ముంబై: ఇండియన్ టీమ్ కెప్టెన్ విరాట్ కోహ్లిపై మాజీ ప్లేయర్ సురేశ్ రైనా ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. టీమ్ చూసిన గొప్ప కెప్టెన్లలో కోహ్లి ఒకడని అంటూనే.. అతడి వైఫల్యాలనూ ఎత్తి చూపాడు. విరాట్పై ఓ నిర్ణయానికి వచ్చే ముందు అతనికి మరింత సమయం ఇవ్వాల్సిన అవసరం ఉన్నదని అభిప్రాయపడ్డాడు. ఓ టీవీ చానెల్కు ఇచ్చిన ఇంటర్వ్యూలో రైనా ఇలా స్పందించాడు. అతడు నంబర్ వన్ కెప్టెనే. అతడు చాలా సాధించాడని రికార్డులే చెబుతున్నాయి. విరాట్ ప్రపంచంలో నంబర్ వన్ బ్యాట్స్మన్ కూడా.
మీరు ఐసీసీ ట్రోఫీ గురించి మాట్లాడుతున్నారు కానీ అతడు కనీసం ఐపీఎల్ టైటిల్ కూడా గెలవలేకపోయాడు. అతనికి మరింత సమయం ఇవ్వాలి. రానున్న రోజుల్లో 2,3 వరల్డ్కప్స్ జరగనున్నాయి. రెండు టీ20 వరల్డ్కప్లు, ఒక వన్డే వరల్డ్కప్ ఉన్నాయి. ఫైనల్ చేరడం అంత ఈజీ కాదు అని రైనా అన్నాడు. డబ్ల్యూటీసీ ఫైనల్లో న్యూజిలాండ్ చేతిలో ఓడిపోవడంపై స్పందిస్తూ రైనా ఈ వ్యాఖ్యలు చేశాడు.