IPL-Vasim Akram | టీ20 ప్రపంచకప్ సెమిస్లో టీమిండియ్ ఓటమితో అభిమానులు షాక్ తిన్నారు. పొట్టికప్లో భారత జట్టే ఫేవర్గా భావించినా.. సెమీఫైనల్లో ఇంగ్లాండ్ జట్టు 10 వికెట్ల తేడాతో టీమిండియాను మట్టికరిపించింది. దీంతో అప్పటి నుంచి ప్రపంచవ్యాప్తంగా పలువురు మాజీ క్రికెటర్లు టీమిండియా ప్రదర్శనపై విమర్శలు గుప్పిస్తున్నారు. అలాగే హెడ్ కోచ్ రాహుల్ ద్రవిడ్పై సైతం మండిపడుతున్నారు.
ఆస్ట్రేలియన్ బిగ్బాష్ లీగ్లో ఆడడం వల్లే ఇంగ్లిష్ ఆటగాళ్లు లాభపడ్డారా? అని మ్యాచ్ అనంతరం జరిగిన విలేకరుల సమావేశంలో ద్రావిడ్ను ఓ జర్నలిస్ట్ ప్రశ్నించాడు. దీనికి ద్రావిడ్ స్పందిస్తూ.. ‘చాలా మంది ఇంగ్లాండ్ క్రికెటర్లకు ఆస్ట్రేలియాలో బిగ్ బాష్ లీగ్లో ఆడిన అనుభవం ఉన్నది. భారత్తో సెమీస్తో పాటు ఈ టోర్నీలో కూడా వాళ్ల ఆటను చూస్తే దాన్ని గమనించవచ్చు. నా అభిప్రాయం మేరకు భారత ఆటగాళ్లు అదే మిస్ అయ్యారని అనిపిస్తుంది.
ఫారెన్ లీగ్స్లో ఆడకపోవడం మమ్మల్ని దెబ్బతీసింది. దీనిపై బీసీసీఐ తన నిర్ణయాన్ని పునరాలోచించుకోవాలి. ఈ లీగ్స్ భారత క్రికెట్ సీజన్ పీక్స్లో ఉన్న సమయంలో జరుగుతున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో ఇది మాకు కఠినమైన సవాల్తో కూడుకున్నది’ అని పేర్కొన్నాడు. ద్రావిడ్ ప్రకటనపై పాక్ మాజీ కెప్టెన్ వసీం అక్రమ్ బీసీసీఐతో పాటు టీమిండియా లక్ష్యంగా విమర్శలు గుప్పించాడు.
ఇండియన్ ప్రీమియర్ లీగ్.. టీ20 ప్రపంచకప్ను భారత్కు అందించలేకపోయిందని, 2008లో ఐపీఎల్ ప్రారంభమైన నాటి నుంచి ఇప్పటి వరకు భారత్ ప్రపంచకప్ను గెలువలేకపోయిందన్నాడు. ఓ టీవీ చానల్తో మాట్లాడుతూ ఐపీఎల్ భారత్కు పెద్ద మార్పును తీసుకువస్తుందని అందరూ భావించారని తెలిపాడు. 2007లో భారత్ టీ20 ప్రపంచకప్ను గెలుచుకుందన్న అక్రమ్.. 2011లో ప్రపంచకప్ గెలిచినా అది 50 ఓవర్ల క్రికెట్ మ్యాచ్ అని పేర్కొన్నాడు.
యువ ఆటగాళ్లకు ఐపీఎల్ పే క్యాప్ ఉండాలని తాను భావిస్తున్నానన్నాడు. ఆకలి అంటే ఏంటో తెలియాలని, అప్పుడే అర్థం చేసుకుంటారన్నాడు. ‘పాక్లో నెలకు రూ.24కోట్లు సంపాదిస్తున్నట్లయితే.. నా పని పూర్తయిన తర్వాత నేను అంత కష్టపడతానని అనుకోను’ అని తెలిపాడు. ‘ఆసియా కప్లో భారత బౌలర్లను గమనించాను. ఐపీఎల్ తర్వాత పేస్ను వదిలేస్తున్నారు. ఉదాహరణకు ఓ బౌలర్ 145 కిలోమీటర్ల వేగంతో బౌలింగ్ చేస్తున్నాడు. కానీ, ఐపీఎల్ సీజన్ తర్వాత పేస్ 130-135కి తగ్గుతుంది. దాని వెనుక కారణాలను బీసీసీఐ వెలికి తీయాలి’ అని సూచించాడు.