Team India : ఈ ఏడాదిలో భారత జట్టు చివరి మ్యాచ్ ఆడేసింది. బంగ్లాదేశ్తో రెండో టెస్టులో అనూహ్య విజయం సాధించి 2022ను ఘనంగా ముగించింది. మరి టీమిండియా ఆటగాళ్లలో ఎక్కువ పరుగులు ఎవరు చేశారో తెలుసా.. శ్రేయాస్ అయ్యార్. విశేషం ఏంటంటే.. టెస్టు, వన్డే, టీ20 ఫార్మాట్లలో అతనే టాప్ స్కోరర్. 2022లో 40 ఇన్నింగ్స్ల్లో శ్రేయాస్ అత్యధికంగా 1,609 పరుగులు చేశాడు. మిస్టర్ 360గా ప్రశంసలు అందుకుంటున్న సూర్యకుమార్ యాదవ్ రెండో స్థానంలో ఉన్నాడు. ఈ ఏడాది టీ 20 వరల్డ్ కప్, న్యూజిలాండ్ సిరీస్లో అదరగొట్టిన సూర్య ఖాతాలో 1,424 రన్స్ ఉన్నాయి. వికెట్ కీపర్ రిషభ్ పంత్ 1,380 పరుగులతో మూడో స్థానంలో నిలిచాడు. టీ 20 వరల్డ్ కప్ ముందు ఫామ్ అందుకున్న స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ 1,348 రన్స్తో నాలుగో స్థానంలో కొనసాగుతున్నాడు. భారత జట్టు కెప్టెన్ రోహిత్ శర్మ మూడు ఫార్మట్లలో కలిపి కేవలం 995 పరుగులు చేశాడంతే.
టెస్టుల్లో… తనకు బాగా అచ్చొచ్చిన ఫార్మాట్లో రిషభ్ పంత్ అందరికంటే ఎక్కువ పరుగులు చేశాడు. 12 ఇన్నింగ్సులు ఆడిన పంత్ 61.81 సగటుతో 680 రన్స్ చేశాడు. వీటిలో రెండు సెంచరీలు, 4 ఆర్థ సెంచరీలు ఉన్నాయి. పేసర్ జస్పీత్ బుమ్రా 5 టెస్టు మ్యాచుల్లో 22 వికెట్లు తీశాడు. 5/24తో అతను అత్యుత్తమ గణాంకాలు నమోదు చేశాడు.
వన్డేలు... 17 వన్డేలు ఆడిన శ్రేయాస్ అయ్యర్ 55.69 సగటుతో 724 రన్స్ కొట్టాడు. ఈ ఏడాది 15 మ్యాచ్లు ఆడిన మహమ్మద్ సిరాజ్ 24 వికెట్లు పడగొట్టాడు.
టీ 20ల్లో.. సూర్యకుమార్ అత్యధిక పరుగుల వీరుడిగా నిలిచాడు. 31టీ20 మ్యాచుల్లో అతను 1,164 పరుగులతో అదరగొట్టాడు. రెండు సెంచరీలు, 9 హాఫ్ సెంచరీలు అతని ఖాతాలో ఉన్నాయి. 31 మ్యాచ్లు ఆడిన భువనేశ్వర్ 37 వికెట్లు నేలకుల్చాడు. 5/4 తో కెరీర్ బెస్ట్ ప్రదర్శన చేశాడు.
ఈ ఏడాది భారత జట్టు టీ20ల్లో వరల్డ్ కప్, ఆసియా కప్తో కలిపి 40 మ్యాచ్లు ఆడింది. వీటిలో 28 మ్యాచుల్లో విజయం సాధించింది. వెస్టిండీస్తో ఆడిన 8 మ్యాచుల్లో ఇండయా ఏడింటిలో గెలిచింది. అయితే.. దక్షిణాఫ్రికా, ఇంగ్లండ్ జట్ల మీద చెత్త ప్రదర్శన కనబరిచింది. వన్డేల్లో 24 మ్యాచ్లు ఆడిన భారత్ 14 సార్లు విజేతగా నిలిచింది.