ఆసియా కప్ సూపర్-4లో భాగంగా జరిగిన టీ20 మ్యాచ్లో పాకిస్తాన్ చేతిలో భారత్ ఓటమి పాలైంది. టాస్ ఓడి బ్యాటింగ్కు దిగిన భారత్ను మిడిలార్డర్ వైఫల్యం దెబ్బతీసింది. దాంతో భారీ స్కోరు చేయడంలో జట్టు విఫలమైంది. అయితే టీమిండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ (60) మాత్రం అదరగొట్టాడు. ఇదే విషయాన్ని మాజీ ఓపెనర్, కామెంటేటర్ గౌతం గంభీర్ ఎత్తిచూపాడు.
‘‘రోహిత్, రాహుల్ బాగా ఆడారు. కానీ కోహ్లీ అద్భుతంగా రాణించాడు. అది ఒప్పుకోని తీరాలి. సూర్యకుమార్, పంత్, హుడా వంటి వాళ్లంతా కోహ్లీ నుంచి ఒక ముఖ్యమైన విషయం నేర్చుకోవాలి. అదే రన్నింగ్. మనం ఎప్పుడూ రిస్కీ షాట్లు ఆడలేం. చూడండి.. కోహ్లీ కన్నా సూర్యకుమార్ దగ్గర ఎక్కువ షాట్లు ఉండొచ్చు, కానీ కోహ్లీ ఎప్పుడూ ఒత్తిడిలో ఉండడు.
ఎందుకంటే సింగిల్ వచ్చే ప్రాంతంలో కూడా అతను డబుల్ తీయగలడు. దాంతో సులభంగా ప్రతి ఓవర్లో 10-11 పరుగులు వచ్చేస్తాయి. దీంతో అనవసరమైన రిస్కులు తీసుకోవాల్సిన అవసరం ఉండదు. కొంచెం కుదురుకుంటే వాళ్లు ఎలాంటి షాట్లయినా ఆడగల ఆటగాళ్లు. కాబట్టి కోహ్లీ నుంచి ఈ ఒక్కటి నేర్చుకుంటే వాళ్లు మరింత మెరుగవుతారు’’ అని గంభీర్ చెప్పాడు.
కోహ్లీ ఇన్నింగ్స్లో 4 ఫోర్లు, ఒక సిక్సర్ ఉన్నాయి. ఎక్కువగా వికెట్లు కోల్పోయామని, లేదంటే తాను కూడా మరిన్ని సిక్సర్లు కొట్టేందుకు ప్రయత్నించేవాడినని మ్యాచ్ అనంతరం మీడియా సమావేశంలో కోహ్లీ చెప్పాడు. పాకిస్తాన్ చేతిలో ఓడినప్పటికీ.. శ్రీలంక, అఫ్గానిస్థాన్లతో జరిగే మ్యాచుల్లో గెలిస్తే టీమిండియాకు ఆసియా కప్ ఫైనల్ చేరే అవకాశం ఇంకా ఉంటుంది.