ముంబై: స్వదేశంలో దక్షిణాఫ్రికాతో వన్డే సిరీస్ ఆడుతున్న ఇండియన్ టీమ్లోని కీలక బౌలర్ దీపక్ చాహర్ గాయం కారణంగా జట్టుకు దూరం కావడంతో.. అతని స్థానంలో వాషింగ్టన్ సుందర్కు చోటు కల్పించారు. దక్షిణాఫ్రికాతో జరుగాల్సిన మిగతా రెండు వన్డేలకు అతడు అందుబాటులో ఉండనున్నాడు. సుందర్ను జట్టులోకి తీసుకుంటున్నట్లు శనివారం బీసీసీఐకి చెందిన ఆలిండియా సీనియర్ సెలెక్షన్ కమిటీ ప్రకటించింది.
టీ20 సిరీస్లో భాగంగా ఇండోర్లో దక్షిణాఫ్రికాతో మూడోది, చివరిది అయిన టీ20 మ్యాచ్ ఆడుతుండగా చాహర్ వెన్నెముక పట్టేసింది. దాంతో లక్నోలో దక్షిణాఫ్రికాతో జరిగిన మొదటి వన్డేలో కూడా అతడిని తుదిజట్టులోకి తీసుకోలేదు. గాయం తగ్గకపోవడంతో చాహర్ను నేషనల్ క్రికెట్ అకాడమీకి పంపించారు. అక్కడి మెడికల్ టీమ్ పర్యవేక్షణలో అతడు ప్రాక్టీస్ చేయనున్నాడు.
చాహర్ ఇప్పటివరకు భారత్ తరఫున తొమ్మిది వన్డే ఇంటర్నేషనల్ మ్యాచ్లు ఆడి 15 వికెట్లు తీశాడు. అతని ఉత్తమ ప్రదర్శన 3/27. ఇతను లోయర్ ఆర్డర్లో కీలకమైన పరుగులు చేయగలడు. మొత్తం ఆరు ఇన్నింగ్స్లో బ్యాటింగ్ చేసి 180 పరుగులు రాబట్టాడు. అందులో రెండు అర్థసెంచరీలు ఉన్నాయి. బెస్ట్ స్కోర్ 69. బ్యాటింగ్ సగటు 60. కాగా, దక్షిణాఫ్రికాతో మొదటి వన్డే ఈ ఆదివారం, రెండు వన్డే మంగళవారం జరుగనున్నాయి.