ఒకప్పుడు ప్రపంచ క్రికెట్ను గడగడలాడించిన వెస్టిండీస్.. ఇప్పుడు దానిలో కనీసం సగం సత్తా కూడా చూపించలేకపోతోంది. భారత్తో సిరీస్కు ముందు వన్డేల్లో మొత్తం 50 ఓవర్లపాటు బ్యాటింగ్ చేయడానికే కష్టపడిన ఆ జట్టు.. భారత్తో జరిగిన సిరీస్లో కొంత మెరుగైన ప్రదర్శన చేసింది. కానీ సిరీస్ను మాత్రం తమ ఖాతాలో వేసుకోలేకపోయింది. వన్డే సిరీస్ విజయం తర్వాత టీ20ల్లో కూడా సత్తాచాటిన యువభారత్.. నాలుగో టీ20 విజయంతో ఈ సిరీస్ కూడా సొంతం చేసుకుంది.
అన్ని ఫార్మాట్లలో కలిపి విండీస్పై భారత్కు ఇది వరుసగా 13వ సిరీస్ విజయం. ఇలా ఒక జట్టుపై వరుసపెట్టి సిరీస్లు గెలవడం మాటలు కాదు. వన్డే సిరీస్ గెలిచినప్పుడే ఒకే ప్రత్యర్థిపై అత్యధిక ద్వైపాక్షిక సిరీస్లు గెలిచిన జట్టుగా భారత్ రికార్డు సృష్టించిన సంగతి తెలిసిందే.