World Cup | ఐసీసీ వన్డే ప్రపంచకప్కు సమయం దగ్గరపడుతున్నది. భారత్ వేదిక జరిగే మెగా టోర్నీకి వచ్చేందుకు జట్లన్నీ సిద్ధమవుతున్నాయి. అయితే, పాక్ జట్టు మాత్రం ఆందోళనకు గురవుతున్నది. కారణం ఏంటంటే ఇప్పటి వరకు దాయాది జట్టుకు భారత్కు వచ్చేందుకు వీసాలు అందలేదు. దీనిపై ఆందోళన వ్యక్తం చేస్తూ ఐసీసీకి లేఖ రాసింది. వీసాల కోసం నిరీక్షణతో ప్రపంచకప్ సన్నాహాలను గణనీయంగా ప్రభావితం చేసిందని పీసీబీ పేర్కొంది. వాస్తవానికి పాక్ జట్టు సెప్టెంబర్ 29న హైదరాబాద్ రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ స్టేడియంలో న్యూజిలాండ్తో ప్రాక్టీస్ మ్యాచ్ ఆడాల్సి ఉంది. ప్రపంచకప్లో నెదర్లాండ్స్తో అక్టోబర్ 6న తొలి మ్యాచ్ను ఆడనున్నది. వీసాలు ఆలస్యం అవుతుండడంతో పీసీబీ ఐసీసీకి లేఖ రాసింది.
జట్టు హైదరాబాద్కు చేరుకునే ముందే పాక్ దుబాయిలో రెండు రోజుల టీమ్ బాండింగ్ షెషన్ను నిర్వహించాల్సి ఉందని, వీసాలపై నెలకొన్న అనిశ్చిత కారణంగా దాన్ని రద్దు చేసుకున్నట్లు పేర్కొంది. ప్రపంచకప్కు ముందు జట్టు రెండు ప్రాక్టీస్ మ్యాచులు ఆడాల్సి ఉంది. ఇందులో ఒకటి 29న న్యూజిలాండ్తో కాగా.. అక్టోబర్ 3న ఆస్ట్రేలియాతో ఆడాల్సి ఉంది. ఈ మేరకు ఐసీసీ సీఈవో జియోఫ్ అల్లార్డిస్కు రాసిన లేఖలో పాక్తో ఇలా అసమానంగా వ్యవహరించడం ఆమోదయోగ్యం కాదని పేర్కొంది. పాక్ చివరిసారిగా 2016లో టీ20 వరల్డ్ కప్ కప్ కోసం భారత్కు వచ్చింది. ఇరుదేశాల మధ్య నెలకొన్న సంబంధాలు దెబ్బతిన్నాయి. అయితే, పాక్ ఆటగాళ్ల వీసాలపై కేంద్ర హోం ఆమోదం తెలుపలేదని తెలుస్తున్నది.
మరో వైపు దాదాపు 35 మంది సభ్యుల పాక్ జట్టు విమాన టికెట్లను మళ్లీ బుక్ చేసుకుందని పీసీబీ వర్గాలు పేర్కొన్నాయి. లాహోర్ నుంచి సెప్టెంబర్ 27న ఉదయం దుబాయికి బయలుదేరి అక్కడి నుంచి రాత్రికి హైదరాబాద్ చేరుకునే అవకాశం తెలుస్తున్నది. పాక్ టీమ్ వీసాలకు హోం మంత్రిత్వశాఖతో పాటు విదేశాంగ శాఖ, క్రీడల మంత్రిత్వ శాఖల క్లియరెన్స్ అవసరం ఉన్నది. షెడ్యూల్ ప్రకారం ప్రాక్టీస్ మ్యాచ్ ముగిసిన తర్వాత పాక్ జట్టు వరుసగా అక్టోబర్ 6, 10 తేదీల్లో నెదర్లాండ్స్, శ్రీలంకతో ఆడాల్సి ఉన్నది. 14న భారత్తో అహ్మదాబాద్ వేదికగా తలపడనున్నది. ప్రస్తుత పాక్ జట్టులో మహ్మద్ నవాజ్, సల్మాన్ అగా మాత్రమే గతంలో భారత్లో పర్యటించారు.