Asia Cup – IPL : ఒకప్పుడు జాతీయ జట్టు(National Team)లోకి రావాలంటే దేశవాళీ ట్రోఫీ(Domestic Trophies) లే దిక్కు. అది కూడా నిలకడగా రాణిస్తేనే సెలెక్టర్ల నుంచి పిలుపు వచ్చిది. కానీ, ఇప్పుడంతా మారిపోయింది. పొట్టి ఫార్మాట్(T20 Cricket) రాకతో ఏళ్ల తరబడి నిరీక్షణకు తెరపడింది. ధనాధన్ ఇన్నింగ్స్లు, అత్యంత తక్కువ ఎకానమీ ఉంటే చాలు టీమిండియా జెర్సీ(Team India Jersey) ఒంటిమీదకి వస్తోంది. అవును.. ఇదంతా ఇండియన్ ప్రీమియర్ లీగ్(IPL) మహిమ. ఈ లీగ్లో చెలరేగి భారత జట్టులోకి వచ్చిన వాళ్లు చాలామందే. తాజాగా ఆసియా కప్(Asia Cup 2023)లోనూ ఐపీఎల్ ఫ్రాంచైజీల జోరు కొనసాగింది. బీసీసీఐ ఈరోజు ప్రకటించిన 17మంది బృందంలో ఎక్కువ మంది ఏ ఫ్రాంచైజీ ఆటగాళ్లో తెలుసా…
ఐపీఎల్తో యువ క్రికెటర్ల తలరాతే మారిపోయింది. విధ్వంసక ఇన్నింగ్స్లతో ఏడాది, రెండేళ్ల కాలంలోనే జాతీయ జట్టులోకి వచ్చేస్తున్నారు. సూర్యకుమార్ యాదవ్, యువ సంచలనం తిలక్ వర్మ, రింకూ సింగ్, అర్ష్దీప్ సింగ్, యశస్వీ జైస్వాల్, ఇషాన్ కిషన్.. వీళ్లంతా అలా వచ్చినవాళ్లే. ఈరోజు బీసీసీఐ ప్రకటించిన ఆసియా కప్ బృందలో వీళ్లు చోటు దక్కించుకున్నారు. ఈ స్క్వాడ్లో ఏ ఫ్రాంచైజీ నుంచి ఎంత మంది ఉన్నారంటే..?
ముంబై ఇండియన్స్ – ఈ ఫ్రాంచైజీ నుంచి అత్యధికంగా ఐదుగురు ఆటగాళ్లు ఆసియా కప్ బృందంలో ఉన్నారు. కెప్టెన్ రోహిత్ శర్మ, జస్ప్రీత్ బుమ్రా, ఇషాన్ కిషన్, సూర్యకుమార్ యాదవ్, తిలక్ వర్మ ఎంపికయ్యారు. వీళ్లు జట్టులో కీలక ఆటగాళ్లుగా ఎదగడం విశేషం.
గుజరాత్ టైటాన్స్ – మాజీ చాంపియన్ గుజరాత్ టైటాన్స్ నుంచి ఏకంగా ముగ్గురు ఆసియా కప్ జట్టులోకి వచ్చారు. కొంత కాలంగా నిలకడగా రాణిస్తున్న కెప్టెన్ హార్దిక్ పాండ్యా, శుభ్మన్ గిల్, మహమ్మద్ షమీలు టీమిండియా విజయంలోనూ కీలక పాత్ర పోషిస్తున్నారు. ఆసియా కప్లో పాండ్యా వైస్ కెప్టెన్గా ఎంపికైన విషయం తెలిసిందే.
రాయల్ చాలెంజర్స్ బెంగళూరు – మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ, మహమ్మద్ సిరాజ్
కోల్కతా నైట్ రైడర్స్ – శ్రేయాస్ అయ్యర్, శార్దూల్ ఠాకూర్.
ఢిల్లీ క్యాపిటల్స్ – కుల్దీప్ యాదవ్, అక్షర్ పటేల్
పంజాబ్ కింగ్స్ – అర్ష్దీప్ సింగ్.
లక్నో సూపర్ జెయింట్స్ – కేఎల్ రాహుల్
చెన్నై సూపర్ కింగ్స్ – రవీంద్ర జడేజా
రాజస్థాన్ రాయల్స్ – ప్రసిధ్ కృష్ణ
ఈ ఏడాది ఆగస్టు 30న ఆసియా కప్ మొదలవ్వనుంది. హైబ్రిడ్ మోడల్లో జరుగుతున్న ఈ ట్రోఫీకి భారత్, పాకిస్థాన్ ఆతిథ్యం ఇస్తున్నాయి. ఈసారి ట్రోఫీపై కన్నేసిన భారత్ ఆగస్టు 24న బెంగళూరులో శిక్షణ శిబిరంలో పాల్గొననుంది. ఈ టోర్నీలో ఇండియా, పాకిస్థాన్ సెప్టెంబర్ 2న తలపడనున్నాయి.