Virat Kohli : ఐపీఎల్ రెండో మ్యాచ్లోనే తనకు తిరుగులేదని విరాట్ కోహ్లీ(Virat Kohli) మరోసారి నిరూపించాడు. పంజాబ్ కింగ్స్ బౌలర్లను చీల్చిచెండాడుతూ బౌండరీలతో హోరెత్తించాడు. ఒత్తిడిలోనూ ఖతర్నాక్ ఇన్నింగ్స్ ఆడి ఆర్ధ శతకంతో బెంగళూరు విజయానికి బాటలు వేశాడు. సొంతస్టేడియంలో ఆర్సీబీ బోణీ కొట్టాక కోహ్లీ.. ఐపీఎల్ ముందు రెండు నెలల విరామం గురించి ఆసక్తికర విషయాలు వెల్లడించాడు. ఆ రెండు నెలలు కుటుంబంతో గడిపానని, ఆ క్షణాల్ని వర్ణించలేనని కోహ్లీ చెప్పాడు.
‘ఆ రెండు నెలలు మేము భారతదేశంలో లేము. మమ్మల్ని ఎవరూ గుర్తు పట్టలేని ప్రదేశంలో ఉన్నాం. కుటుంబంతో కలిసి గడిపాను. ఆ రెండు నెలలు మేము సాధారణ ప్రజల మాదిరిగా జీవించాం. నిజంగా అదొక అనిర్వచనీయమైన అనుభూతి. ఇద్దరు పిల్లలకు తండ్రి అయ్యాక కుటంబ జీవితంలో ఒక్కసారిగా మారిపోయింది. పిల్లలతో గడపడం ఎంతో గొప్పగా అనిపించింది’ అని కోహ్లీ వెల్లడించాడు.
‘అంతేకాదు కుటుంబంతో గడిపే సమయం లభించినందుకు ఆ దేవుడికి కృతజ్ఞతలు. రోడ్డు మీద వెళ్తుంటే ఎవరూ నన్ను గుర్తు పట్టకపోవడం ఒక కొత్త అనుభవమ’ని విరాట్ తెలిపాడు. భార్య అనుష్క శర్మ రెండో బిడ్డకు జన్మనివ్వడంతో కోహ్లీ లండన్లోనే ఉండిపోయాడు. అక్కడ ఒక రెస్టారెంట్లో కూతరు ‘వామిక’తో కలిసి ఉన్న ఫొటోలు వైరల్ అయ్యాయి. విరుష్క జంట తమ కుమారుడికి ‘అకాయ్’ అని పేరు పెట్టిన విషయం తెలిసిందే.
కూతరు ‘వామిక’తో విరాట్
పంజాబ్ కింగ్స్ నిర్దేశించిన 177 పరుగుల ఛేదనలో కోహ్లీ హాఫ్ సెంచరీతో కదం తొక్కాడు. దాంతో, పొట్టి ఫార్మాట్లో వందో ఆర్ధ శతకం నమోదు చేశాడు. అయితే… దూకుడుగా ఆడే క్రమంలో 77 పరుగుల వద్ద కోహ్లీ ఔటయ్యాడు. ఆ తర్వాత దినేశ్ కార్తిక్(28 నాటౌట్) ఫినిషింగ్ టచ్ ఇచ్చాడు. ఆర్సీబీ విజయంలో కీలక పాత్ర పోషించిన కోహ్లీ ‘ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్’ అవార్డు అందుకున్నాడు.