Virushka : ఓవల్ వేదికగా జరిగిన టెస్టు చాంపియన్షిప్ ఫైనల్లో(WTC Final 2023) భారత జట్టు దారుణ ఓటమి చవిచూసింది. టాపార్డర్ బ్యాటర్లు విఫలం కావడంతో టెస్టు గదను ఆస్ట్రేలియాకు అప్పగించింది. ఫైనల్ మరుసటి రోజు టీమిండియా స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ(Virat Kohli) ఏం చేశాడో తెలుసా..? భార్య అనుష్క శర్మ(Anushka Sharma)తో కలిసి లండన్లో కృష్ణదాస్ కీర్తన(Krishna Das’ kirtan)లకు హాజరయ్యాడు. అక్కడి బెంచీ మీద కూర్చొని కీర్తనలు వింటూ ప్రశాంతతను ఆస్వాదించాడు. ప్రస్తుతం ఆ ఫొటోలు సోషల్మీడియాలో వైరల్ అవుతున్నాయి.
భారత జట్టు త్వరలోనే వెస్టిండీస్ పర్యటనకు సిద్ధమవుతోంది. రెండు టెస్టులు, మూడు వన్డేలు, 5 టీ20లు ఆడనుంది. జూన్ 12 మొదలయ్యే విండీస్ టూర్ షెడ్యూల్ను ఇప్పటికే బీసీసీఐ విడుదల చేసింది. ఈ సిరీస్ విజయంతో టెస్టు చాంపియన్షిప్ ఫైనల్లో ఓటమి నుంచి తేరుకోవాలని భారత ఆటగాళ్లు భావిస్తున్నారు. 16వ సీజన్ ఐపీఎల్లో వరుసగా రెండు సెంచరీలు బాదిన కోహ్లీ కరీబియన్ టూర్లో రెచ్చిపోయి ఆడే అవకాశం ఉంది.
అజింక్యా రహానే, విరాట్ కోహ్లీ
కోహ్లీ సారథ్యంలో భారత జట్టు 2021-22 టెస్టు చాంపియన్షిప్ ఫైనల్(WTC Final) ఆడింది. అయితే.. న్యూజిలాండ్ చేతిలో ఓటమి పాలైంది. ఈ ఏడాది కూడా ఫైనల్ చేరిన టీమిండియా మళ్లీ ఆఖరి మెట్టుపై బోల్తా పడింది. మొదటి ఇన్నింగ్స్లో విరాట్ కోహ్లీ (14), రెండో ఇన్నింగ్స్లో 49 పరుగులతో ఫర్వాలేదనిపించాడు. ఐదో రోజు అజింక్యా రహానే(46), శ్రీకర్ భరత్(23) పోరాడినా లాభం లేకపోయింది. లియాన్ ఓవర్లో సిరాజ్ ఔట్ కావడంతో టీమిండియా 234కు ఆలౌటయ్యింది. ట్రావిస్ హెడ్(163), స్టీవ్ స్మిత్(121) సెంచరీలు బాదడంతో ఆస్ట్రేలియా మొదటి ఇన్నింగ్స్లో 469 రన్స్ కొట్టింది. ఆ తర్వాత బోలాండ్, కమిన్స్ విజృంభించడంతో భారత్ 269 పరుగులకే ఆలౌటయ్యింది. రెండో ఇన్నింగ్స్ను ఆసీస్ 270 వద్ద డిక్లేర్ చేసింది. 444 పరుగుల ఛేదనలో టీమిండియా ఏ దశలోనూ విజయానికి చేరువగా రాలేదు.