వెస్టిండీస్ పర్యటనలో టీమిండియాకు దూరమైన విరాట్ కోహ్లీ.. జింబాబ్వే పర్యటనలో పునరాగమనం చేస్తాడని చాలా మంది అభిమానులు భావించారు. కానీ అనూహ్యంగా ఆ పర్యటనకు కూడా కోహ్లీకి విశ్రాంతినిచ్చారు. దీంతో అందరూ ఆశ్చర్యపోయారు.
అసలు కోహ్లీకి ఎందుకు రెస్ట్ ఇచ్చారు? అతను ఎప్పటి నుంచి మళ్లీ జట్టుతో కలుస్తాడు? అనేది సమాధానం లేని ప్రశ్నలా మారింది. కోహ్లీతోపాటు కేఎల్ రాహుల్ కూడా జింబాబ్వే పర్యటనకు దూరమయ్యాడు. అతను తన పరిస్థితిని వివరిస్తూ ట్వీట్ చేశాడు. కరోనా కారణంగా తను కోలుకోవడం లేట్ అయిందని, అందుకే జింబాబ్వే పర్యటనకు దూరమయ్యానని వివరించాడు. కోహ్లీ నుంచి మాత్రం ఇలాంటి క్లారిటీ దక్కలేదు.
అయితే ఇలా జింబాబ్వే పర్యటనలో విశ్రాంతి తీసుకోవాలని స్వయంగా కోహ్లీనే నిర్ణయం తీసుకున్నట్లు బీసీసీఐ వర్గాలు చెప్తున్నాయి. ‘‘సెలెక్టర్లతో కోహ్లీ మాట్లాడాడు. తను ఆసియా కప్ నుంచి అందుబాటులో ఉంటానని చెప్పాడు. మొదటి జట్టులోని సభ్యులకు ఆసియా కప్ నుంచి టీ20 ప్రపంచకప్ వరకు సరైన విశ్రాంతి దొరకదు.
అందుకే విండీస్ పర్యటన తర్వాత రెండు వారాల పాటు వాళ్లకు విశ్రాంతి తీసుకునే అవకాశం ఇచ్చాం‘‘ అని చెప్పారు. ఇదే సమయంలో గాయాలతో జట్టుకు దూరమైన వాషింగ్టన్ సుందర్, దీపక్ చాహర్ ఇద్దరూ కూడా జింబాబ్వే పర్యటనతో భారత జట్టులో పునరాగమనం చేస్తున్నారు.