దుబాయ్: భారత్ పరిమిత ఓవర్ల క్రికెట్ కెప్టెన్ విరాట్ కోహ్లి, వైస్ కెప్టెన్ రోహిత్ శర్మ మధ్య విభేదాలు ఉన్నాయన్న వార్తలు ఇప్పటివి కావు. 2019 వరల్డ్కప్ సందర్భంగా కూడా ఈ ఇద్దరూ డ్రెస్సింగ్ రూమ్లో కనీసం మాట్లాడుకోరు అన్న వార్తలు వచ్చాయి. అయితే వాటిని కోచ్ రవిశాస్త్రి కవర్ చేసే ప్రయత్నం చేశాడు. కానీ తాజాగా టీ20లకు విరాట్ కోహ్లి కెప్టెన్సీ బాధ్యతల నుంచి తప్పుకున్నాడన్న వార్తల నేపథ్యంలో మరోసారి కోహ్లి, రోహిత్ మధ్య విభేదాల అంశం తెరపైకి వచ్చింది.
రోహిత్ను తప్పిద్దామనుకున్నాడా?
తాజాగా ప్రముఖ వార్తా సంస్థ పీటీఐ తన విశ్వసనీయ వర్గాలు చెప్పాయంటూ రాసిన ఓ కథనం సంచలనం సృష్టిస్తోంది. పరిమిత ఓవర్ల క్రికెట్లో వైస్ కెప్టెన్ బాధ్యతల నుంచి రోహిత్ శర్మను తప్పించాలని కోహ్లి డిమాండ్ చేశాడన్నది ఆ వార్తల సారాంశం. రోహిత్ వయసు 34 ఏళ్లని, అతన్ని పక్కన పెట్టి వన్డేల్లో కేఎల్ రాహుల్కు, టీ20ల్లో రిషబ్ పంత్కు వైస్ కెప్టెన్సీ బాధ్యతలు ఇవ్వాలని కోహ్లి పట్టుబట్టినట్లు సమాచారం. ఇదే విషయాన్ని సెలక్షన్ కమిటీకి చెప్పగా.. అది కాస్తా బోర్డు చెవిన పడి కోహ్లిపై అసంతృప్తికి కారణమైంది. నిజమైన సక్సెసర్ను కోహ్లి కోరుకోవడం లేదన్న విమర్శలు అతనిపై వచ్చాయి.
రోహితే అసలైన లీడర్
నిజానికి డ్రెస్సింగ్ రూమ్లోనూ రోహిత్ శర్మనే అసలైన లీడర్గా మిగతా ప్లేయర్స్ భావిస్తారని బీసీసీఐకి చెందిన ఓ అధికారి కూడా చెప్పడం గమనార్హం. యువ క్రికెటర్లను ప్రోత్సహించడంలో రోహిత్ ఎప్పుడూ ముందే ఉంటాడని, ఐపీఎల్లో కెప్టెన్గా దీనిని చేసి చూపెడుతున్నాడని ఆ అధికారి చెప్పారు. కొన్ని రోజులుగా డ్రెస్సింగ్ రూమ్లో కోహ్లికి పూర్తి సపోర్ట్ దక్కడం లేదని కూడా వార్తలు వస్తున్నాయి. అతని పనితీరులో నిలకడ ఉండదని, డబ్ల్యూటీసీ ఫైనల్లో ఇద్దరు స్పిన్నర్లను ఆడించినా.. 2019 వరల్డ్కప్కు ముందు నాలుగో స్థానంలో నిలకడైన బ్యాట్స్మన్ను తయారు చేయలేకపోయినా దానికి అతని పనితీరే కారణమన్న విమర్శలు ఉన్నాయి.