భారత కుస్తీ రంగంలో మళ్లీ కల్లోలం! తాము ఎవరిపైనైతే పోరాటం చేశామో..తిరిగి వాళ్లే పగ్గాలు అందుకున్న వేళ కుస్తీవీరులు పోరు బాట పట్టారు. జాతీయ రెజ్లింగ్ అసోసియేషన్ అధ్యక్షుడిగా బ్రిజ్భూషణ్ శరణ్సింగ్ సన్నిహితుడు సంజయ్సింగ్ ఎన్నికను వ్యతిరేకిస్తూ ఇప్పటికే సాక్షి మాలిక్ తన కెరీర్కు వీడ్కోలు పలుకగా, తాజాగా దిగ్గజ రెజ్లర్ బజరంగ్ పునియా..పద్మశ్రీ అవార్డును వాపస్ ఇస్తున్నట్టు ప్రకటించి సంచలనం రేపాడు. దేశంలో మహిళా రెజ్లర్లకు జరుగుతున్న అన్యాయాన్ని నిరసిస్తూ ప్రధాని నరేంద్ర మోదీకి సుదీర్ఘ లేఖ రాశాడు.
భారత కుస్తీ రంగంలో మరో కుదుపు. జాతీయ రెజ్లింగ్ అసోసియేషన్ (డబ్ల్యూఎఫ్ఐ)అధ్యక్ష ఎన్నిక వివాదం చిలికి చిలికి మరింత వివాదంగా మారుతున్నది. మాజీ అధ్యక్షుడు బ్రిజ్భూషణ్ శరణ్సింగ్ సన్నిహితుడు సంజయ్సింగ్ ఎన్నికపై రెజ్లర్లు సంచలన నిర్ణయాలతో కదంతొక్కుతున్నారు. విశ్వక్రీడల్లో దేశానికి పతకం అందించిన ఏకైక మహిళా రెజ్లర్గా నిలిచిన సాక్షి మాలిక్ ఇప్పటికే ఆటకు వీడ్కోలు పలుకగా, తాజాగా దిగ్గజ రెజ్లర్ బజరంగ్ పునియా పద్మశ్రీ అవార్డు వాపస్ ఇస్తున్నట్లు ప్రకటించాడు. మహిళా రెజ్లర్లకు జరుగుతున్న అన్యాయంపై ప్రధాని నరేంద్రమోదీకి పునియా సుదీర్ఘ లేఖ రాశాడు. మహిళా రెజ్లర్లకు అన్యాయం జరుగుతున్నప్పుడు ఈ అవార్డు ఎందుకంటూ సూటిగా ప్రశ్నించాడు. మొత్తంగా రెజ్లింగ్ ఎన్నిక వివాదం ఎటు వైపునకు దారితీస్తుందన్నది ఆసక్తికరంగా మారిది.
న్యూఢిల్లీ: జాతీయ రెజ్లింగ్ సమాఖ్య(బీడబ్ల్యూఎఫ్) ఎన్నికల అంశం మరోమారు వార్తల్లో ప్రముఖంగా నిలుస్తున్నది. బ్రిజ్భూషణ్ శరణ్సింగ్ సన్నిహితుడుగా ముద్రపడ్డ సంజయ్సింగ్ ఎన్నికను దిగ్గజ రెజ్లర్లు బజరంగ్ పునియా, సాక్షి మాలిక్, వినేశ్ ఫోగట్ తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. ఆయన ఎన్నికకు నిరసనగా ఇప్పటికే సాక్షి మాలిక్ తన రెజ్లింగ్ కెరీర్కు అనూహ్యంగా వీడ్కోలు పలుకగా, తాజాగా బజరంగ్ పునియా పద్మశ్రీ అవార్డు వాపస్ ఇస్తున్నట్లు ప్రకటించి సంచలనం కల్గించాడు. గంటల వ్యవధిలో ఇద్దరు దిగ్గజ రెజ్లర్లు తమకు జరుగుతున్న అన్యాయాన్ని దేశం దృష్టికి తీసుకొచ్చారు. మహిళా రెజ్లర్లకు న్యాయం జరుగకపోవడాన్ని ప్రశ్నిస్తూ పునియా తనకు దక్కిన పద్మశ్రీ అవార్డును ప్రధాని నరేంద్రమోదీకి అందజేసేందుకు శుక్రవారం కర్తవ్యపథ్ వెళ్లేందుకు ప్రయత్నించగా పోలీసులు అడ్డుకున్నారు. దీంతో తన పద్మశ్రీ అవార్డును ప్రధాని నివాసం ముందు ఉంచేందుకు ప్రయత్నించగా, అధికారులు నిలువరించారు.
జాతీయ రెజ్లింగ్ సమాఖ్య(బీడబ్ల్యూఎఫ్) ఎన్నికలు పూర్తి ఏకపక్షంగా సాగాయి. కోర్టు తీర్పులు, పలు వాయిదాల తర్వాత ఈ నెల 21న జరిగిన ఎన్నికల్లో బ్రిజ్భూషణ్ వర్గం 15 స్థానాలకు 13 స్థానాలు దక్కించుకుని తమకు తిరుగులేదని నిరూపించుకుంది. ఇందులో యూపీకే చెందిన సంజయ్సింగ్ ఎన్నిక కావడం ఇన్ని రోజులు నిరసన చేసిన రెజ్లర్లను తీవ్ర మనస్థాపానికి గురిచేసింది. దేశ రాజధానిలో తాము ఇన్నాళ్లు చేసిన పోరాటానికి విలువలేకుండా పోయిందనుకున్న రెజ్లర్లు తమ కెరీర్లను వదులుకునేందుకు సిద్ధమయ్యారు. సాక్షి మాలిక్ బూట్లను బెంచ్పై పెడుతూ రెజ్లింగ్ నుంచి తప్పుకుంటున్నట్లు ప్రకటించింది అందరనీ ఆశ్చర్యపరిచింది. ఇప్పుడు ఇదే కోవలో బజరంగ్ పునియా అవార్డు వాపస్ ఇవ్వడంతో రెజ్లర్ల నిరసన మరోమారు తెరపైకి వచ్చింది.
సంజయ్సింగ్ ఎన్నికపై ప్రధాని మోదీకి రాసిన లేఖలో పునియా పలు అంశాలను ప్రస్తావించాడు. దీన్ని ఎక్స్లో పోస్ట్ చేశాడు. స్వయంగా లేఖను అందిద్దామనుకున్న పునియాకు నిరాశే ఎదురైన నేపథ్యంలో సోషల్మీడియా ద్వారా తన నిరసనను వ్యక్తపరిచాడు. ‘డియర్ మోదీ మీ ఆరోగ్యం బాగుందనుకుంటున్నా. మీరు చాలా పనుల్లో బిజీగా ఉండి ఉంటారు. దేశంలో మహిళా రెజ్లర్లు ఎదుర్కొంటున్న సమస్యలను మీ దృష్టికి తీసుకొస్తున్నా. మీరు కచ్చితంగా కొన్ని విషయాలు తెలుసుకోవాలి. బ్రిజ్భూషణ్ నుంచి మహిళా రెజ్లర్లు లైంగికంగా ఎదుర్కొంటున్న సమస్యలపై గత జనవరిలో మేము అందరం కలిసి నిరసనల్లో పాల్గొన్నాం.
నేను కూడా ఇందులో పాలుపంచుకున్నాను. కానీ ప్రభుత్వం ఇచ్చిన హామీతో మేము నిరసన విరమించాం. ఆ తర్వాత బ్రిజ్భూషణ్పై మూడు నెలల కాలంలో ఎలాంటి ఎఫ్ఐఆర్ నమోదు కాలేదు. దీంతో మేము మళ్లీ పోరుబాట పట్టాల్సి వచ్చింది. ఏప్రిల్లో మేము ధర్నాకు దిగడంతో పోలీసులు అతనిపై ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. జనవరిలో అతనిపై 19 ఫిర్యాదులు వస్తే..ఏప్రిల్ వరకు అవి 7కు పడిపోయాయి. అంటే 12 మంది రెజ్లర్లను బ్రిజ్భూషణ్ ఏ రకంగా బెదిరింపులు గురి చేశాడో మీరు అర్థం చేసుకోవచ్చు. 40 రోజుల పాటు ఢిల్లీ నడిబొడ్డున మేము నిరసన చేశాం. ధర్నా చేసినన్ని రోజులు చాలా రకాల ఒత్తిళ్లకు గురయ్యాం.
మేము నిరసన చేస్తున్న స్థలం నుంచి మమ్మల్ని బలవంతంగా పోలీసులు ఈడ్చుకెళ్లారు. అప్పుడు ఏం చేయాలో అర్థం కాని పరిస్థితుల్లో మేము సాధించిన పతకాలను మే 19న హరిద్వార్లోని గంగా నదిలో కలిపేయాలనుకున్నాం. కానీ రైతు సంఘాల నేతలు, కోచ్లు, పలువురి సూచనలతో మా నిర్ణయాన్ని ఉపసంహరించుకున్నాం. ఆ సమయంలో మీ క్యాబినెట్ మినిస్టర్ చర్చలకు పిలిచారు. మాకు న్యాయం జరగుతుందని హోం శాఖ మంత్రి కూడా హామీ ఇచ్చారు. అందువల్ల మేము నిరసన ఆపేస్తున్నట్లు ప్రకటించాం. కానీ మా డిమాండ్లను మీరు పట్టించుకోలేదు. ఫలితంగా మళ్లీ అదే వర్గానికి చెందిన వారే పగ్గాలు అందుకున్నారు. ఇప్పుడు ఏం చేయాలో తెలియని పరిస్థితుల్లో గత రాత్రంతా ఏడ్చుకుంటూ కూర్చుకున్నాం.
మీ ప్రభుత్వం ఇప్పటి వరకు చాలా ఇచ్చింది. 2019లో నన్ను పద్మశ్రీ అవార్డుతో సత్కరించింది. దీనికి తోడు అర్జున, ఖేల్త్న్ర అవార్డులు అందుకున్నాను. ఇవి అందుకున్నప్పుడు నేను ఎంతో గర్వపడ్డాను. ఇప్పుడు పరిస్థితులు పూర్తిగా మారిపోయాయి. క్రీడలతో మహిళల్లో సాధికారత పెరగడంతో పాటు వాళ్ల జీవితాల్లోనూ మార్పు వచ్చింది. ఇప్పుడున్న పరిస్థితుల్లో అమ్మాయిలు క్రీడల నుంచి దూరమయ్యే వాతావరణం నెలకొంది. బేటీ బచావో..బేటీ పడావోకు బ్రాండ్ అంబాసిడర్లుగా నిలిచేదేవరు. మహిళా రెజ్లర్లకు అన్యాయం జరుగుతున్న వేళ..పద్మశ్రీ అవార్డు గ్రహీతగా ఉండలేకపోతున్నాం. రెజ్లర్లను అవమానపరుస్తున్నందుకు ఈ అవార్డును వాపస్ ఇస్తున్నాను’ అని ప్రకటించాడు.