WPL 2024, DC vs RCB | రాహుల్ ద్రావిడ్, అనిల్ కుంబ్లే, డానియల్ వెటోరీ, ఏబీ డివిలియర్స్, విరాట్ కోహ్లీ, ఫాఫ్ డుప్లెసిస్.. ఆధునిక క్రికెట్లో వీళ్లందరూ దిగ్గజ క్రికెటర్లే. ఈ అందరికీ సారూప్యత కూడా ఉంది. ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) లో వీళ్లంతా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ)కి ప్రాతినిథ్యం వహించడంతో పాటు సారథిగా కూడా చేసినవాళ్లే. ఐపీఎల్ ప్రారంభమైనప్పటినుంచీ ఈ లీగ్లో ఉన్న ఆర్సీబీ.. పదహారేండ్లుగా ట్రోఫీ కోసం పడరాని పాట్లు పడుతోంది. పలుమార్లు ఫైనల్ చేరినా ఆ జట్టు మాత్రం ఇంతవరకూ కప్పును ముద్దాడలేదు. మరి పురుషుల వల్ల కానిది మహిళల టీమ్ వల్ల అవుతుందా..? స్మృతి మంధాన సారథ్యంలోని ఆర్సీబీ.. ఆ జట్టు తలరాతను మారుస్తుందా..?
ఆ ముగ్గురూ ఫెయిల్..
ఐపీఎల్లో అత్యంత జనాధరణ కలిగిన జట్టుగా ఉన్న ఆర్సీబీ ఇప్పటివరకు మూడుసార్లు ఫైనల్ చేరింది. గతంలో అనిల్ కుంబ్లే (2009లో), డానియల్ వెటోరీ (2011లో), విరాట్ కోహ్లీ (2016లో)లు ఫైనల్కు చేర్చారు. కానీ తుది మెట్టుపై ఆర్సీబీ తడబడింది. 2009లో నాటి డెక్కన్ ఛార్జర్స్.. హైదరాబాద్పై ఆరుపరుగుల తేడాతోనే ఓడిపోయింది. 2011లో చెన్నై చేతిలో 58 పరుగుల తేడాతో ట్రోఫీని కోల్పోవాల్సి వచ్చింది. 2016లో విరాట్ కోహ్లీ కెప్టెన్గా ఉండగా.. డేవిడ్ వార్నర్ సారథ్యంలోని సన్ రైజర్స్ హైదరాబాద్.. 8 పరుగుల తేడాతో ట్రోఫీని ఎగురేసుకుపోవడంతో ఆ జట్టుకు మరోసారి నిరాశతప్పలేదు. ఆ తర్వాత ఆర్సీబీ.. మరోసారి ఫైనల్లో తమ అదృష్టాన్ని పరీక్షించుకోనుంది. ఉమెన్స్ ప్రీమియర్ లీగ్ (డబ్ల్యూపీఎల్)లో ఆర్సీబీ ఫైనల్కు చేరడం ఇదే ప్రథమం.
మళ్లీ ‘డీసీ’నే..
ఆర్సీబీ తొలిసారి ఐపీఎల్ ఫైనల్ (2009)లో ఓడినప్పుడు అప్పుడు ఓడించిన జట్టు డీసీ (డెక్కన్ ఛార్జర్స్). ఇప్పుడు ఆ జట్టు మళ్లీ డీసీతోనే పోరాడాల్సి ఉంది. కానీ ఇప్పుడు డీసీ అంటే ఢిల్లీ క్యాపిటల్స్. ఈ సెంటిమెంట్ వర్కవుట్ అయితే ఆర్సీబీకి కప్పు గోవిందా.. అని బెంగళూరు అభిమానులు ఆందోళన చెందుతున్నారు.
మంధాన అండ్ కో. ఏం చేసేనో..?
డబ్ల్యూపీఎల్ రెండో సీజన్లో ఆర్సీబీ.. పడుతూ లేస్తూ ఫైనల్కు చేరింది. లీగ్ దశలో 8 మ్యాచ్లు ఆడిన ఆ జట్టు.. నాలుగింట్లో గెలిచి నాలుగు ఓడింది. కీలకమైన ఎలిమినేటర్ పోరులో బ్యాటింగ్లో తక్కువ స్కోరే చేసినా బౌలింగ్లో మాత్రం అద్భుతంగా రాణించి ఫైనల్కు అడుగుపెట్టింది. ఆ జట్టు ఆల్రౌండర్ ఎల్లీస్ పెర్రీపై అతిగా ఆశపడుతోంది. బ్యాటింగ్లో మంధాన, డెవిన్, పెర్రీ, రిచా ఘోష్, జార్జియా వర్హెమ్లు ఆ జట్టుకు కీలకం. బౌలింగ్లో రేణుకా ఠాకూర్, శ్రేయాంక పాటిల్, సోఫీ మొలినెక్స్ తో పాటు ఆశా శోభనలు ఢిల్లీని కట్టడిచేయగలిగితే ఆ జట్టు తొలి ట్రోఫీని ముద్దాడటం పెద్ద కష్టమేమీ కాదు. మరి బెంగళూరు బాబులు సాధించలేని ట్రోఫీని భామలు దక్కించుకుంటారో లేదో చూడాలంటే మరికొన్ని గంటలు వేచి చూడాల్సిందే..!