కొచ్చి: సరిగ్గా 8 ఏళ్ల కిందట 2013 ఐపీఎల్ సీజన్లో స్పాట్ ఫిక్సింగ్ ఆరోపణలు ఎంత దుమారం రేపాయో తెలుసు కదా. ఆ ఆరోపణలు ఓ టీమిండియా స్టార్ పేస్ బౌలర్ కెరీర్ను అర్ధంతరంగా ముగించాయి. అయితే ఇన్నాళ్లకు ఈ ఆరోపణలపై పబ్లిగ్గా నోరు విప్పాడు పేస్ బౌలర్ శ్రీశాంత్. కేవలం రూ.10 లక్షల కోసం నేను ఆ పని చేస్తానా అని శ్రీశాంత్ అనడం విశేషం. స్పోర్ట్స్కీడాతో మాట్లాడిన శ్రీ.. 2013లో జరిగిన విషయం గురించి వివరించాడు.
ఆ సమయంలో నేను ఇరానీ ట్రోఫీ ఆడాను. సౌతాఫ్రికా సిరీస్ కోసం సిద్ధమవుతున్నాను. సెప్టెంబర్ 2013లో ఆ సిరీస్కు వెళ్లాల్సి ఉంది. అందులో ఆడటమే అప్పుడు నా లక్ష్యంగా ఉంది. అలాంటి వ్యక్తినైన నేను ఇలాంటి పని చేస్తానా? అది కూడా కేవలం రూ.10 లక్షల కోసమా? నేనేమీ గొప్పలు చెప్పుకోవడం లేదు కానీ.. గట్టిగా పార్టీ చేస్తే రూ.2 లక్షలు ఖర్చు పెడతా అని శ్రీశాంత్ చెప్పడం గమనార్హం.
అలాంటి క్లిష్ట పరిస్థితుల నుంచి అభిమానులు, శ్రేయోభిలాషులే తనను బయటపడేశారని అతడు చెప్పాడు. నా జీవితంలో నేను సాయం చేశాను. ఇతరుల్లో నమ్మకాన్ని నింపాను. చాలా మందికి సాయం చేశాను. వాళ్ల ప్రార్థనలే నన్ను దీని నుంచి బయటపడేశాయి అని శ్రీశాంత్ అన్నాడు. అంతేకాదు ఆ ఫిక్సింగ్ గురించి కూడా అతడు వెల్లడించాడు.
అది 14 పరుగులు ఇవ్వాల్సిన ఓవర్. నేను నాలుగు బాల్స్ వేసి ఐదు పరుగులు ఇచ్చాను. నోబాల్ వేయలేదు, వైడ్ వేయలేదు. ఒక్క స్లో బాల్ కూడా వేయలేదు. నా బొటనవేలికి 12 సర్జరీలు అయిన తర్వాత కూడా 130 కిలోమీటర్లకుపైగా వేగంతో బౌలింగ్ చేశాను అని శ్రీశాంత్ చెప్పాడు. ఈ స్పాట్ ఫిక్సింగ్ ఆరోపణల్లో అతనికి క్లీన్చిట్ దక్కడంతో శ్రీశాంత్పై ఉన్న నిషేధం ఎత్తేశారు. దీంతో ఈ ఏడాది ముస్తాక్ అలీ టోర్నీతో అతడు మళ్లీ కాంపిటిటివ్ క్రికెట్లోకి వచ్చాడు.