కెప్టెన్సీ పోవడంతో వైట్బాల్ క్రికెట్లో కోహ్లీ మరింత ప్రమాదకరంగా మారే అవకాశం ఉందని టీమిండియా మాజీ ఓపెనర్ గౌతం గంభీర్ అన్నాడు. ఈ ఏడాది జరిగిన టీ20 ప్రపంచకప్ తర్వాత పొట్టి ఫార్మాట్ కెప్టెన్సీ నుంచి కోహ్లీ తప్పుకున్నాడు. వన్డే, టెస్టు జట్లకు సారధ్యం వహించాలని అతను భావించాడు.
అయితే జట్టు సెలెక్టర్లు మాత్రం వైట్బాల్ క్రికెట్లో ఇద్దరు సారధులు ఉండటం అనవసరమని భావించారు. ఈ క్రమంలోనే వన్డే కెప్టెన్గా కోహ్లీని తప్పిస్తూ నిర్ణయం తీసుకున్నారు. ఈ బాధ్యతలను కొత్త టీ20 కెప్టెన్ రోహిత్ శర్మకు అప్పగించారు. ఈ క్రమంలో కెప్టెన్సీ మార్పుపై గౌతం గంభీర్ మాట్లాడాడు.
వన్డే జట్టులో కోహ్లీ స్థానం ఏంటని ప్రశ్నించగా బదులిచ్చిన గంభీర్.. ‘టెస్టు జట్టులో రోహిత్ స్థానమేంటో వన్డే జట్టులో కోహ్లీ స్థానం కూడా అదే. కేవలం కెప్టెన్సీ ఉండదంతే. ఇది కోహ్లీకి మరింత స్వేచ్ఛనివ్వొచ్చు. కెప్టెన్సీ ఒత్తిడి లేకపోవడంతో అతను మరింత ప్రమాదకరమైన వైట్బాల్ బ్యాటర్గా మారొచ్చు’ అని అన్నాడు.
వైట్బాల్ లేదా రెడ్బాల్.. క్రికెట్ ఏదైనా కోహ్లీ పరుగులు చేస్తూనే ఉంటాడని, దేశం గర్వించేలా చేస్తాడనే నమ్మకం తనకుందని గౌతీ చెప్పాడు. కోహ్లీలోని బెస్ట్ను చూస్తామని తాను గట్టిగా నమ్ముతున్నట్లు వెల్లడించాడు. ఇవన్నీ వింటుంటే కోహ్లీని వన్డే కెప్టెన్సీ నుంచి తొలగించడం మంచిదనే గంభీర్ భావిస్తున్నట్లు కనిపిస్తోందని అభిమానులు అంటున్నారు.
కాగా, కోహ్లీని ఇలా వన్డే కెప్టెన్సీ నుంచి అర్ధంతరంగా తొలగించడంపై క్రికెట్ అభిమానుల్లో భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్న సంగతి తెలిసిందే.