Virat Kohli : భారత మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ వారసుడిగా విరాట్ కోహ్లీ తనదైన ముద్ర వేసిన విషయం తెలిసిందే. దూకుడే మంత్రంగా జట్టును వరల్డ్ నంబర్ 1 స్థాయికి తీసుకెళ్లాడు. అయితే.. తాను కెప్టెన్సీని ఆస్వాదించడం, భారత్ను తిరుగులేని శక్తిగా చేయడం వెనక ధోనీ పాత్ర ఉందని కోహ్లీ అన్నాడు. అంతేకాదు తాను ఎప్పుడూ మహీకి కుడిభుజం లాంటివాడినని ఈ రికార్డుల రారాజు చెప్పుకొచ్చాడు. ధోనీతో తన అనుబంధం గురించి కోహ్లీ తాజాగా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ) పాడ్కాస్ట్ 2వ సీజన్లో మరిన్ని ఆసక్తికర విషయాలు షేర్ చేసుకున్నాడు.
‘ధోనీ, నాకు మధ్య కెప్టెన్సీ బదలాయింపు గురించి ఎలాంటి ప్రశ్నలు, భయాలు తలెత్తలేదు. నిజం చెప్పాలంటే.. అప్పటి పరిస్థితుల్లో ధోనీ నన్ను తన వారసుడిగా సెలక్ట్ చేసుకున్నాడు. నేను అతని వైస్ కెప్టెన్. నేను ఎప్పుడూ అతనికి కుడి భుజం లాంటివాడిని. 2012 నుంచి అతను నన్ను తీవ్రంగా ప్రభావం చూపించాడు. నేను ప్రతిసారి ఆటను జాగ్రత్తగా గమనించేవాడిని. దాంతో, ఆత్మవిశ్వాసంగా ఉండేవాడిని. ఎందుకంటే.. నేను ఎన్నో మ్యాచ్ విన్నింగ్ ఇన్నింగ్స్లు ఆడాను’ అని విరాట్ కోహ్లీ వెల్లడించాడు.
ధోనీ, కోహ్లీ క్రీజులో ఉన్నారంటే కొండంత లక్ష్యమైనా కరిగిపోతుంది. ఛేజింగ్ మాస్టర్గా ఒకరు, ఫినిషర్గా మరొకరు భారత జట్టుకు ఎన్నో విజయాలు అందించిన విషయం తెలిసిందే. ధోనీ కెప్టెన్సీలో టీమిండియా రెండు ఐసీసీ ట్రోఫీలు నెగ్గింది. 2007 టీ20 వరల్డ్ కప్, 2011 వన్డే వరల్డ్ కప్ విజయాల్లో ధోనీ, కోహ్లీ కీలక పాత్ర పోషించారు. ముఖ్యంగా శ్రీలంకతో జరిగిన వరల్డ్ కప్ ఫైనల్లో ధోనీ బ్యాటింగ్ ఆర్డర్లో ముందుగా వచ్చి చిరస్మరణీయ ఇన్నింగ్స్ ఆడాడు. సిక్సర్తో మ్యాచ్ను ముగించి భారత్కు వన్డే వరల్డ్ కప్ అందించాడు.
ఒక దశాబ్దానికి పైగా ధోనీ, కోహ్లీలు భారత జట్టుకు ఎన్నో గుర్తిండిపోయే విజయాలు అందించారు. 2008 నుంచి 2019 వరకు కోహ్లీ, ధోనీతో డ్రెస్సింగ్ రూమ్ షేర్ చేసుకున్నాడు. దాంతో, వీళ్లిద్దరి మధ్య అనుబంధం చాలా ఎక్కువ. రెండేళ్ల క్రితం ఫామ్లో లేక ఇబ్బందిపడ్డ కోహ్లీ ఇప్పుడు టచ్లోకి వచ్చాడు. ఆసియా కప్, బంగ్లాదేశ్, శ్రీలంక సిరీస్లలో సెంచరీలతో చెలరేగాడు. బోర్డర్ – గవాస్కర్ ట్రోఫీలో మాత్రం కింగ్ కోహ్లీ భారీ స్కోర్ బాకీ ఉన్నాడు. మార్చి 1న ఇండోర్లో భారత్, ఆస్ట్రేలియా మధ్య మూడో టెస్టు జరగనుంది. నాలుగు వన్డేల సిరీస్లో భారత్ 2-0 ఆధిక్యంలో ఉన్న విషయం తెలిసిందే.