అక్టోబర్లో ఆస్ట్రేలియా వేదికగా జరగాల్సి ఉన్న టీ20 ప్రపంచకప్లో భారత జట్టు ఆల్ రౌండర్ రవీంద్ర జడేజా సేవలను కోల్పోయింది. మోకాలి గాయం కారణంగా జడేజా.. ఆసియాకప్లో ఒక్క మ్యాచ్ మాత్రమే ఆడి టోర్నీ నుంచి తప్పుకున్నాడు. అయితే జడేజా లేని లోటును ఎవరు పూర్తి చేస్తారన్న ప్రశ్నకు సమాధానం దొరికిందంటున్నాడు భారత మాజీ ఓపెనర్ వసీం జాఫర్. జడేజా లేని లోటును అక్షర్ పటేల్ భర్తీ చేస్తాడని ధీమా వ్యక్తం చేశాడు.
జాఫర్ మాట్లాడుతూ.. ‘టీ20 ప్రపంచకప్లో టీమిండియాకు జడేజా లేని లోటుండదని నేను భావిస్తున్నా. జడేజా లేని లోటును భర్తీ చేస్తూ పవర్ ప్లేలో కూడా వికెట్లు తీయగల బౌలర్ టీమిండియాకు దొరికాడు. అక్షర్ బౌలింగ్ చేసేప్పుడు వికెట్ టు వికెట్ విసురుతున్నాడు. స్టంప్స్ను లక్ష్యంగా చేసుకుని బౌలింగ్ చేస్తుండటంతో ప్రత్యర్థి బ్యాటర్లకు అది కష్టంగా మారింది.
అదే ఫార్ములాతో అతడు వికెట్లు కూడా పడగొడుతున్నాడు. లైన్ అండ్ లెంగ్త్ తో బంతులు విసురుతున్న అక్షర్.. జడేజాకు మంచి రిప్లేస్మెంట్ అని నా అభిప్రాయం..’ అని తెలిపాడు.
జడేజా లేకపోవడంతో ప్రపంచకప్తో పాటు స్వదేశంలో ఆస్ట్రేలియా సిరీస్లో కూడా చోటు దక్కించుకున్న అక్షర్.. రెండు మ్యాచ్లలో రాణించాడు. మొహాలీ టీ20లో 4 ఓవర్లు బౌలింగ్ చేసిన అక్షర్.. 17 పరుగులిచ్చి 3 వికెట్లు పడగొట్టాడు. నాగ్పూర్ మ్యాచ్లో 2 ఓవర్లు బౌలింగ్ చేసి 13 పరుగులే ఇచ్చి 2 కీలక వికెట్లు తీసుకున్నాడు. టీమిండియా స్టార్ బౌలర్లు విఫలమైన చోట అక్షర్ అదుర్స్ అనిపిస్తున్నాడు.