ఆదుకుంటారనుకున్న స్టార్ ఆటగాళ్లు ఒకరి వెంట ఒకరు పెవిలియన్ బాట పట్టడంతో.. ప్రపంచ టెస్టు చాంపియన్షిప్ ఫైనల్లో టీమ్ఇండియా ఎదురీదుతున్నది. ఆసీస్ ఆటగాళ్లు అలవోకగా పరుగులు రాబట్టిన చోట భారత టాపార్డర్లో ఒక్కరు కూడా పట్టుమని పదిహేను పరుగులు చేయకుండానే వెనుదిరిగారు. అంతకుముందు కంగారూలు తొలి ఇన్నింగ్స్లో కొండంత స్కోరు చేయగా.. 151 పరుగులకే మనవాళ్లు సగం వికెట్లు కోల్పోయారు. మూడో రోజు లోయర్ ఆర్డర్తో కలిసి రహానే ఏ మేరకు పోరాడుతాడనేది ఆసక్తికరం
లండన్: ప్రపంచ టెస్టు చాంపియన్షిప్ పైనల్లో భారత టాపార్డర్ తేలిపోయింది. నాణ్యమైన పేస్ను ఎదుర్కోలేక మనవాళ్లు చేతులెత్తేశారు. ప్రత్యర్థి ఆటగాళ్లు మంచినీళ్ల ప్రాయంగా పరుగులు పిండుకున్న చోట మనవాళ్లు ఒక్కో పరుగుకు ఆపసోపాలు పడ్డారు. ఫలితంగా రెండో రోజు ఆట ముగిసే సమయానికి కంగారూలు స్పష్టమైన ఆధిక్యం సాధించారు. గురువారం చివరికి టీమ్ఇండియా తొలి ఇన్నింగ్స్లో 5 వికెట్లు కోల్పోయి 151 పరుగులు చేసింది. కెప్టెన్ రోహిత్ శర్మ (15), యువ ఓపెనర్ శుభ్మన్ గిల్ (13), చతేశ్వర్ పుజారా (14), విరాట్ కోహ్లీ (14) విఫలం కాగా.. రవీంద్ర జడేజా (51 బంతుల్లో 48; 7 ఫోర్లు, ఒక సిక్సర్), అజింక్యా రహానే (29 బ్యాటింగ్; 4 ఫోర్లు) కాస్త పోరాడారు.
ఆస్ట్రేలియా బౌలర్లలో స్టార్క్, కమిన్స్, బోలాండ్, గ్రీన్, లియాన్ తలా ఒక వికెట్ పడగొట్టారు. రహానేతో పాటు ఆంధ్ర ఆటగాడు శ్రీకర్ భరత్ (5 బ్యాటింగ్) క్రీజులో ఉన్నాడు. చేతిలో 5 వికెట్లు ఉన్న రోహిత్ సేన ప్రత్యర్థి స్కోరుకు ఇంకా 318 పరుగులు వెనుకబడి ఉంది. అంతకుముందు ఓవర్నైట్ స్కోరు 327/3తో రెండో రోజు తొలి ఇన్నింగ్స్ కొనసాగించిన ఆస్ట్రేలియా ఆఖరికి 469 పరుగులకు ఆలౌటైంది. ట్రావిస్ హెడ్ (174 బంతుల్లో 163; 25 ఫోర్లు, ఒక సిక్సర్) భారీ శతకం ఖాతాలో వేసుకోగా.. స్టీవ్ స్మిత్ (121; 19 ఫోర్లు) సెంచరీ పూర్తి చేసుకున్నాడు. చివర్లో అలెక్స్ కారీ (48; 7 ఫోర్లు, ఒక సిక్సర్) విలువైన పరుగులు జోడించాడు. భారత బౌలర్లలో సిరాజ్ 4, షమీ, శార్దూల్ చెరో రెండు వికెట్లు తీశారు.
ఆసీస్ ఆటగాళ్లు దంచికొట్టిన చోట.. మన బ్యాటర్లు పరుగులు చేసేందుకు తీవ్రంగా ఇబ్బంది పడ్డారు. కొన్ని చక్కటి షాట్లతో మంచి టచ్లో కనిపించిన రోహిత్ శర్మ ఆరో ఓవర్లో పెవిలియన్ చేరగా.. ఆ తర్వాత మిగిలినవాళ్లు అతడిని అనుసరించారు. ఐపీఎల్లో భీకర ఫామ్ కనబర్చిన గిల్ను ఓ సూపర్ బాల్తో బోలాండ్ క్లీన్ బౌల్డ్ చేయగా.. పుజారాను గ్రీన్ బుట్టలో వేసుకున్నాడు. ఒక ఎండ్లో వికెట్లు పడుతున్నా.. మొండిగా పోరాడిన మాజీ కెప్టెన్ కోహ్లీ ఆదుకుంటాడనుకుంటే అదీ అత్యాశే అయింది. తన పాత పొరపాటును మార్చుకోని కోహ్లీ.. స్లిప్లో స్మిత్ పట్టిన చక్కటి క్యాచ్కు డగౌట్ బాట పట్టాడు.
ఈ దశలో జడేజా, రహానే కలిసి ఇన్నింగ్స్ను నిర్మించే ప్రయత్నం చేయడంతో వికెట్ల పతనానికి అడ్డుకట్ట పడింది. ఒక ఎండ్లో రహానే క్రీజులో పాతుకుపోగా.. మరో ఎండ్ నుంచి జడేజా వేగంగా ఆడాడు. ఆసీస్ బౌలర్లపై ఎదురుదాడికి దిగిన జడ్డూ.. ఎడాపెడా బౌండ్రీలతో స్కోరు బోర్డును పరుగులు పెట్టించాడు. దీంతో టీమ్ఇండియా 142/4తో కోలుకున్నట్లే అనిపించినా.. మరికాసేపట్లో రెండో రోజు ఆట ముగుస్తుందనగా.. జడేజా ఔటయ్యాడు. భరత్తో కలిసి రహానే మరో వికెట్ పడకుండా రోజును ముగించాడు. ఇక ఈ మ్యాచ్లో రహానేపైనే భారత్ ఆశలు పెట్టుకుంది. అతడు లోయర్ ఆర్డర్తో కలిసి ఆసీస్ ఆధిక్యాన్ని ఏ మేరకు తగ్గిస్తాడనేది కీలకంగా మారింది.
ఆస్ట్రేలియా తొలి ఇన్నింగ్స్: 469 (హెడ్ 163, స్మిత్ 121; సిరాజ్ 4/108, శార్దూల్ 2/83), భారత్ తొలి ఇన్నింగ్స్: 151/5 (జడేజా 48, రహానే 29 బ్యాటింగ్; లియాన్ 1/4, గ్రీన్ 1/22).