ప్రపంచ క్రికెట్లో మోడర్న్ గ్రేట్ల జాబితాలో అగ్రస్థానంలో ఉండే ఆటగాడు విరాట్ కోహ్లీ. అయితే అతనికి ధోనీ వంటి మెంటార్ దొరకడం వల్లనే అది సాధ్యమైందని పాకిస్తాన్ క్రికెటర్ అహ్మద్ షెహజాద్ అన్నాడు. 19 ఏళ్ల వయసులో పాక్ జట్టు తరఫున అరంగేట్రం చేసిన అతను.. ఎగ్రెసివ్ ఆటతో అందరినీ ఆకట్టుకున్నాడు.
అప్పట్లో షెహజాద్ను కోహ్లీతో పోల్చేవాళ్లు పాక్ అభిమానులు. అయితే పాక్లో మాజీ క్రికెటర్లు, సీనియర్లు ఇతరుల ఎదుగుదలను చూసి తట్టుకోలేరని షాకింగ్ కామెంట్స్ చేశాడు షెహజాద్. టెస్టు, వన్డే జట్టు నుంచి అతన్ని అర్ధంతరంగా తొలగించినప పాక్ జట్టు యాజమాన్యం.. అడపాదడపా టీ20 జట్టులో అవకాశం కల్పించింది.
2019లో పూర్తిగా అతన్ని అంతర్జాతీయ జట్టు నుంచి తొలగించింది. దీనిపై తాజాగా ఒక ఇంటర్వ్యూలో మాట్లాడిన షెహజాద్.. అప్పటి కోచ్ వకార్ యూనిస్ బోర్డుకు పంపిన లేఖ వల్లనే తన కెరీర్ నాశనమైందని చెప్పాడు. ‘‘షెహజాద్, ఉమ్రాన్ మాలిక్ ఇద్దరూ డొమెస్టిక్ క్రికెట్ ఆడి, తమ ఆటను మెరుగుపరుచుకుటేనే పాక్ జట్టుకు పనికొస్తారంటూ వకార్ యూనిస్ లేఖ రాశారు.
నేను ఆ లేఖ చదవలేదు కానీ.. నా గురించి అదే రాసినట్లు ఒక పీసీబీ అధికారి చెప్పారు. నా తరఫు వాదన కనీసం ఎవరూ వినలేదు. అసలు అలాంటిదేమైనా ఉంటే నా మొఖం మీదనే చెప్పాలి కదా. నేను కూడా అది సవాలుగా తీసుకొని ఎవరిది కరెక్టో నిరూపించేవాడిని. కానీ అలా జరగలేదు. నావైపు నుంచి చెప్పేది కనీసం వినకుండానే జట్టులో నుంచి తొలగించేశారు’’ అని షెహజాద్ వెల్లడించాడు.
ధోనీ వంటి మెంటార్ దొరకడం వల్లనే కోహ్లీ అత్యుత్తమ ఆటగాడిగా ఎదిగాడని, కానీ పాకిస్తాన్లో అలాంటి పరిస్థితి లేదని వాపోయాడు. పాక్ మాజీ ఆటగాళ్లు, సీనియర్లకు తనలాంటి జూనియర్లు సక్సెస్ అవడం నచ్చదని, ఇది పాక్ క్రికెట్ చేసుకున్న దురదృష్టమని పేర్కొన్నాడు.