో పాతుకుపోయేందుకు ఎక్కువ ప్రాధాన్యం ఇచ్చిన యశ్, శుభమ్ రెండో వికెట్కు 222 పరుగులు జోడించారు. ఈ జోడీ బౌలర్ల సహనానికి పరీక్ష పెట్టడంతో ముంబై పోటీలోకి రాలేకపోయింది. ఎన్నో ఆశలు పెట్టుకున్న లెఫ్టార్మ్ స్పిన్నర్ షమ్స్ ములానీ 40 ఓవర్లు వేసి ఒక్క వికెట్ మాత్రమే పడగొట్టడం ముంబై అవకాశాలను దెబ్బ కొట్టింది. ఇప్పటికే ముంబై స్కోరుకు సమీపించిన మధ్యప్రదేశ్.. తొలి ఇన్నింగ్స్ ఆధిక్యం సాధించడం దాదాపు ఖాయంగా కనిపిస్తున్నది. ప్రస్తుతం రజత్ పాటిదార్, ఆదిత్య శ్రీవాస్తవ క్రీజులో ఉండగా.. ఆకాశ్ రఘువంశీ, సారాంశ్ జైన్ కూడా బ్యాటింగ్ చేయగలవారే కావడం మధ్యప్రదేశ్కు కలిసిరానుంది.