పొట్టి ప్రపంచకప్ మొదలైపోయింది. గ్రూప్ దశ తొలి రోజు రెండు అద్భుతమైన మ్యాచులు క్రీడాభిమానులను అలరించాయి. ఉండే కొద్దీ ఈ టోర్నీ మరింత ఆసక్తికరంగా మారబోతోంది. అయితే మెగా టోర్నీ మధ్యలో ఏ ఆటగాడైనా కరోనా బారిన పడితే పరిస్థితేంటి? అని కొందరు ప్రశ్నిస్తున్నారు. ముఖ్యంగా టీమిండియా అభిమానులు ఈ విషయంలో ఆందోళనగా ఉన్నారు.
ఎందుకంటే ఇప్పటికే గాయాల కారణంగా జస్ప్రీత్ బుమ్రా, రవీంద్ర జడేజా ఈ టోర్నీకి దూరమయ్యారు. ఇప్పుడు ఇంకెవరైనా జట్టుకు దూరమైతే అది జట్టుకు పెద్ద షాక్లా తగులుతుంది. దానికితోడు కొన్నిరోజుల క్రితమే పేసర్ మహమ్మద్ షమీ కరోనా బారిన పడ్డాడు. ఇప్పుడు కోలుకొని జట్టుతో చేరినప్పటికీ.. కరోనా భూతం ఇంకా పూర్తిగా పోలేదనడానికి అతనే నిదర్శనం. ఈ ఆలోచనలతో టెన్షన్ పడుతున్న అభిమానులకు ఐసీసీ శుభవార్త చెప్పింది.
ప్రపంచకప్ మధ్యలో ఏ ఆటగాళ్లకైనా కరోనా సోకినా.. వాళ్లు మ్యాచ్లు ఆడొచ్చని ప్రకటించింది. అలాగే గతంలో చేసినట్లు టోర్నీ సమయంలో తప్పనిసరిగా కరోనా పరీక్షలు కూడా చేయబోమని, ఒకవేళ కరోనా సోకినా ఐసోలేషన్లో ఉండాల్సిన అవసరం లేదని చెప్పింది. సదరు ఆటగాళ్లను మ్యాచ్లో ఆడించాలా? లేదా? అనే నిర్ణయం మాత్రం ఆయా జట్ల మెడికల్ టీం పరిధిలోనే ఉంటుందని పేర్కొంది.