ఫామ్లో లేక చాలా రోజులుగా ఇబ్బందులు పడుతున్న టీమిండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ.. దాదాపు నెలరోజుల విశ్రాంతి తర్వాత మళ్లీ ఆసియా కప్లో అంతర్జాతీయ మ్యాచ్ ఆడనున్నాడు. ఈ క్రమంలో క్రీడాభిమానుల ఫోకస్ అంతా అతనిపైనే ఉందనడం అతిశయోక్తి కాదు.
అంతర్జాతీయ క్రికెట్లో సుదీర్ఘకాలం నిలకడగా ఆడిన కోహ్లీ.. ఫామ్ లేమితో 2019 నవంబరు నుంచి ఇప్పటి వరకు ఒక్క సెంచరీ కూడా చెయ్యలేకపోయాడు. తాజాగా అతను సెంచరీ చెయ్యక 1000 రోజులు పూర్తయింది. ఇలాంటి పరిస్థితుల్లో కోహ్లీ కనుక సరిగా ఆడకపోతే.. జట్టులో నుంచి అతన్ని తొలగించాలంటూ కొందరు కామెంట్లు చేస్తున్న సంగతి తెలిసిందే. దీంతో అతని కెరీర్లో ఈ ఆసియా కప్ చాలా కీలకం కానుంది.
ఇంతటి ప్రాముఖ్యత కలిగిన టోర్నమెంటులో ఈ స్టార్ బ్యాటర్.. ప్రత్యేకమైన బ్యాటుతో రంగంలోకి దిగుతున్నాడట. ఎంఆర్ఎఫ్ కంపెనీ తయారు చేసే ఈ బ్యాట్ను అత్యంత ఖరీదైన ఇంగ్లిష్ విల్లో చెక్కతో తయారు చేశారట. దీన్ని ఆ కంపెనీ గోల్డ్ విజార్డ్ (బంగారు మాంత్రికుడు) అని పేరుపెట్టింది. సుమారు రూ.22 వేల ధర పలికే ఈ బ్యాటుతో కోహ్లీ.. ఆసియా కప్ కోసం యూఏఈ గడ్డపై అడుగుపెడతాడు. ఈ టోర్నీలో భారత జట్టు ఆగస్టు 28 ఆదివారం నాడు పాకిస్తాన్తో తొలి మ్యాచ్ ఆడుతుంది.