విశ్వవ్యాప్తంగా విశేష ఆదరణ పొందిన ‘ఫార్ములా-ఈ’ రేసుకు భాగ్యనగరం వేదిక కానుంది. వచ్చే ఏడాది ఫిబ్రవరి 11న హైదరాబాద్ నడిబొడ్డున జరుగనున్న
ఈ రేసుకు కౌంట్ డౌన్ షురూ అయింది. దేశ రాజధాని ఢిల్లీలో అతిరథ
మహారథుల మధ్య ఈ కార్యక్రమానికి తెరలేవగా.. మరో వంద రోజుల్లో
నగర రోడ్లపై ‘ఫార్ములా-ఈ’ కార్లు రయ్.. రయ్ మంటూ దూసుకెళ్లనున్నాయి.
హైదరాబాద్, నవంబర్ 4 (నమస్తే తెలంగాణ): ప్రపంచంలో అత్యంత వేగంగా ఆదరణ పొందుతున్న ‘ఫార్ములా-ఈ’ రేసింగ్ మొదటిసారిగా మన దేశంలో ట్రాక్ ఎకనున్నది. వచ్చే ఏడాది ఫిబ్రవరి 11న హైదరాబాద్ వేదికగా ఈ మెగా ఈవెంట్ జరగనున్నది. శుక్రవారం ఢిల్లీలో ఈ రేసుకు సంబంధించిన 100 రోజుల కౌంట్డౌన్ను అభిమానుల కోలాహలం మధ్య ప్రారంభించారు. కేంద్ర మంత్రి హర్దీప్ సింగ్ పూరి, నీతి ఆయోగ్ సీఈవో అమితాబ్ కాంత్, తెలంగాణ ఎంపీలు దీవకొండ దామోదర్రావు, కేఆర్ సురేష్రెడ్డి, క్రికెట్ దిగ్గజం కపిల్ దేవ్ సమక్షంలో ఈ వేడుక జరిగింది. ‘ఫార్ములా-ఈ’ ఈవెంట్ను ప్రపంచంలోని పన్నెండు దేశాలు మాత్రమే నిర్వహిస్తుండగా.. అందులో మన దేశం నుంచి హైదరాబాద్కు చోటు దక్కింది.
విశ్వనగరాలతో పోటీపడుతూ.. అభివృద్ధిలో దూసుకెళ్తున్న హైదరాబాద్.. ఇప్పుడు గ్లోబల్ సిటీలైన లండన్, బెర్లిన్, రోమ్, సౌ పాలో, మెక్సికో, జకార్తా, కేప్టౌన్, మొనాకో, దిరియా (సౌదీ అరేబియా) సరసన నిలువనుంది. ఈ సీజన్లో హైదరాబాద్ వేదికగా తొమ్మిదో రేస్ జరుగనుండగా.. వరుసగా నాలుగేండ్ల పాటు రాష్ట్ర రాజదానిలో ఈ ఈవెంట్ నిర్వహించనున్నారు.
2014లో ప్రారంభమైన ‘ఫార్ములా-ఈ’ రేసింగ్ ఇప్పటివరకు 100 రేసులను పూర్తి చేసుకున్నది. హైదరాబాద్లో జరిగే ఈ ఈవెంట్ను హెచ్ఎండీఏ బాధ్యులు, రాష్ట్ర ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అరవింద్ కుమార్ నిర్వహిస్తున్నారు. సంప్రదాయేతర ఇంధన వనరుల కంపెనీల్లో ఒకటైన గ్రీన్ కో ఈ ఈవెంట్ ను ప్రమోట్ చేస్తున్నది.
ఆటోమొబైల్ భవిష్యత్తుకు ఆధారం
ఫార్ములా 1 తరహాలోనే ఇప్పుడు జరగనున్న ఫార్ములా-ఈ కూడా ఉంటుందని, అయితే ఈ రేస్లో పాల్గొనే వాహనాలు పూర్తిగా బ్యాటరీ సాయంతో నడిచే ఈ-వెహికల్స్ అని నిర్వాహకులు తెలిపారు. భవిష్యత్తు ఆటోమొబైల్ రంగం మొత్తం దీనిపైనే ఆధారపడి ఉంటుందని, గంటకు 300 కిలోమీటర్ల వేగంతో నడిచే జెనరేషన్-3 కార్లు మొదటిసారిగా ఈ ఈవెంట్ సందర్భంగా ప్రవేశపెట్టబోతున్నట్లు తెలిపారు. ఆధునిక పరిజ్ఞానంతో తయారైన బ్యాటరీ, వేగంగా రీచార్జ్ అయ్యే టెక్నాలజీ వీటి ప్రత్యేకత అని అన్నారు.
ఫార్ములా వన్ రేసింగ్ ప్రత్యేకంగా తయారుచేసిన ట్రాక్ రోడ్లపై జరుగుతుందని, కానీ ఫార్ములా-ఈ ఈవెంట్ మాత్రం నగరంలోని సాధారణ రోడ్లపైనే నిర్వహిస్తామని తెలిపారు. స్ట్రీట్ సర్యూట్ తరహాలో వీధులపైనే జరుగుతుందని వివరించారు. ప్రపంచవ్యాప్తంగానే చాలా ఆసక్తిగా, ఉతంఠగా వీక్షించే క్రీడ కార్ రేసింగ్ అని, 1990వ ఏట నుంచే ఎఫ్-3 రేసులు జరుగుతున్నట్లు గుర్తుచేశారు. ఫార్ములా-ఈ పేరుతో తొలిసారి హైదరాబాద్లో జరుగుతుందని వివరించారు. రానున్న మూడు నెలల్లో అనేక ఈవెంట్లు జరుగుతాయని, సుమారు 40 వేల మందికి పైగా దీన్ని ప్రత్యక్షంగా వీక్షిస్తారని తెలిపారు. త్వరలోనే టికెట్ల విక్రయంపై నిర్ణయం జరుగుతుందని నిర్వాహకులు పేర్కొన్నారు.
విశ్వవ్యాప్త గుర్తింపు
‘ఫార్ములా ఈ-ప్రి’ పేరుతో నిర్వహిస్తున్న ఈ ఈవెంట్తో గ్లోబల్ సిటీల సరసన హైదరాబాద్ చేరిందని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కే తారక రామారావు తన సందేశంలో పేరొన్నారు. ఈ ఈవెంట్ను సమర్ధవంతంగా నిర్వహిస్తామని తెలిపారు. ‘ఈ-మొబిలిటీ సమ్మిట్’ పేరుతో ఆ రంగానికి చెందిన అనేక కంపెనీల ప్రతినిధులు, ఇన్వెస్టర్లు వస్తారని తద్వారా ఎంతో మందిని ఆకట్టుకోవచ్చన్నారు. హైదరాబాద్ నగరానికి ఈ-వెహికల్ రంగంలో ఉన్న ప్రత్యేకతలను, ప్రాధాన్యతను ఇన్వెస్టర్లకు వివరిస్తామని కేటీఆర్ పేర్కొన్నారు. తెలంగాణ ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అరవింద్ కుమార్ మాట్లాడుతూ… వచ్చే ఏడాది జరుగనున్న ‘ఫార్ములా-ఈ ప్రి’ ఈవెంట్ ఒకసారితో అయిపోదని, ఇకపైన ప్రతీ ఏటా ఇలాంటివి జరుగుతూ ఉంటాయని తెలిపారు.