CWC | క్రీడాభిమానులంతా కండ్లు కాయలు కాచేలా వేచి చూస్తున్న వన్డే విశ్వ సమరానికి రంగం సిద్ధమైంది. నేటి నుంచి నెలన్నర రోజుల పాటు ఫ్యాన్స్ను సిక్సర్ల సునామీ, వికెట్ల జడివానలో ముంచెత్తేందుకు అన్నీ జట్లు అస్త్రశస్ర్తాలతో సన్నద్ధమయ్యాయి. తొలిసారి భారత్ ఒంటరిగా ఆతిథ్యమిస్తున్న మెగాటోర్నీకి నేడు అహ్మదాబాద్లో తెరలేవనుంది. గత వరల్డ్కప్ ఫైనలిస్టులు న్యూజిలాండ్, ఇంగ్లండ్ మధ్య ఆరంభ పోరు కోసం ప్రపంచంలోనే అతిపెద్ద క్రికెట్ స్టేడియం సర్వాంగ సుందరంగా ముస్తాబైంది.
క్రికెట్ను మతంగా భావించే మన దేశంలో వన్డే వరల్డ్కప్ జరుగుతుండటంతో.. భారత్పై భారీ అంచనాలు నెలకొనగా.. 10 జట్లు.. 10 వేదికలు.. 45 రోజులు.. 48 మ్యాచ్లు.. 6 డబుల్ హెడర్స్తో ప్రపంచకప్ అగ్గి రాజేస్తున్నది. పసలేని మ్యాచ్లకు, బోరింగ్ సమరాలకు స్వస్తి పలుకుతూ..ఐసీసీ ర్యాంకింగ్స్ అగ్రస్థానంలో ఉన్న ఎనిమిది జట్లను మెగాటోర్నీకి నేరుగా ఎంపిక చేయగా.. శ్రీలంక, నెదర్లాండ్స్ క్వాలిఫయింగ్ టోర్నీలో సత్తాచాటి ముందంజ వేశాయి.మరింకెందుకు ఆలస్యం.. వన్డే మజాను ఆస్వాదించేందుకు మీరూ సిద్ధమైపోండి!
అహ్మదాబాద్: నాలుగేండ్లకోసారి నిర్వహించే ఐసీసీ ప్రతిష్ఠాత్మక వన్డే ప్రపంచకప్నకు వేళైంది. సాధారణంగా వేసవిలో జరిగే ఈ టోర్నీ ఈసారి శీతాకాలంలో వేడి పుట్టించేందుకు సిద్ధమైంది. టీ20ల ప్రభావంతో వన్డేలకు కాలం చెల్లిపోయిందనే వాదనలు పెరుగుతున్న నేపథ్యంలో ఈ మెగాటోర్నీపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇప్పటికే మూడుసార్లు (1987, 1996, 2011) సహచర దేశాలతో కలిసి వరల్డ్కప్నకు ఆతిథ్యమిచ్చిన భారత్ ఈ సారి ఒంటరిగా మెగాటోర్నీ నిర్వహిస్తున్నది. ఆతిథ్య భారత్తో పాటు, అఫ్గానిస్థాన్, ఆస్ట్రేలియా, బంగ్లాదేశ్, ఇంగ్లండ్, నెదర్లాండ్స్, న్యూజిలాండ్, పాకిస్థాన్, దక్షిణాఫ్రికా, శ్రీలంక జట్లు ప్రపంచకప్లో తమ అదృష్టాన్ని పరీక్షించుకోనున్నాయి. ఇందులో గతంలో ఐదు జట్లు (ఆస్ట్రేలియా 5 సార్లు, భారత్ రెండుసార్లు, ఇంగ్లండ్, పాకిస్థాన్, శ్రీలంక ఒక్కోసారి) ట్రోఫీని ముద్దాడగా.. మిగిలిన ఐదు జట్లు ఇప్పటి వరకు ప్రపంచ చాంపియన్ హోదా దక్కించుకోలేకపోయాయి. మెగాటోర్నీకి ముందు ఆరంభ వేడుకలు నిర్వహించకూడదని ఐసీసీ నిర్ణయించగా.. బుధవారమే వరల్డ్కప్ సారథులతో ‘కెప్టెన్స్ మీట్’ జరిగింది. రౌండ్ రాబిన్ లీగ్ విధానంలో జరుగనున్న ఈ టోర్నీలో లీగ్ దశలో మెరుగైన ప్రదర్శన చేసిన నాలుగు జట్లు సెమీఫైనల్కు చేరనున్నాయి. మెగాటోర్నీలో ఆదివారం చెన్నైలో ఆస్ట్రేలియాతో టీమ్ఇండియా తమ తొలి మ్యాచ్ ఆడనుంది. 2011లో స్వదేశంలో జరిగిన వన్డే ప్రపంచకప్లో విజేతలుగా నిలిచిన టీమ్ నుంచి ప్రస్తుత భారత జట్టులో కోహ్లీ, అశ్విన్ మాత్రమే ఉండగా.. గత వరల్డ్కప్లో ఐదు శతకాలతో అదరగొట్టిన రోహిత్ శర్మ మరోసారి సేమ్ సీన్ రిపీట్ చేసేందుకు రెడీ అవుతున్నాడు.
తీవ్ర ఉత్కంఠ మధ్య సాగిన 2019 వన్డే ప్రపంచకప్ ఫైనల్లో న్యూజిలాండ్పై బౌండ్రీల లెక్క ఆధారంగా విజయం సాధించి తొలిసారి ప్రపంచకప్ను ముద్దాడిన డిఫెండింగ్ చాంపియన్ ఇంగ్లండ్.. ఈ సారి తొలి మ్యాచ్లో కివీస్నే ఎదుర్కోనుంది. ఇరు జట్ల మధ్య అప్పటి నుంచి ఇప్పటి వరకు కేవలం మూడు వన్డేలు మాత్రమే జరగగా.. ఆ పరాజయానికి బదులు తీర్చుకోవాలని న్యూజిలాండ్ బలంగా కోరుకుంటున్నది. అయితే ఇరు జట్లను గాయాల బెడద వెంటాడుతున్నది. గత ఎడిషన్లో వీరోచితంగా పోరాడి జట్టుకు వన్డే ప్రపంచకప్ అందించిన స్టార్ ఆల్రౌండర్ బెన్ స్టోక్స్ తొలి పోరులో ఆడటం అనుమానమే అని ఇంగ్లండ్ కెప్టెన్ జోస్ బట్లర్ పేర్కొనగా.. కివీస్ రెగ్యులర్ కెప్టెన్ కేన్ విలియమ్సన్ ఈ మ్యాచ్కు అందుబాటులో లేకుండా పోయాడు. సంప్రదాయ ఆటతీరుకు టాటా చెప్పి దంచికొట్టడమే పరమావధిగా చెలరేగిపోతున్న ఇంగ్లండ్ అదే జోష్ కొనసాగించాలని చూస్తుంటే.. ప్రాక్టీస్ మ్యాచ్ల్లో అదరగొట్టిన న్యూజిలాండ్ తమకు అలవాటైన రీతిలో సైలెంట్గా పని ముగించాలని భావిస్తున్నది. పిచ్ అటు బౌలర్లకు, ఇటు బ్యాటర్లకు సమానంగా సహకరించనుండగా.. మ్యాచ్కు వర్షం ముప్పు లేదు. స్టోక్స్ లేకపోయినా ఇంగ్లండ్ జట్టులో హిట్టర్లకు కొదవేలేదు. బెయిర్స్టో, మలన్, రూట్, బ్రూక్, బట్లర్, లివింగ్స్టోన్, సామ్ కరన్, క్రిస్ వోక్స్ ఇలా ఒకటి నుంచి ఎనిమిదో స్థానం వరకు ప్రతి ఒక్కరు విధ్వంసక వీరులే కాగా.. బౌలింగ్లో మార్క్వుడ్, ఆదిల్ రషీద్పై భారీ అంచనాలు ఉన్నాయి. ఇక న్యూజిలాండ్ విషయానికి వస్తే కేన్ మామ గైర్హాజరీలో జట్టుకు వికెట్ కీపర్ టామ్ లాథమ్ సారథ్యం వహించనుండగా.. యాంగ్, కాన్వే, డారిల్ మిషెల్, గ్లెన్ ఫిలిప్స్, నీషమ్ బ్యాటింగ్ భారం మోయనున్నారు. ప్రధాన పేసర్ ట్రెంట్ బౌల్ట్తో పాటు ఫెర్గూసన్, సోధి, శాంట్నర్తో ప్రత్యర్థులకు ముప్పు తప్పకపోవచ్చు. కాన్వేపై టీమ్ మేనేజ్మెంట్ ఆశలు పెట్టుకోగా.. ఈ యువ ఆటగాడు ఎలాంటి ప్రదర్శన చేస్తాడనేది ఆసక్తికరం.
ఈ తరం దిగ్గజాలుగా గుర్తింపు తెచ్చుకున్న పలువురు స్టార్ క్రికెటర్లకు దాదాపు ఇదే చివరి వన్డే వరల్డ్కప్ కానుంది. టీమ్ఇండియా నుంచి రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ.. ఆసీస్ నుంచి స్టీవ్ స్మిత్, డేవిడ్ వార్నర్.. ఇంగ్లండ్ నుంచి జో రూట్, జోస్ బట్లర్.. న్యూజిలాండ్ నుంచి కేన్ విలియమ్సన్, టిమ్ సౌథీ.. దక్షిణాఫ్రికా నుంచి డేవిడ్ మిల్లర్, క్వింటన్ డికాక్.. బంగ్లాదేశ్ నుంచి షకీబ్ అల్ హసన్, ముష్ఫికర్ రహీమ్ మరో నాలుగేండ్ల తర్వాత జరిగే మెగాటోర్నీలో బరిలోకి దిగడం దాదాపు అసాధ్యమే. ఇదే చివరి మెగాటోర్నీ కావడంతో ఎలాగైనా సత్తాచాటి విశ్వ విజేతలుగా నిలువాలని వీళ్లంతా కృతనిశ్చయంతో ఉన్నారు.
1 భారత్ ఒంటరిగా వన్డే వరల్డ్కప్నకు ఆతిథ్యమివ్వడం ఇదే తొలిసారి. 1987లో భారత్, పాకిస్థాన్ ఉమ్మడిగా వరల్డ్కప్ నిర్వహించగా.. 1996లో ఈ జాబితాలో శ్రీలంక కూడా చేరింది. ఇక 2011లో భారత్, శ్రీలంక, బంగ్లాదేశ్ సంయుక్తంగా ప్రపంచకప్నకు ఆతిథ్యమిచ్చాయి.
13 వన్డే ప్రపంచకప్ చరిత్రలో ఇది 13వ మెగాటోర్నీ.