WI vs ENG : రెండుసార్లు టీ20 వరల్డ్ కప్ గెలుపొందిన వెస్టిండీస్(West Indies) జట్టు స్వదేశంలో అదరగొడుతోంది. ఇప్పటికే ఇంగ్లండ్(England)తో జరిగిన వన్డే సిరీస్ కైవసం చేసుకున్న కరీబియన్ జట్టు.. పొట్టి సిరీస్ను కూడా ఒడిసిపట్టింది. ఉత్కంఠ రేపిన ఆఖరి టీ20లో బౌలర్లు రాణించడంతో రొవ్మన్ పావెల్(Rovman Powell) సేన అద్భుత విజయం సాధించింది. ఐదు టీ20ల సిరీస్ను 3-2తో సిరీస్ సొంతం చేసుకుంది. ఇంగ్లండ్ నిర్దేశించిన 133 పరుగుల లక్ష్యాన్ని విండీస్ 6 వికెట్ల నష్టానికి 19.2 ఓవర్లలో ఛేదించింది.
ఆఖరి ఓవర్లో విండీస్ విజయానికి 10 రన్స్ అవసరమయ్యాయి. క్రిస్ వోక్స్ వేసిన తొలి బంతికి జేసన్ హోల్డర్ 3 పరుగులు తీశాడు. ఆ తర్వాత బంతిని షాయ్ హోప్ సిక్సర్గా మలిచాడు. దాంతో వెస్టిండీస్ 4 వికెట్ల తేడాతో చిరస్మరణీయ విజయం సాధించింది. గుడకేశ్ మోతీ(Gudakesh Motie)కి ‘ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్’, సెంచరీలతో కదం తొక్కిన ఫిలిప్ సాల్ట్(Philip Salt)కు ‘ప్లేయర్ ఆఫ్ ది సిరీస్’ అవార్డులు దక్కాయి.
Christmas came early in Trinidad!🎁🎄#WIvENG #WIHomeForChristmas pic.twitter.com/CLwTH3e4eq
— Windies Cricket (@windiescricket) December 22, 2023
ట్రినిడాడ్లోని బ్రియాన్ లారా స్టేడియంలో జరిగిన మూడో టీ20లో ఇంగ్లండ్ తడబడింది. విండీస్ బౌలర్ గుడకేశ్ మోతీ 3 వికెట్లతో ఇంగ్లీష్ జట్టును దెబ్బతీశాడు. ఫిలిప్ సాల్ట్(38), లివింగ్స్టోన్(28), మోయిన్ అలీ(23) రాణించడంతో బట్లర్ బృందం 132 రన్స్ కొట్టింది. స్వల్ప లక్ష్య ఛేదనలో విండీస్ ఆటగాళ్లు షాయ్ హోప్(43 నాటౌట్), షెర్ఫానే రూథర్ఫర్డ్(30) కీలక ఇన్నింగ్స్తో జట్టును విజయ తీరాలకు చేర్చారు. ఇంగ్లండ్ బౌలర్లలో ఆదిల్ రషీద్, టాప్లే రెండేసి వికెట్లు పడగొట్టారు.