సౌతాఫ్రికాతో జరుగుతున్న టీ20 సిరీస్లో వరుసగా రెండు మ్యాచులు గెలిచిన టీమిండియా సిరీస్ తన ఖాతాలో వేసుకుంది. గువాహటి వేదికగా జరిగిన రెండో టీ20లో సూర్యకుమార్ యాదవ్తో కలిసి భారీ భాగస్వామ్యం నెలకొల్పిన టీమిండియా స్టార్ ఆటగాడు విరాట్ కోహ్లీ.. మూడో టీ20 ఆడటం లేదని సమాచారం.
ఈ మ్యాచ్లో కోహ్లీకి విశ్రాంతినిచ్చినట్లు తెలుస్తోంది. దీంతో అతను ఇండోర్ వెళ్లకుండా నేరుగా ముంబై వెళ్లిపోయాడట. అక్టోబర్ 6న టీ20 ప్రపంచకప్ కోసం ఆస్ట్రేలియా బయలుదేరే సమయంలో టీమిండియాతో కోహ్లీ కలుస్తాడని తెలుస్తోంది. భారత జట్టు ముంబై నుంచే ఆస్ట్రేలియా బయలుదేరుతుంది. ఈ విషయాన్ని ఒక బీసీసీఐ అధికారి తెలిపారు.
ఇంతకుముందు వెస్టిండీస్, జింబాబ్వేలతో జరిగిన సిరీసుల్లో కూడా విశ్రాంతి తీసుకున్న కోహ్లీ.. దాదాపు నెలరోజుల పాటు కనీసం బ్యాటు కూడా పట్టుకోలేదని ఇటీవలే ఒక ఇంటర్వ్యూలో చెప్పాడు. అయితే పునరాగమనంలో అదిరిపోయే ప్రదర్శనతో మునుపటి కోహ్లీని తలపిస్తున్నాడు. విశ్రాంతి తర్వాత కోహ్లీ ఆడిన 10 టీ20 ఇన్నింగ్సుల్లో 57పైగా సగటు, 141.75 స్ట్రైక్ రేటుతో 404 పరుగులు చేశాడు. కోహ్లీతోపాటు రాహుల్ కూడా ఈ మ్యాచ్ ఆడటం లేదని వార్తలొస్తున్నా ఈ విషయంపై ఇంకా క్లారిటీ రాలేదు.
Spotted📸: #ViratKohli was papped at Mumbai airport earlier today pic.twitter.com/Lo4t74WWfi
— Cricket Buzz (@CricSportsBuzz) October 3, 2022