WTC Rankings: వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ ర్యాంకింగ్స్లో ఆస్ట్రేలియా అగ్రస్థానానికి ఎగబాకింది. పాకిస్తాన్తో స్వదేశంలో జరిగిన మూడు మ్యాచ్ల టెస్టు సిరీస్ను 3-0తో దక్కించుకున్న కంగారూలు.. డబ్ల్యూటీసీ 2023-25 ర్యాంకింగ్స్లో భారత్ను వెనక్కినెట్టి తొలి స్థానాన్ని దక్కించుకున్నారు. సౌతాఫ్రికాతో కేప్టౌన్ వేదికగా జరిగిన రెండో టెస్టులో గెలిచిన భారత్.. అగ్రస్థానంలో కొనసాగినా పాకిస్తాన్ వైట్ వాష్ కావడంతో రోహిత్ సేన రెండో స్థానానికి పరిమితమైంది.
డబ్ల్యూటీసీ 2023-25 సైకిల్లో ఆస్ట్రేలియా ఇప్పటివరకూ 8 మ్యాచ్లు ఆడి ఐదింటిలో గెలిచి రెండు మ్యాచ్లలో ఓడింది. ఒక మ్యాచ్ డ్రా చేసుకున్న కంగారూలు.. 56.25 విన్ పర్సంటేజ్తో తొలి స్థానంలో ఉంది. ఈ సైకిల్లో నాలుగు టెస్టులు (విండీస్, దక్షిణాఫ్రికాతో రెండేసి మ్యాచ్లు) ఆడిన రెండు గెలిచి ఒకదాంట్లో ఓడి ఒకటి డ్రా చేసుకుంది. భారత్ 54.16 విన్ పర్సంటేజ్ పాయింట్లతో ఉండగా రెండు టెస్టులు ఆడిన సౌతాఫ్రికా మూడో స్థానంలో ఉండగా కివీస్ కూడా అన్నే మ్యాచ్లలో ఒక విజయంతో నాలుగో స్థానంలో నిలిచింది. బంగ్లాదేశ్, పాకిస్తాన్, వెస్టిండీస్, ఇంగ్లండ్, శ్రీలంకలు తదుపరి స్థానాల్లో నిలిచాయి.
భారత్ను ఆస్ట్రేలియా అధిగమించినా ఫిబ్రవరి-మార్చి వరకు తిరిగి అగ్రస్థానాన్ని భారత్ కైవసం చేసుకునే అవకాశాలు మెండుగా ఉన్నాయి. రాబోయే రెండు నెలల్లో భారత్.. స్వదేశంలో ఇంగ్లండ్తో ఐదు మ్యాచ్ల టెస్టు సిరీస్ ఆడనుంది. ఈ సిరీస్ గెలిస్తే భారత్.. తిరిగి డబ్ల్యూటీసీ 23-25 సైకిల్లో మొదటి స్థానాన్ని దక్కించుకోవచ్చు. ఇదిలాఉండగా ఈ ఏడాది నాలుగు అగ్రశ్రేణి జట్లు ఆడిన తొలి టెస్టులలో భారత్, ఆస్ట్రేలియాలు ఘన విజయం సాధించగా సౌతాఫ్రికా, పాకిస్తాన్ మాత్రం చతికిలపడ్డాయి. సిడ్నీలో పాకిస్తాన్ మరోసారి చేతులెత్తేయగా కేప్టౌన్లో దక్షిణాఫ్రికా పేస్కు అనుకూలించే పిచ్పై బొక్క బోర్లా పడింది.