ముంబై: మహిళల ఐపీఎల్(Women’s IPL) టోర్నీకి రంగం సిద్ధమవుతోంది. అయిదు జట్లతో తొలి ఎడిషన్ టోర్నీని వచ్చే ఏడాది మార్చిలో నిర్వహించనున్నట్లు బీసీసీఐ వర్గాల ద్వారా తెలుస్తోంది. టోర్నీలో మొత్తం 20 లీగ్ గేమ్స్ ఉంటాయి. ఒక్కొక్క జట్టు రెండు సార్లు పరస్పరం ఆడుతాయి. టేబుల్లో టాప్ ఉన్న జట్టు నేరుగా ఫైనల్కు వెళ్తుంది. ఇక రెండు, మూడవ స్థానంలో ఉన్న జట్ల మధ్య ఎలిమినేటర్ మ్యాచ్ జరుగుతుంది. ప్రతి జట్టులో అయిదు మంది విదేశీ క్రికెటర్లకు అనుమతి ఇస్తారు.
ఆస్ట్రేలియాలో జరిగే బిగ్ బాష్ మహిళల లీగ్, యూకేలో జరిగే మహిళల లీగ్ల్లో జట్టుకు కేవలం ముగ్గురు విదేశీ ప్లేయర్లను మాత్రమే అనుమతిస్తారు. ఇక ఆ టోర్నీల్లో ఒక్కొక్క జట్టు బృందంలో 15 మంది ఉంటారు. ఐపీఎల్లో మాత్రం 18 మంది ఒక్కొక్క జట్టులో ఉండనున్నట్లు తెలుస్తోంది.
వచ్చే ఏడాది ఫిబ్రవరిలో 9 నుంచి 16 మధ్య దక్షిణాఫ్రికాలో జరగనున్న టీ20 వరల్డ్కప్ తర్వాత ఐపీఎల్ టోర్నీ నిర్వహించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. తొలి ఎడిషన్లో ఒక వేదికపై 10 మ్యాచ్లు, మరో వేదికపై 10 మ్యాచ్లు నిర్వహించనున్నారు.