ఇంగ్లండ్ తో వన్డే సిరీస్ ముగిసిన తర్వాత టీమిండియా కరేబియన్ దీవులకు వెళ్లనుంది. అక్కడ వెస్టిండీస్ తో జులై 22 నుంచి ఆగస్టు 7 వరకు మూడు వన్డేలతో పాటు ఐదు మ్యాచుల టీ20 సిరీస్ కూడా ఆడాల్సి ఉంది. విండీస్ తో వన్డే సిరీస్ కు ఇప్పటికే భారత జట్టును ప్రకటించిన బీసీసీఐ. టీ20లకు ఆడించే తుది జట్టుపై కసరత్తులు చేస్తున్నది. ఈ క్రమంలో విరాట్ కోహ్లీ తో పాటు జస్ప్రీత్ బుమ్రా లకు విశ్రాంతినివ్వనున్నారని తెలుస్తున్నది.
బీసీసీఐ వర్గాల సమాచారం ప్రకారం.. వన్డే సిరీస్ లో విశ్రాంతి కోరుకున్న కోహ్లీ దానిని పొడిగించాలని సెలక్టర్లకు చెప్పిన్నట్టు తెలుస్తున్నది. ఇప్పటికే ఫామ్ లేమితో తీవ్ర విమర్శలు ఎదుర్కుంటున్న కోహ్లీకి మళ్లీ రెస్ట్ ఇవ్వడంపై కూడా చర్చ నడుస్తున్న నేపథ్యంలో సెలక్టర్లు మాత్రం విరాట్ కోరికను మన్నించారని బోర్డు వర్గాలు తెలిపాయి.
కోహ్లీతో పాటు టీమిండియా పేసర్ జస్ప్రీత్ బుమ్రా కు (వన్డేలలో కూడా విశ్రాంతినిచ్చారు) సైతం విరామమివ్వనున్నారు. విండీస్ పర్యటన ముగిసిన తర్వాత వచ్చేనెలలో ఆసియా కప్, ఆపై టీ20 ప్రపంచకప్ ను దృష్టిలో ఉంచుకుని సెలక్టర్లు విండీస్ సిరీస్ కు జట్టు ఎంపిక చేస్తున్నారు. ఇక ఐర్లాండ్, ఇంగ్లండ్ తో టీ20లకు ఎంపికైన జమ్మూ ఎక్స్ప్రెస్ ఉమ్రాన్ మాలిక్ కు చోటు దక్కే అవకాశాలు కూడా లేవని సమాచారం.
విండీస్ తో టీ20 సిరీస్ కు కోహ్లీ, బుమ్రా లకు విశ్రాంతినివ్వనున్న సెలక్టర్లు.. కెఎల్ రాహుల్, కుల్దీప్ యాదవ్ లను ఎంపికచేస్తారని బోర్డు వర్గాలు తెలిపాయి. ఐపీఎల్-15 ముగిసిన తర్వాత స్వదేశంలో జరిగిన దక్షిణాఫ్రికా సిరీస్ కు రెండ్రోజుల ముందు ఈ ఇద్దరూ గాయాలతో వైదొలిగారు. కాలికి శస్త్ర చికిత్స చేయించుకున్న రాహుల్ కోలుకున్నాడని, ప్రస్తుతం అతడు నెట్స్ లో బ్యాటింగ్ ప్రాక్టీస్ చేస్తున్నాడు. అయితే వచ్చే సోమవారం దీనిపై స్పష్టత రానుంది. ఆ రోజు విండీస్ పర్యటనలో టీ20 ఆడబోయే జట్టును బీసీసీఐ ప్రకటించే అవకాశముంది.