మీర్పూర్: అఫ్ఘానిస్థాన్, బంగ్లాదేశ్ జట్ల మధ్య జరిగిన ఏకైక టెస్టు మ్యాచ్లో బంగ్లా జట్టు భారీ విజయాన్ని నమోదు చేసింది. ఏకంగా 546 పరుగుల భారీ తేడాతో అఫ్ఘాన్ జట్టును మట్టికరిపించింది. ఒక జట్టు టెస్టు మ్యాచ్లో ఇంత భారీ తేడాతో ప్రత్యర్థి జట్టును ఓడించడం ఈ 21వ శతాబ్దంలోనే మొదటిసారని రికార్డులు స్పష్టం చేస్తున్నాయి.
అయితే, మొత్తం టెస్టు క్రికెట్ చరిత్రలో చూసుకుంటే ఇది మూడో భారీ విజయంగా ఉన్నది. అంతకుముందు 1928 లో ఆస్ట్రేలియాపై ఇంగ్లండ్ జట్టు 675 పరుగుల తేడాతో భారీ విజయాన్ని నమోదు చేసింది. ఇప్పటివరకు అదే అత్యంత భారీ విజయంగా రికార్డులో ఉంది. ఆ తర్వాత 1934లో ఇంగ్లండ్పై ఆస్ట్రేలియా జట్టు 562 పరుగుల భారీ తేడాతో విజయం సాధించింది. అది టెస్టుల్లో రెండో భారీ విజయంగా రికార్డుల్లో ఉన్నది.
కాగా, ఈ నెల 14న ప్రారంభమైన టెస్టు మ్యాచ్లో బంగ్లాదేశ్ జట్టు టాస్ ఓడి తొలుత బ్యాటింగ్కు దిగింది. తొలి ఇన్నింగ్స్లో బంగ్లాదేశ్ 382 పరుగులు చేసి ఆలౌట్ అయ్యింది. ప్రతిగా అఫ్ఘాన్ జట్టు 146 పరుగులకే కుప్పకూలింది. తర్వాత రెండో ఇన్నింగ్స్ ఆడిన బంగ్లా 4 వికెట్ల నష్టానికి 425 పరుగులు రాబట్టి డిక్లేర్ చేసింది. 662 పరుగుల భారీ లక్ష్యంతో బరిలో దిగిన అఫ్ఘాన్ జట్టు నాలుగో రోజు ఆట ముగియకముందే 115 పరుగులకు ఆలౌట్ అయ్యింది.