Dhruv Jurel | టీమిండియా యువ వికెట్ కీపర్, ఇంగ్లండ్తో రాజ్కోట్ టెస్టులో అరంగేట్రం చేసిన ధ్రువ్ జురెల్ ఆడిన రెండు మ్యాచ్లలోనూ అంచనాలకు మించి రాణించాడు. ఫ్యూచర్ ధోనీ అంటూ ప్రశంసలు అందుకుంటున్న జురెల్.. అంతర్జాతీయ క్రికెట్ కెరీర్లో ఆరంభాల్ని అయితే సద్వినియోగం చేసుకున్నాడు. అరంగేట్ర టెస్టులో నిలకడ, రాంచీ టెస్టులో అతడు చూపిన తెగువపై సర్వత్రా ప్రశంసలు కురుస్తున్నాయి. వికెట్ కీపింగ్తో పాటు అతడి బ్యాటింగ్ స్కిల్స్ చూసిన సెలక్లర్లు.. అతడిని టెస్టులలో ఎక్కువకాలం కొనసాగించాలని భావిస్తున్నారు. ఇప్పటివరకూ బాగానే ఉన్నా టీమిండియాకు టెస్టులలో రెగ్యులర్ వికెట్కీపర్గా ఉన్న రిషభ్ పంత్ తిరిగొస్తే జురెల్ పరిస్థితేంటి..? అతడికి ఫైనల్ లెవెన్లో చోటు దక్కుతుందా..? లేక బెంచ్కే పరిమితమవుతాడా..?
పంత్ రీఎంట్రీ..
2022 డిసెంబర్ 30న కారు ప్రమాదానికి గురై ఇప్పుడిప్పుడే పూర్తిస్థాయిలో కోలుకుంటున్న పంత్.. ఐపీఎల్లో రీంఎట్రీ ఇవ్వనున్నట్టు సమాచారం. ఐపీఎల్ తర్వాత నేరుగా భారత జట్టులోకి వస్తాడా..? రాడా..? అన్నది మాత్రం ప్రస్తుతానికైతే సస్పెన్సే. అయితే ఇంగ్లండ్తో టెస్టు సిరీస్ ముగిశాక భారత జట్టు మళ్లీ ఆగస్టు నుంచి స్వదేశంలో టెస్టులు ఆడనుంది. బంగ్లాదేశ్ జట్టు భారత్తో టెస్టులు ఆడేందుకు ఇక్కడకు రానుంది. ఈ సిరీస్ వరకైనా పంత్ టెస్టు జట్టులోకి వచ్చే అవకాశాలు మెండుగా ఉన్నాయి.
ఏం పర్లేదు..
మరి పంత్ వస్తే జురెల్ను తప్పిస్తారా..? అంటే బీసీసీఐ మాత్రం అలాంటిదేమీ లేదని అంటోంది. పంత్ వచ్చినా జురెల్కు వచ్చిన నష్టమేమీ లేదని, అతడిని స్పెషలిస్టు బ్యాటర్గా అయినా కొనసాగించొచ్చని బీసీసీఐ ప్రతినిధి ఒకరు తెలిపారు. ఇదే విషయమై ఆయన మాట్లాడుతూ.. ‘పంత్ వచ్చినా ధ్రువ్ జురెల్ జట్టులో తన స్థానాన్ని నిలుపుకుంటాడు. స్పెషలిస్టు బ్యాటర్గా కొనసాగుతాడు..’ అని తెలిపాడు.
అప్పుడే అసలైన సవాలు..
ఇంగ్లండ్తో సిరీస్లో భారత జట్టుకు జురెల్, సర్ఫరాజ్, ఆకాశ్ దీప్ రూపంలో నాణ్యమైన క్రికెటర్లు దొరికారు. ఈ సిరీస్లో యశస్వీ జైస్వాల్ కూడా అంచనాలకు మించి రాణించాడు. అయితే స్వదేశంలో ఉన్న అనుకూలత, అదీగాక ఇవే పిచ్లపై దేశవాళీలో ఆడిన అనుభవం వాళ్లకు పనికివచ్చింది. కానీ జైస్వాల్, సర్ఫరాజ్, జురెల్, ఆకాశ్ దీప్ వంటి యువ క్రికెటర్లకు అసలైన సవాల్ విదేశాల్లోనే. ఈ ఏడాది చివర్లో భారత జట్టు.. ఆస్ట్రేలియా పర్యటనకు వెళ్లనుంది. ఈ యువ ఆటగాళ్లంతా అక్కడ ఎలా రాణిస్తారనేదాన్ని బట్టి వాళ్ల భవితవ్యం తేలనుంది.