WPL 2023 : మహిళా క్రికెట్లో సరికొత్త అధ్యాయానికి నాంది పలికిన మహిళా ప్రీమియర్ లీగ్ (డబ్ల్యూపీఎల్)పై సర్వత్రా ఆసక్తి నెలకొన్న విషయం తెలిసిందే. యావత్ ప్రపంచం దృష్టిని ఆకర్షించిన ఈ మెగా టోర్నమెంట్ రేపటితో ప్రారంభం కానుంది. ముంబైలోని డీవై పాటిల్ స్టేడియంలో శనివారం సాయంత్రం అట్టహాసంగా ఆరంభ వేడుకల్ని బీసీసీఐ నిర్వహించనుంది. ఈ వేడుకల్లో బాలీవుడ్ స్టార్స్ స్పెషల్ అట్రాక్షన్ కానున్నారు.
కియరా అడ్వానీ, కృతి సనన్ వంటి హీరోయిన్లు డాన్స్లతో అలరించనున్నారు. పంజాబీ – కెనడా ర్యాపర్ ఏపీ ధిల్లాన్ కూడా ప్రదర్శన ఇవ్వనున్నాడు. తొలి మ్యాచ్లో గుజరాత్ జెయింట్స్, ముంబై ఇండియన్స్ జట్లు తలపడనున్నాయి. డబ్ల్యూపీఎల్ టైటిల్ స్పాన్సర్ హక్కులను ఐదేళ్ల కాలానికి టాటా గ్రూప్, మీడియా హక్కులను వైకోమ్ 18 సంస్థ దక్కించుకున్న విషయం తెలిసిందే.
బీసీసీఐ తొలిసారి నిర్వహిస్తున్న డబ్ల్యూపీఎల్లో మొత్తం ఐదు ఫ్రాంఛైజీలు పాల్గొంటున్నాయి. ఇప్పటికే ఆయా జట్లు తమ టీమ్ కెప్టెన్, వైస్ కెప్టెన్ పేర్లను ప్రకటించాయి. జెర్సీలను విడుదల చేశాయి. ముంబై ఇండియన్స్కు హర్మన్ప్రీత్ కౌర్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుకు స్మృతి మంధాన కెప్టెన్గా ఎంపికయ్యారు. ఆస్ట్రేలియాకు నాలుగో టీ20 వరల్డ్ కప్ అందించిన మేగ్ లానింగ్కు ఢిల్లీ క్యాపిటల్స్ కెప్టెన్సీ అప్పగించింది. యూపీ వారియర్స్ కెప్టెన్గా అలీసా హేలీ (ఆస్ట్రేలియా) ఎంపికైంది. ఆసీస్ వికెట్ కీపర్ బేత్ మూనీ గుజరాత్ జెయింట్స్ను నడిపించనుంది. 22 మ్యాచ్లు నిర్వహించనున్నారు. మార్చి 26న ఫైనల్ ఫైట్ జరగనుంది.
1. ముంబై ఇండియన్స్ – హర్మన్ప్రీత్ కౌర్ (కెప్టెన్) – చార్లొట్టె ఎడ్వర్డ్స్ ( హెడ్ కోచ్)
2. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు – స్మృతి మంధాన (కెప్టెన్) – బెన్ సాయెర్ (హెడ్ కోచ్)
3. ఢిల్లీ క్యాపిటల్స్ – మేగ్ లానింగ్ (కెప్టెన్), జొనాథన్ బ్యాటీ (హెడ్ కోచ్)
4. యూపీ వారియర్స్ – అలీసా హేలీ (కెప్టెన్) – జోన్ లెవిస్ (హెడ్ కోచ్)
5. గుజరాత్ జెయింట్స్ – బేత్ మూనీ (కెప్టెన్) – రాచెల్ హేనెస్ (హెడ్ కోచ్)
మహిళల ప్రీమియర్ లీగ్ తొలి సీజన్ వేలంలో భారత స్టార్ ఓపెనర్ స్మృతి మంధాన జాక్పాట్ కొట్టేసింది. వేలంలో రికార్డు ధర పలికింది. రూ.3.44 కోట్లకు ఆర్సీబీ ఆమెను కొనుగోలు చేసింది. దీప్తి శర్మను రూ. 2.6 కోట్లకు యూపీ వారియర్స్ దక్కించుకుంది. జేమీమా రోడ్రిగ్స్ (రూ.2.2 కోట్లు), షఫాలీ వర్మ (రూ.2 కోట్లు)లను ఢిల్లీ భారీ ధరకు కొన్నది. భారత మహిళల జట్టు కెప్టెన్ హర్మన్ప్రీత్ కౌర్ను రూ.1.8 కోట్లకు ముంబై ఇండియన్స్ కొనుగోలు చేసింది.