Women’s Premier League : మహిళల ప్రీమియర్ లీగ్ వేలంలో పాల్గొంటున్న క్రికెటర్ల తుది జాబితాను బీసీసీఐ మంగళవారం విడుదల చేసింది. వేలంలో నిలిచిన 409 మంది పేర్లను వెల్లడించింది.వీళ్లలో భారతీయ క్రికెటర్లు 246 మంది, విదేశీ క్రికెటర్లు 163 మంది ఉన్నారు. జాతీయ జట్టుకు ఆడినవాళ్లు 202 మంది, ఆరంగ్రేటం చేయనవాళ్లు 199 మంది, సంయుక్త దేశాలకు చెందిన 8 మంది ఈ వేలానికి ఎంపికయ్యారు. ఫిబ్రవరి 13న మధ్యాహ్నం 2ః30 గంటలకు వేలం జరగనుంది. మొత్తం 90 స్లాట్స్ అందుబాటులో ఉన్నాయి. వీటిలో 30 స్లాట్స్ను విదేశీ క్రికెటర్లకు కేటాయించారు. బీసీసీఐ మొదటిసారిగా నిర్వహిస్తున్న టోర్నీ కావడంతో 1,525 మంది ప్లేయర్స్ వేలంలో పేర్లు నమోదు చేసుకున్నారు. అయితే.. చివరకు 409 మంది షార్ట్ లిస్ట్ అయ్యారు.
వేలంలో పాల్గొంటున్న వాళ్లలో 24 మంది రూ. 50 లక్షల కనీస ధరకు ఎంపికయ్యారు. 30 మంది ప్లేయర్స్ రూ.40 లక్షల బేస్ ప్రైజ్కు పేర్లు రిజిష్టర్ చేసుకున్నారు. రూ. 50 లక్షల జాబితాలో హర్మన్ప్రీత్ కౌర్, స్మృతి మంధానా, దీప్తి శర్మ, షఫాలీ వర్మ వంటి భారత క్రికెటర్లు ఉన్నారు. 13 మంది విదేశీ క్రికెటర్లు కూడా రూ.50 లక్షలకు తమ పేరు రిజిష్టర్ చేసుకున్నారు. వాళ్లు ఎవరంటే.. ఎల్లిసే పెర్రీ(ఆస్ట్రేలియా) , సోఫీ ఎక్లెస్టోన్ (ఇంగ్లండ్), సోఫీ డెవినె (న్యూజిలాండ్), డియాండ్ర డొటిన్ (వెస్టిండీస్).
క్రికెట్ అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న మహిళల ప్రీమియర్ లీగ్ ముంబై వేదికగా మర్చి 4న మొదలు కానుంది. ఈ టోర్నీలో మొత్తం ఐదు ఫ్రాంఛైజీలు పాల్గొంటున్నాయి. ఈ జట్లు 22 మ్యాచ్లు ఆడతాయి. మార్చి 22న ఫైనల్ మ్యాచ్ జరగనుంది.