దుబాయ్: టీ20 వరల్డ్కప్లో దాయాది పాకిస్థాన్ చేతిలో టీమిండియాకు షాకింగ్ ఓటమిని అభిమానులు జీర్ణించుకోలేకపోతున్నారు. బ్యాటింగ్ వైఫల్యం.. అందులోనూ స్టార్ ఓపెనర్లు ఇద్దరూ విఫలమవడం కొంప ముంచింది. రోహిత్ శర్మ అయితే తొలి బంతికే డకౌటయ్యాడు. ఈ నేపథ్యంలో మ్యాచ్ తర్వాత ప్రెస్ కాన్ఫరెన్స్లో కెప్టెన్ కోహ్లిని ఓ జర్నలిస్ట్ ఇబ్బందికరమైన ప్రశ్న అడిగాడు. తర్వాతి మ్యాచ్లో రోహిత్ను పక్కన పెట్టి.. ఇషాన్ కిషన్ను తీసుకుంటారా అని సదరు జర్నలిస్ట్ అడిగాడు.
దీనికి కోహ్లి నవ్వుతూ సమాధానమిచ్చాడు. నాకు బెస్ట్ అనిపించిన టీమ్ను ఆడించాను. మీ అభిప్రాయం ఏంటి? రోహిత్ శర్మను మీరు ఓ టీ20 ఇంటర్నేషనల్ మ్యాచ్ నుంచి తప్పిస్తారా? నమ్మశక్యం కాదు. మీకు వివాదం కావాలంటే, దయచేసి ముందే చెప్పండి. అందుకు తగినట్లే నేను సమాధానమిస్తాను అని కోహ్లి అనడం విశేషం.