గోవా: జాతీయ క్రీడల్లో తెలంగాణ అథ్లెట్లు సత్తాచాటుతున్నారు. గోవా వేదికగా జరుగుతున్న 37వ నేషనల్ గేమ్స్లో సోమవారం మన రాష్ర్టానికి మూడు పతకాలు వచ్చాయి. స్విమ్మింగ్లో వ్రితి అగర్వాల్ రజత వెలుగులు విరజిమ్మగా.. బిలియర్డ్స్లో ముస్తాఖ్ ఖాన్ సిల్వర్ మెడల్ సొంతం చేసుకున్నాడు. ఇక పురుషుల ఫెన్సింగ్లో తెలంగాణ జట్టుకు కాంస్య పతకం లభించింది. మహిళల స్విమ్మింగ్ ఫ్రీైస్టెల్ 800 మీటర్ల విభాగంలో బరిలోకి దిగిన వ్రితి అగర్వాల్ రెండో స్థానంలో నిలిచింది.
సోమవారం జరిగిన ఫైనల్లో వ్రితి 9 నిమిషాల 14.58 సెకన్లలో లక్ష్యాన్ని చేరి రజతం కైవసం చేసుకుంది. భవ్య సచ్దేవ్ (9 నిమిషాల 08.60 సెకన్లు; ఢిల్లీ), షీరీన్ (9ని.29.08 సె.; కర్ణాటక) వరుసగా స్వర్ణ, కాంస్యాలు దక్కించుకున్నారు. ఇటీవలి కాలంలో జాతీయ అంతర్జాతీయ పోటీల్లో నిలకడగా రాణిస్తున్న వ్రితి.. నేషనల్ గేమ్స్లోనూ అదే జోరు కనబర్చింది. కొలనులో చేపను తలపిస్తూ.. పతకంతో మెరిసిన వ్రితిని తెలంగాణ స్విమ్మింగ్ సంఘం ప్రతినిధులు, కోచ్లు ప్రత్యేకంగా అభినందించారు.
జాతీయ క్రీడల్లో నిలకడైన ప్రదర్శన కనబరుస్తున్న తెలంగాణ స్నూకర్ ప్లేయర్ ముస్తాఖ్ ఖాన్ ఫైనల్లో పరాజయం పాలై రజతం దక్కించుకున్నాడు. సోమవారం హోరాహోరీగా సాగిన తుదిపోరులో ముస్తాఖ్ 2-3 తో ఉత్తరప్రదేశ్కు చెందిన పారస్ గుప్తా చేతిలో ఓడాడు. జాతీయ క్రీడల్లో అరంగేట్రం చేసిన తొలిసారే ముస్తాఖ్ చక్కటి ప్రదర్శన కనబర్చాడు. తొలి రెండు సెట్లు కోల్పోయి వెనుకబడ్డ ముస్తాఖ్.. ఆ తర్వాత తేరుకొని వరుసగా రెండు సెట్లు నెగ్గి పోటీలోకి వచ్చినా.. ఉత్కంఠ భరితంగా సాగిన నిర్ణయాత్మక సెట్లో పరాజయం తప్పలేదు. మరోవైపు మహిళల 100 మీటర్ల హర్డిల్స్లో తెలుగమ్మా యి జ్యోతి ఎర్రాజి రికార్డు టైమింగ్ (13.22 సెకన్లు)తో పసిడి పతకం ఖాతాలో వేసుకుంది.