Virat Kohli : భారత స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ(Virat Kohli) ఐపీఎల్ 17వ సీజన్ కోసం స్వదేశం వచ్చేశాడు. పితృత్వ సెలవుల కారణంగా ఇన్నిరోజులు లండన్లోనే ఉండిపోయిన విరాట్ భారత గడ్డపై అడుగుపెట్టాడు. కింగ్ కోహ్లీ ఆదివారం ముంబై ఎయిర్పోర్టులో కెమెరా కంట పడ్డాడు. ఈ స్టార్ ఆటగాడు రాయల్ చాలెంజర్స్ బెంగళూరు ‘అన్బాక్స్'(Unbox) ఈవెంట్తో ఫ్యాన్స్ ముందుకు రానున్నాడు. ఈసారి మార్చి 19వ తేదీన ఈ కార్యక్రమం జరుగనుంది.
దక్షిణాఫ్రికా పర్యటనలో అదరగొట్టిన కోహ్లీ స్వదేశంలో జరిగిన ఇంగ్లండ్ సిరీస్కు దూరమయ్యాడు. అతడి భార్య అనుష్క శర్మ రెండో బిడ్డకు జన్మనివ్వడంతో లండన్లోనే ఉన్నాడు. విరుష్క జంట తమకు పుట్టిన మగబిడ్డకు ‘అకాయ్’ అని పేరు పెట్టింది. పితృత్వ సెలవుల అనంతరం విరాట్ మళ్లీ క్రికెట్ ఆడేందుకు సిద్దమయ్యాడు.
Virat Kohli Saab arrived 🥹
Its time to show levels to bcci 🗿 pic.twitter.com/JH7sVYMFZb— Ankit sharma (@KohlixAnkit) March 17, 2024
ఐపీఎల్ ఫేవరెట్ జట్లలో ఒకటైన ఆర్సీబీ ఇప్పటివరకూ ఒక్కసారి విజేతగా నిలవలేదు. మూడుసార్లు ఫైనల్ చేరినా ఆఖరి మెట్టుపై బోల్తా పడింది. నిరుడు కోహ్లీ, డూప్లెసిస్, మ్యాక్స్వెల్లు చెలరేగినా ఆర్సీబీ ప్లే ఆఫ్స్ చేరలేకపోయింది. దాంతో, ఈసారి ఎలాగైనా కప్పు కలను నిజం చేసుకోవాలని బెంగళూరు పట్టుదలతో ఉంది. మార్చి 22న ఐపీఎల్ 17వ సీజన్ షురూ కానుంది. ఆరంభ పోరులో డిఫెండింగ్ చాంపియన్ చెన్నై సూపర్ కింగ్స్ను ఆర్సీబీ ఢీకొననుంది. చెపాక్ స్టేడియంలో మెరుగైన రికార్డు లేని బెంగళూరు సీజన్లో బోణీ కొడుతుందా? లేదా? చూడాలి.