హైదరాబాద్, ఆట ప్రతినిధి: లీగ్ల పరంపర కొనసాగుతున్నది. ఇప్పటికే ఐపీఎల్ అభిమానులను అలరిస్తుండగా, అల్టిమేట్ టేబుల్ టెన్నిస్(యూటీటీ) అన్ని హంగులతో రాబోతున్నది. పుణె వేదికగా జూలై 13 నుంచి 30 వరకు యూటీటీ సీజన్-4 సీజన్కు తెరలేవనుంది.
భారత స్టార్ ప్యాడ్లర్లు శరత్ కమల్, సాతియాన్ జ్ఞానశేఖర్, మనికా బాత్రా, ఆకుల శ్రీజ వేర్వేరు జట్ల తరఫున బరిలోకి దిగుతున్నారు. వీరికి తోడు ఆఫ్రికా స్టార్ టీటీ ప్లేయర్ ఖాద్రి, బెనెడిక్ట్ డుడా(జర్మనీ), ఒమర్ అసర్(ఈజిప్టు), అల్వెరో రోబెల్స్(స్పెయిన్), లిలీ చాంగ్(అమెరికా), యాంగ్జి లు(ఆస్ట్రేలియా)తో లీగ్ ఆకర్షణీయంగా మారింది. జాతీయ టీటీ అసోసియేషన్ ఆధ్వర్యంలో జరుగనున్న లీగ్లో బెంగళూరు స్మాషర్స్, చెన్నై లయన్స్, దబాంగ్ ఢిల్లీ, గోవా చాలెంజర్స్, పుణెరి పల్టాన్, యూ ముంబా పోటీ పడనున్నాయి.