సుమారు ఆరేండ్ల తర్వాత జింబాబ్వే పర్యటనకు వెళ్లిన టీమిండియాకు వన్డే సిరీస్ ప్రారంభానికి ముందే గట్టి షాక్ తగిలింది. ఈ పర్యటనకు ఎంపికైన టీమిండియా ఆల్రౌండర్ వాషింగ్టన్ సుందర్.. గాయం కారణంగా వన్డే సిరీస్ నుంచి తప్పుకున్నాడు. ఎడమ చేతి భుజానికి గాయం కావడంతో సుందర్.. ఈ పర్యటన నుంచి వైదొలిగినట్టు బీసీసీఐ తెలిపింది.
ఐపీఎల్ ముగిశాక ఇంగ్లండ్లో కౌంటీ క్రికెట్ ఆడటానికి వెళ్లిన సుందర్ అక్కడ గాయపడ్డాడు. రాయల్ లండన్ కప్లో భాగంగా మ్యాచ్ ఆడుతుండగా సుందర్ ఎడమభుజానికి గాయమైంది. సుందర్ గాయాన్ని పరిశీలించిన వైద్య బృందం.. అతడికి విశ్రాంతి అవసరమని సూచించింది. దీంతో సుందర్ త్వరలోనే బెంగళూరులో ఉన్న జాతీయ క్రికెట్ అకాడమీ (ఎన్సీఏ) లో చికిత్స పొందనున్నాడు.
సుందర్ వైదొలగడంతో ఆ స్థానాన్ని బెంగాల్ యువ ఆల్రౌండర్ షాబాజ్ అహ్మద్ భర్తీ చేయనున్నాడు. రెండు నెలల క్రితం ముగిసిన ఐపీఎల్-15లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు తరఫున ఆడిన షాబాజ్.. బౌలింగ్తో పాటు బ్యాటర్గా కూడా మెరుపులు మెరిపించాడు. ఆ తర్వాత జరిగిన రంజీ సీజన్లో కూడా రాణించాడు. స్పిన్ ఆల్రౌండర్ కోసం చూస్తున్న భారత్.. షాబాజ్ను జింబాబ్వేకు పంపనున్నది.
ఇక తరుచూ గాయాల బారిన పడుతున్న సుందర్కు జట్టుకు ఎంపికై సిరీస్ నుంచి తప్పుకోవడం ఇదే ప్రథమం కాదు. గడిచిన ఏడాదికాలంగా అతడు.. అతడు దాదాపు ఏడు సిరీస్లలో జట్టుకు ఎంపికైనా గాయం కారణంగా దూరమయ్యాడు.
జింబాబ్వేతో భారత జట్టు.. ఈనెల 18, 20, 22న మూడు వన్డేలు ఆడనుంది. ఈ సిరీస్కు ముందు శిఖర్ ధావన్ను సారథిగా నియమించినా కెఎల్ రాహుల్ కోవిడ్ నుంచి కోలుకోవడంతో బీసీసీఐ అతడిని కెప్టెన్గా ప్రకటించింది.