గుళ్లకు వెళ్లినప్పుడు అక్కడ ఉండే బిచ్చగాళ్లకు తోచినంత డబ్బులు ఇస్తుంటారు భక్తులు. అలా సంపాదించిన ఒక్కో రూపాయి ఖర్చు పెట్టకుండా దాచి పెట్టిందా వృద్ధురాలు. చివరకు అలా దాచిన డబ్బును దగ్గరలోని గుడికి విరాళంగా ఇచ్చింది. ఈ వింత సంఘటన కర్ణాటకలోని ఉడుపి జిల్లాలో వెలుగు చూసింది. స్థానికంగా ఆలయాల వద్ద భిక్షాటన చేసే అశ్వత్థామ అనే మహిళ.. గత 18 ఏళ్లుగా ఇదే వృత్తిలో కొనసాగుతోంది.
18 ఏళ్ల క్రితం భర్త మరణించడంతో ఏం చేయాలో తోచని పరిస్థితుల్లో ఆమె ఈ వృత్తిలో అడుగుపెట్టింది. అప్పటి నుంచి తను సంపాదించిన డబ్బులో చాలా తక్కువ ఖర్చు పెట్టుకుంటూ జీవనం సాగిస్తోంది. మిగతా డబ్బును ఒక బ్యాంకులో దాచి పెట్టి, కొంత మొత్తం అవగానే ఆలయాలకు విరాళంగా ఇవ్వడం మొదలు పెట్టింది. ఇలా తాజాగా బంట్వాల్ తాలూకాలోని శ్రీ క్షేత్ర రాజరాజేశ్వరి ఆలయంలో అన్నదానం నిర్వహించడానికి రూ.లక్ష విరాళం అందజేసింది.
అంతేకాదు అంతకుముందు సాలిగ్రాంలోని శ్రీ గురునారసింహ ఆలయానికి లక్ష రూపాయలు, అలాగే పలాలిలోని శ్రీ అఖిలేశ్వర ఆలయంలో ఉండే అయ్యప్ప భక్తుల కోసం రూ.1.5 లక్షలు విరాళం అందజేసింది. ఇవే కాకుండా లక్షలాది మందికి అన్నదానం చేసింది. ఉడుపి, దక్షిణ కర్ణాటకలోని పలు అనాథాశ్రమాలకు కూడా విరాళాలు ఇచ్చింది.
ఆమె ఇలా చేయడం నిజంగా చాలా గొప్ప విషయమని రాజరాజేశ్వరి ఆలయానికి చెందిన అధికారిణి పి. జయమ్మ అన్నారు. సమాజం తనుక అందించిన డబ్బునే ఇలా తిరిగిస్తున్నానని అశ్వత్థామ చెప్తోంది. ఎవరూ ఆకలితో అలమటించకూడదని తాను ఆ దేవుడిని ప్రార్థిస్తానని, అదొక్కటే తన కోరిక అని పేర్కొంది.